
ఐఎన్ఎస్ సునయన యుద్ధనౌక జలప్రవేశం
భారత నౌకాదళంలోని రెండో నేవెల్ ఆఫ్ షోర్ నిఘా నౌక ఐఎన్ఎస్ సునయన మంగళవారం జలప్రవేశం చేసింది.
భారత నౌకాదళంలోని రెండో నేవెల్ ఆఫ్ షోర్ నిఘా నౌక ఐఎన్ఎస్ సునయన మంగళవారం జలప్రవేశం చేసింది. సదరన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ సోని దీన్ని జలప్రవేశం చేయించారు. సదరన్ నావల్ కమాండ్ నియంత్రణలో ఉండే ఈ నౌకను గోవా షిప్యార్డు లిమిటెడ్లో రూపొందించారు. సమద్రంలో నిఘా అవసరాలను ఇది సమర్థంగా తీరుస్తుంది. తద్వారా భారత నౌకాదళ అవసరాలు చాలావరకు నెరవేరుతాయి.
ప్రధానంగా తీరప్రాంతంలో నిఘా అవసరాలు, సముద్రంలో భద్రతాపరమైన చర్యలకు ఉపయోగపడేలా ఈ యుద్ధనౌకను తీర్చిదిద్దారు. ఒక యుద్ధనౌకను తయారుచేయాలంటే దాని డిజైనింగ్ దగ్గరనుంచి వివిధరకాల పరికరాలను సమగ్రంగా అందులో అమర్చడం, ఆ తర్వాత సముద్ర వాతావరణానికి అనుగుణంగా ఉండేలా నౌకను తీర్చిదిద్దడం.. ఇవన్నీ చాలా క్లిష్టమైన చర్యలని వైస్ అడ్మిరల్ సోని చెప్పారు.
ఐఎన్ఎస్ సునయనలో ప్రధానాంశాలు..
1) ఈ యుద్ధనౌకలో రెండు డీజిల్ ఇంజన్లున్నాయి.
2) ఇది గంటకు 25 నాటికల్ మైళ్లకంటే అధిక వేగంతో వెళ్తుంది.
3) దీనికి ఆటోమేటిక్ పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంది.
4) అత్యాధునిక నేవిగేషన్ సిస్టమ్, కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నాయి.
5) ఇది హెలికాప్టర్ను కూడా తీసుకెళ్లగలదు.
6) ఇందులో 8 మంది ఆఫీసర్లు, 108 మంది సెయిలర్లు ఉంటారు.