
టీసీఎస్ కొత్త సీఎఫ్వో.. రేపటినుంచే..
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చీఫ్ పైనాన్షియల్ ఆఫీసర్గా వి. రామకృష్ణన్ ఎంపికయ్యారు. సోమవారం జరిగిన టీసీఎస్ బోర్డు సమావేశంలోఈ మేరకు నిర్ణయం జరిగిందని టీసీఎస్ ఒక ప్రకనటలో తెలిపింది. ఈ నియామకం ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ బీఎస్సీ ఫైలింగ్ లో పేర్కొంది. కంపెనీలో రాంకీగా పేరొందిన రామకృష్ణన్, 1999 లో టిసిఎస్ ఫైనాన్స్ లో చేరారు. టిసిఎస్ ఆఫ్ నార్త్ అమెరికా ఫైనాన్సియల్ హెడ్గా 7 సంవత్సరాలు పనిచేశారు. 17 సంవత్సరాలుగా టిసిఎస్ ఫైనాన్స్ టీంలో రామకృష్ణన్ కీలక సభ్యుడుగా ఉన్నారనీ, తనతో గత 9 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నారని సీఈవో రాజేష్ గోపీనాథన్ చెప్పారు. ఆయన నాయకత్వంలో టిసిఎస్ ఫైనాన్స్ నాయకత్వం మరింత విస్తరిస్తుందనే నమ్మకం తనకుందని చెప్పారు
మరోవైపు టీసీఎస్ ఎగ్జిక్యూటివ్గా, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్ టాటా సన్స్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. , టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన తర్వాత, ఈ కీలకమైన బాధ్యతలను ఆయన మంగళవారం స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో టీసీఎస్ సీఈవోగా రాజేష్ గోపినాథ్ను టీసీఎస్ బోర్డు నియమించింది.
కాగా ఒకవైపు అంతర్గత పోరులో, ముసలం తో దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ కష్టాలు పడుతోంటే.. మరో దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) మాత్రం దూసుకుపోతోంది. తాజాగా షేర్ల బై బ్యాక్ ప్రకటనతో ఇతర ఐటీ కంపెనీలకు సవాల్ విసిరింది. ఆయా కంపెనీల దగ్గర భారీగా పేరకు పోయిన నగదు నిల్వలను ఇన్వెస్టర్లకు పంపిణీ చేయాలన్ని డిమాండ్ వినిపస్తోంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కూడా షేర్ల బై బ్యాక్ ప్రతిపాదనకు తాము వ్యతిరేకంగా కాదని, సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.