జయ వదిలి వెళ్లిన సంపద ఎంతో తెలుసా? | Jayalalithaa's net worth: This is how much Amma left behind | Sakshi
Sakshi News home page

జయ వదిలి వెళ్లిన సంపద ఎంతో తెలుసా?

Published Tue, Dec 6 2016 3:46 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

జయ వదిలి వెళ్లిన సంపద ఎంతో తెలుసా?

జయ వదిలి వెళ్లిన సంపద ఎంతో తెలుసా?

తమిళనాట రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా అవతరించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోతూ అసువులు బాసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత వదిలి వెళ్లిన సంపద ప్రస్తుతం ఎవరికి దక్కుతుందో అంటే అందరికీ ప్రశ్నార్థకమే. ఎవరిపైనా ఆధారపడని అమ్మ ఇటు రాజకీయ వారసులను, అటు ఆస్తిపై హక్కులను ఎవరికీ కట్టబెట్టనున్నారో ఎన్నడూ వెల్లడించలేదు. జయలలిత మరణంతో పార్టీ పగ్గాలు ఆమె నెచ్చిలి శశికళకు, ముఖ్యమంత్రి పదవి జయమ్మ విధేయుడు పన్నీర్ సెల్వంకు అప్పజెప్పుతూ పార్టీ శ్రేణులు నిర్ణయించారు. కానీ ఆమె ఆస్తులకు ఎవరు వారసురాల్లో ఇంకా వెల్లడికాలేదు.
 
అయితే ఆర్కె నగర్ నియోజకవర్గ ఉపఎన్నిక సమయంలో అన్నాడీఎంకే అధినేత్రిగా జయలలిత పోటీ చేసేటప్పుడు 2015 జూన్ వరకు తనకు రూ.117.13 కోట్ల ఆస్తులున్నట్టు ఆమెనే ప్రకటించారు. ఆ ఆస్తులో పోయెస్ గార్డెన్లోని 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రూ.43.96 కోట్ల జయలలిత నివాస గృహం వేద విలాస్కు ప్రస్తుతం శశికళ వారసురాలు కాబోతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఈ ప్రాపర్టీని జయలలిత తల్లి సంధ్య 1967లో రూ.1.32 లక్షలకు కొనుగోలు చేసినట్టు రిపోర్టులు పేర్కొన్నాయి.  
ఆమెకున్న ఇతర ఆస్తులు: 
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల గ్రామంలో 14.50 ఎకరాలు, తమిళనాడులో కంచీపురంలో 3.43 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ప్రాపర్టీని ఆమె తన తల్లి సంధ్యతో కలిసి 1968లో కొనుగోలు చేశారు. కాంచీపురం చెయూర్లోని ప్రాపర్టీని 1981లో కొనుగోలు చేశారు. జయలలితకు మొత్తం నాలుగు వాణిజ్య భవనాలున్నాయి. దానిలో ఒకటి హైదరాబాద్లో ఉంది. రిపోర్టుల ప్రకారం దీనిలో ఒక ప్రాపర్టీ తను దత్తత తీసుకున్న శశికళ అన్న కుమారుడు వీఎన్ సుధాకర్కు చెందుతున్నట్టు తెలుస్తోంది. 
కార్లు...
రెండు టయోటా ప్రాడో ఎస్యూవీలు, టెంపో ట్రావెలర్, టెంపో ట్రాక్స్, మహింద్రా జీప్, 1980లో తయారు చేసిన అంబాసిడర్ కారు, మహింద్రా బోలెరో, స్వరాజ్ మ్యాక్సీ, 1990 మోడల్ కాంటెస్సాలు జయలలిత దగ్గరుండేవి. ఈ మొత్తం తొమ్మిది వాహనాల ఖరీదు రూ.42,25,000. 
ఆభరణాలు....
21280.300 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు తన దగ్గరున్నాయని తమిళనాడు సీఎంగా ఆమెనే ఓ సారి ప్రకటించారు. అక్రమాస్తుల కేసుల్లో ఇవి ప్రస్తుతం కర్నాటక ప్రభుత్వ ట్రెజరీలో ఉన్నాయని, ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నట్టు తెలిపారు. అదేవిధంగా రూ.3,12,50,000 విలువ కలిగిన 1,250 కేజీల వెండి ఉన్నట్టు పేర్కొన్నారు. 
స్థిర, చరాస్తులు...
2016 ఎన్నికల్లో ఆర్కే నగర్ నియోజకవర్గ తరుఫున పోటీ చేసేటప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు ఆమె తనకు చరాస్తులుగా రూ.41.63 కోట్లున్నాయని, స్థిరాస్తులు రూ.72.09 కోట్లున్నట్టు ప్రకటించారు.  
పెట్టుబడులు, షేర్లు...
అక్రమాస్తుల కేసుల ఆరోపణల నేపథ్యంలో ఆమెకు పలు కంపెనీల్లో ఉన్న డిపాజిట్లను, షేర్లను పోలీసులు సీజ్ చేశారు. 2004 స్పెషల్ సీ.సీ 208 ప్రకారం వాటిని కోర్టు కస్టడీకి తీసుకుంది. పార్టనర్గా ఆమె ఐదు సంస్థల్లో పెట్టుబడులు పెట్టింది. వాటి విలువ రూ.27.44 కోట్లు. ఆ ఐదు సంస్థలు శ్రీ జయ పబ్లికేషన్స్, శశి ఎంటర్ప్రైజెస్, కోదండ ఎస్టేట్, రాయల్ వ్యాలీ ఫ్లోరిటెక్ ఎక్స్పోర్ట్స్, గ్రీన్ టీ ఎస్టేట్.
 
అయితే ఆమెకు ఎన్ఎస్ఎస్లో కాని, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు వంటి వాటిలో కానీ ఎలాంటి పెట్టుబడులు లేవు. ఎలాంటి వ్యక్తిగత రుణాలు, అడ్వాన్స్లు ఎవరికీ, ఏ సంస్థకి జయలలిత ఇ‍వ్వనేలేదట. ఈ విషయాలను ఆమెనే ఓసారి తన అఫిడవిట్లోనే పేర్కొన్నారు. 2015-16 ఏడాదికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను ఆమె దాఖలు చేశారు. 2013-14లో పన్ను చెల్లింపులన్నీ ఆమె పూర్తిచేశారు. 
 
చివరి డిక్లరేషన్ కింద ఆమె చేతిలో రూ.41,000 నగదు, రూ.2.04 కోట్ల ఆస్తిపాస్తులున్నట్టు ఆమె వెల్లడించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement