
మరో వివాదంలో క్రికెట్ దేవుడు!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు.
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. భారతరత్న పురస్కారాన్ని దుర్వినియోగం చేశారనే అరోపణలతో వీకే నస్వా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది. అయితే తాజాగా ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో డీఆర్డీవో స్థలాన్ని ఆక్రమించి సచిన్ వ్యాపార భాగస్వామి రిసార్ట్ కట్టారని ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ను రాజ్యసభ సభ్యుడైన సచిన్ కోరారు.
సమ్మర్ క్యాంపు కోసం ఏర్పాటు చేసుకున్న రిసార్టులో 50 అడుగుల స్థలంపై వివాదం తలెత్తింది. డీఆర్డీవోకు చెందిన ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ వద్ద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిషేధం ఉంది. అయినా అక్కడ ఓ రిసార్ట్ నిర్మించారు. వాస్తవానికి ఆ వేసవి విడిది (రిసార్ట్) ఓనర్ సచిన్ వ్యాపార భాగస్వామి సంజయ్ నారంగ్. అయితే ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు మనోహర్ పారికర్ సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. రక్షణశాఖకు సంబంధించిన అంశం కావడంతో.. కేవలం పారికర్ మాత్రమే తనను ఈ వివాదం నుంచి బయట పడేయగలరని సచిన్ భావిస్తున్నారట. ఇప్పటివరకూ ఈ రిసార్ట్ కు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్ మెంట్ కథనం ప్రకారం.. తొలుత ఇక్కడ కేవలం ఓ టెన్నిస్ కోర్టును నిర్మించుకునేందుకు నారంగ్ అనుమతి తీసుకున్నారు. ఆ తర్వాత సకల సౌకర్యాలతో వసతులు ఏర్పాటుచేసుకున్నారని ఆరోపిస్తున్నారు. గతనెలలో ఈ విషయంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐలకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. మరోవైపు ఈ వివాదంపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సచిన్, సంజయ్ నారంగ్ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.