
బీజేపీకి డబుల్ సెంచరీ!
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండువందలకు పైగా స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించనుందని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఏబీపీ న్యూస్-నీల్సన్ జాతీయ సర్వేలో వెల్లడైంది. బీజేపీకి ఈ ఎన్నికల్లో 210 స్థానాలు లభిస్తాయని, కాంగ్రెస్కు ఇదివరకటి ఏ ఎన్నికల్లోనూ రానంత తక్కువగా 81 స్థానాలు మాత్రమే దక్కుతాయని ఈ సర్వే అంచనా వేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) 11 స్థానాలు దక్కనున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం...
- బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వైపే ఓటర్లలో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మోడీ ప్రధాని కావాలని 53 శాతం ఓటర్లు కోరుకుంటున్నారు.
- కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టాలని 15 శాతం ఓటర్లు కోరుకుంటున్నారు.
- ‘ఆప్’ వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ ప్రధాని కావాలని కేవలం 5 శాతం ఓటర్లు మాత్రమే కోరుకుంటున్నారు.
- ఓటర్లలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతోంది. యూపీఏ ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వరాదని 61 శాతం ఓటర్లు భావిస్తున్నారు.
- యూపీఏ సర్కారు పనితీరు అత్యంత దారుణంగా ఉందని 43 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు.
- ఇదివరకటి ఎన్డీఏ సర్కారు పనితీరు ప్రస్తుత యూపీఏ సర్కారు కంటే మెరుగ్గా ఉందని 52 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు.
- ప్రధాని మన్మోహన్ సింగ్ పనితీరు అత్యంత దారుణంగా ఉందని 38 శాతం ఓటర్లు అభిప్రాయపడ్డారు.
- ‘ఆప్’ గురించి తమకు తెలుసునని 63 శాతం ఓటర్లు చెప్పారు. అయితే, తాము ‘ఆప్’కు ఓటు వేయబోమని 49 శాతం ఓటర్లు తేల్చి చెప్పారు.
- దేశవ్యాప్తంగా 2013 డిసెంబర్ 28 నుంచి 2014 జనవరి 12 వరకు మొత్తం 64,006 మంది ఓటర్ల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు ఏబీపీ న్యూస్ వెల్లడించింది.