
కోహ్లీ ఎఫెక్ట్; కోచ్ పదవికి రవిశాస్త్రి అప్లికేషన్
న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ పదవికి దూరంగా ఉంటానని గతంలో వ్యాఖ్యానించిన రవిశాస్త్రి.. అందరూ ఊహించినట్లే యూటర్న్ తీసుకున్నాడు. హెడ్కోచ్ పదవికి దరఖాస్తు చేయనున్నట్లు మంగళవారం ప్రకటించాడు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ పంతం నెగ్గినట్లయింది. పదవీకాలం పొడగింపునకు సుముఖంగా లేని అనిల్ కుంబ్లే.. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రాజీనామా చేయడంతో హెడ్ కోచ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
హెడ్కోచ్ పదవి కోసం మే నెలలో దరఖాస్తులు కోరగా.. వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, దొడ్డ గణేష్, పైబ్స్, రాజ్పుత్ తదితర దిగ్గజాలు అప్లికేషన్లు పంపారు. కుంబ్లే పదవీకాలం చివరిరోజుల్లోనే.. మరికొంత కాలం ఆయనను కొనసాగించాలని బోర్డు భావించింది. కానీ అందుకు కెప్టెన్ కోహ్లీ సుముఖంగా లేకపోవడం, అదే సందర్భంలో జట్టులోని విబేధాలు బయటపడటంతో కుంబ్లే రాజీనామాచేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీసీసీఐ రెండోసారి కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించి.. జూలై 9 తుది గడువుగా నిర్ణయించింది. దీంతో రవిశాస్త్రి కోసమే అప్లికేషన్ల ప్రక్రియను పొడగించారనే విమర్శలు వెల్లువెత్తాయి.
కోహ్లీ కోరితే అన్నీ జరిగిపోతాయా?
కెప్టెన్ కోహ్లీ కోరికమేరకు రవిశాస్త్రి హెడ్కోచ్ పదవికి అప్లై చేసినా.. ఎంపిక కావడం అంతసులువేమీ కాదు. ఎందుకంటే, ఈ సారికూడా శాస్త్రిని ఇంటర్వ్యూ చేయబోది సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన సలహా మండలే! గతంలో కోచ్పదవికి శాస్త్రిని రిజెక్ట్ చేసింది కూడా ఈ మండలే కావడం గమనార్హం. కోచ్ ఎంపిక విషయంలో కెప్టెన్ల ప్రమేయంపై మాజీ సీఓఏ రామచంద్రగుహ తీవ్రఅసహనం వెలిబుచ్చిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఎంపిక ఎలా ఉండబోతుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.