హుబ్లీ నుంచి బెంగళూరు వెళుతున్న హంపీ ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు.
గుంతకల్లు: హుబ్లీ నుంచి బెంగళూరు వెళుతున్న హంపీ ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు. గౌరి బిదనూరు వద్ద దొంగలు రైలులోకి ప్రవేశించి ముగ్గురు మహిళల మెడల్లో ఉన్న నగలను తెంపుకుని పరారయ్యారు. వారం రోజుల్లో హంపీ ఎక్స్ప్రెస్లో దొంగలు పడటం ఇది రెండోసారి. కాగా ఈ నెల 5వ తేదీన గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని కల్లూరు-గార్లదిన్నె మార్గం మధ్యలో హంపి ఎక్స్ప్రెస్లో దోపిడీకి విఫలయత్నం చేశారు.
భద్రతా సిబ్బంది అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. కాగా వరుసగా హంపీ ఎక్స్ప్రెస్లో దొంగలు దోపిడీకి పాల్పడుతుండటంతో ప్రయాణికులు బెంబేలు ఎత్తుతున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైవేల్లో దొంగతనాలకు పాల్పడే 20 నుంచి 30 మంది సభ్యులున్న అంతర్ రాష్ర్ట ముఠా పని అయి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.