
మావోయిస్టులను చంపడమే మీ అజెండానా?
మావోయిస్టుల అజెండానే తమ అజెండా అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్కు.. మావోయిస్టులను చంపడమే అజెండానా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. గత పాలకులకు, కేసీఆర్ పాలనకు ఏమాత్రం తేడా లేదని ఆయన చెప్పారు. పోలీసులకు అత్యాధునిక వాహనాలు సమకూర్చినది ప్రజలను రక్షించడానికా, చంపడానికా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఆగడాలకు బ్రేకులు వేసేందుకు తెలంగాణ ప్రజాస్వామిక వేదికను ఏర్పాటు చేసినట్ల వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈనెల 30న చలో అసెంబ్లీ చేపడతామని తెలిపారు. 29న వరంగల్లో పార్లమెంటు ఉప ఎన్నికలపై వామపక్ష పార్టీలు సమావేశమై, అక్కడ పోటీ చేసే అభ్యర్థి ఎవరన్నది నియమిస్తామని చెప్పారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలంటూ అక్టోబర్ 2వ తేదీన అన్ని కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు.