
నేడు కశ్మీర్ సీఎంగా ముఫ్తీ ప్రమాణం
జమ్మూ: జమ్మూకశ్మీర్లో ఎట్టకేలకు 49 రోజుల తర్వాత నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా పీడీపీ అగ్రనేత ముఫ్తీ మహ్మద్ సయీద్(79) ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నగరంలోని జమ్మూ యూనివర్సిటీలో గల జనరల్ జోరావర్ సింగ్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ముఫ్తీ చేత గవర్నరు ఎన్ఎన్ వోరా ప్రమా ణం చేయించనున్నారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, మురళీ మనోహర్ జోషీ హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ, ముఫ్తీ సయీద్లు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడనున్నారు. ఇరుపార్టీల ఉమ్మడి కార్యాచరణను కూడా విడుదల చేయనున్నారు. పీడీపీ వ్యవస్థాపకుడైన ముఫ్తీ మహ్మద్ సయీద్ కశ్మీర్ సీఎంగా పదవి చేపడుతుండటం ఇది రెండోసారి.
గతంలో 2002 నుంచి పీడీపీ-కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లపాటు సారథ్యం వహించారు. ఈసారి సయీద్ పూర్తిగా ఆరేళ్లు పదవిలో కొనసాగుతారు. బీజేపీ నేత నిర్మల్ సింగ్ ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు. సీఎంతోపాటు రెండు పార్టీల నుంచి 12 మంది చొప్పున మంత్రులుగా ప్రమాణం చేస్తారు.