
'గజేంద్రను ఉసిగొల్పారు'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కార్యకర్తలు ఉసిగొల్పడం వల్లే గజేంద్ర సింగ్(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. కిసాన్ ర్యాలీలో ఆప్ నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం కూడా అతడిని ఆత్మహత్యకు పురికొల్పాయన్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ఢిల్లీ పోలీసులు నివేదిక సమర్పించారు. గజేంద్ర సింగ్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా అడ్డుకునేందుకు ఆప్ ప్రభుత్వం ప్రయత్నించిందని నివేదికలో ఢిల్లీ పోలీసులు ఆరోపించారు.
కాగా, ఏ కేసు విచారణలోనైనా ప్రత్యక్ష సాక్షుల వాంగూల్మామే అత్యంత కీలకమని ఢిల్లీ పోలీసు చీఫ్ బీఎస్ బాసీ విలేకరుల సమావేశంలో చెప్పారు. విచారణలో దర్యాప్తు అధికారి ప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తారని, కేసుకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలిస్తారని వెల్లడించారు.
రాజస్థాన్లోని దౌసా గ్రామానికి చెందిన రైతు గజేంద్రసింగ్ ఈనెల 22న జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన కిసాన్ ర్యాలీలో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.