
ఎన్నికల ఫలితాలపై కేజ్రీవాల్ ఆశ్చర్యం
న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేశాయని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అకాలీదళ్ పై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని, ఆప్ స్వీప్ చేస్తుందన్న అంచనాలు తప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. అత్యధిక సీట్లు సాధిస్తుందనుకున్న తమ పార్టీకి 25 శాతం ఓట్లు వచ్చాయని, అకాలీదళ్ కు మాత్రం 31 శాతం ఓట్లు రావడం వచ్చాయని.. ఇదేలా సాధ్యమని ప్రశ్నించారు. తమ ఓట్లు అకాలీదళ్ కు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు.
ఈవీఏంల పనితీరుపై ప్రజల్లో విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని అన్నారు. వీవీపీఏటీ స్లిప్పులతో ఈవీఏంలోని ఫలితాలను పోల్చి చూస్తే గణాంకాలు సరిగా ఉన్నాయో, లేదో తెలుస్తుందన్నారు. ఈవీఏంల ట్యాంపరింగ్ కు అవకాశముందని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్ కే అద్వానీ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఏంల వినియోగంపై పునరాలోచన చేస్తున్నాయని చెప్పారు. గోవాలో తమ పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.