
డేటా ఇవ్వమని అమెరికా బెదిరించింది!
వాషింగ్టన్: అమెరికా రహస్య నిఘా(ఎన్సీఏ) కార్యక్రమం ‘ప్రిజమ్’ కోసం తమకు యూజర్ల డేటా ఇచ్చి సహకరించకపోతే రోజుకు రూ. 1.5 కోట్ల జరిమానా వేస్తామని అమెరికా ప్రభుత్వం తమను హెచ్చరించినట్లు ఇంటర్నెట్ దిగ్గజం యాహూ తెలిపింది. కోర్టు డాక్యమెంట్లలో ఈ విషయం స్పష్టమైందని యాహూ కంపెనీ న్యాయవాది రాన్ బెల్ ఓ బ్లాగులో తెలిపారు. నిఘా యత్నాలను అడ్డుకోవడానికి తాము చేస్తున్న యత్నాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఆన్లైన్ యూజర్ల సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం 2007లో ఓ కీలక చట్టాన్ని సవరించిందని, అది రాజ్యాంగ విరుద్ధం కనుక సహకరించేందుకు నిరాకరించామని వెల్లడించారు.
అయితే తమ వాదన కోర్టులో వీగిపోవడంతో అమెరికా యూజర్ల 1,500 పేజీల డాక్యుమెంట్ల డేటాను ఇవ్వాల్సి వచ్చిందని, ఒక దశలో డేటా ఇవ్వకపోతే భారీ జరిమానా విధిస్తామని అధికారులు బెదిరించారని పేర్కొన్నారు. ఈ నిఘా కార్యక్రమం కోసం పెద్ద మొత్తంలో డేటా సేకరించడానికి యాహూ సంస్థతో పాటు, గుగూల్ ను కూడా అమెరికా ఆశ్రయించింది.