గుజరాత్ అల్లర్లతో సంబంధం ఉన్న రెండు కేసుల్లో మాజీ ఐపీఎస్ సంజీవ్ భట్ అభ్యర్థనలన సుప్రీంకోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ: అది 2002, ఫిబ్రవరి 27.. గోద్రాలో రైలు తగలబడిన చాలాసేపటికి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ముఖ్య అధికారుల సమావేశం జరిగింది. ఆ గదిలో ఒక కానిస్టేబుల్ (డ్రైవర్) కూడా ఉన్నాడు. రైలు ఘటనకు ప్రతీకారంగా పెల్లుబిగే ప్రజాగ్రహానికి అడ్డుకట్ట వేయొద్దంటూ సీఎం అధికారులను ఆదేశించారని తర్వాత పుకార్లు పుట్టాయి. ఆ డ్రైవర్ ను లోపలికి పంపిది ఒక ఐపీఎస్ ఆఫీసరని తేలింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు అపిడవిట్ రూపొందించేలా ఐపీఎస్ ఆఫీసర్ తతను బలవంతపెట్టాడని సదరు కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. దీంతో ఐపీఎస్ అధికారిపై కేసు నమోదయింది.
ఆ అధికారి పేరు సంజీవ్ భట్. ఇప్పుడాయన సర్వీసులో లేరు. కానీ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ సాగుతోంది. దీనితోపాటు నాటి గుజరాత్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఈ-మెయిల్ ను హ్యాక్ చేసి, ట్యాంపర్ చేశారని కూడా భట్ పై కేసు నమోదయింది. ఈ రెండు కేసుల్లో తనపై నమోదయిన ఎఫ్ఐఆర్ పై సిట్ చేత తిరిగి దర్యాప్తు చేయించాలని ఆయన సుప్రీంకోర్టును అభ్యర్థించారు. భట్ అభ్యర్థనలను మంగళవారం కోర్టు కొట్టివేసింది. కింది కోర్టులో విచారణ యథావిథిగా జరుగుతుందని పేర్కొంది.