
బోస్ వివాదం..చరిత్ర ఏం చెబుతోంది?
సుభాష్ చంద్రబోస్.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రధాన స్రవంతికి భిన్నమైన సాయుధ బాటలో మొక్కవోని దీక్షతో పోరాడిన ధీరుడు. కాంగ్రెస్
అధ్యక్ష పదవి నుంచి తుపాకులతో, యుద్ధట్యాంకులతో కదం తొక్కే ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) వరకు సాగిన ఆయన ఉద్యమ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరమే. గాంధీ, నెహ్రూలతో బోస్ విభేదాల దగ్గర్నుంచి.. ఆయన అదృశ్యం, మరణం వరకూ అన్నీ జవాబుల్లేని ప్రశ్నలుగా, అనుమానాలుగా మిగిలిపోయాయి. మిస్టరీకి నేతాజీ సంకేతంగా మారిపోయాడు. సాయుధ సంఘర్షణతో చరిత్ర సృష్టించిన బోస్ను అదే చరిత్ర ఎప్పటికప్పుడు పునరుజ్జీవితుడిని చేస్తోంది.
నేతాజీ 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మేవాళ్లు కొందరైతే, ఆయన ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్లో గుమ్నానీ బాబా పేరుతో జీవించాడని చెప్పేవాళ్లు కొందరు. నేతాజీకి పేరు రాకుండా నెహ్రూ వాస్తవాలను కప్పిపుచ్చారని అనుమానించేవాళ్లు మరికొందరు. ఈ అనుమానాలను తొలగించేందుకు నేతాజీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద రహస్య ఫైళ్లను బయటపెట్టాలన్న డిమాండ్ ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. అయితే వీటిని బహిర్గతం చేస్తే నేతాజీ చరిత్రతో ముడిపడిన దేశాలతో సంబంధాలు దెబ్బతింటాయని ప్రభుత్వం చెబుతోంది. ఏదైతేనేం.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ నెల 16న తమ వద్దగల 64 ‘నేతాజీ’ రహస్య ఫైళ్లను బహిర్గతం చేసింది.
నేతాజీ 1945 తర్వాత జీవించే ఉన్నట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారని, వారిపై నెహ్రూ ప్రభుత్వం చాలా ఏళ్లపాటు నిఘా పెట్టిందని ఆ ఫైళ్లలో ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో.. అసలు గాంధీ, నెహ్రూలతో బోస్ సైద్ధాంతిక విభేదాలేంటి? వారిద్దరు నేతాజీ తమకు పోటీ అని భావించారా? రెండో ప్రపంచ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలతో గాంధీ, నెహ్రూ, బోస్ల సంబంధాలు, వైరుధ్యాలు ఎలా ప్రభావితమయ్యాయి? స్వాతంత్య్రం తర్వాత నెహ్రూ నేతాజీ మిస్టరీని విప్పకపోవడానికి ఆయనతో ఉన్న విభేదాలే కారణమన్న ఆరోపణల్లో నిజమెంత? నేతాజీ కుటుంబ సభ్యులపై స్వతంత్ర భారత ప్రభుత్వ నిఘా వెనుక దురుద్దేశాలున్నాయన్న అనుమానాల్లో బలమెంత? ఇలాంటి మరెన్నో అంశాలపై ఈ వారం ఫోకస్..
సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో నిజంగా మరణించారా అన్న చర్చ 1945 నుంచి ఇప్పటివరకూ మధ్య మధ్య తలెత్తుతూనే ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ చర్చ మరింత ఉధృతితో ముందుకొచ్చింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం, గాంధీ-నెహ్రూ వారసత్వాన్ని ప్రజల మనోఫలకం మీంచి పూర్తిగా తుడిచి పెట్టే ప్రయత్నాలు ఈ చర్చకు సరికొత్త రూపును, ఊపును ఇచ్చాయి. బోస్ దగ్గరి బంధువులు కొందరు గట్టిగా గళం విప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న బోస్ తాలూకు రహస్య పత్రాలను బయట పెట్టాలన్న డిమాండ్ అలా ఉండగా, పశ్చిమబెంగాల్లోని తృణమూల్ ప్రభుత్వం తన వద్ద ఉన్న రహస్య పత్రాలను బయట పెట్టింది.
నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాతి కాంగ్రెస్ ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ బంధువులపై, ఆయన నాయకత్వం వహించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సభ్యులపైన నిఘా ఉంచిన సంగతిని అవి వెల్లడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పత్రాలలో ఏముందో వాటిని బయట పెడితే తప్ప తెలియదు. ఎన్నికల ముందు వీటి వెల్లడికి హామీ ఇచ్చిన బీజేపీ నాయకత్వం ఇప్పుడంత ఆసక్తి చూపించడం లేదు. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినవచ్చన్న వాదాన్ని సన్న సన్నగా వినిపిస్తోంది. బోస్ మరణం లేదా అంతర్ధానం గురించి నడుస్తున్న చర్చ మొత్తంలో ఒకటి స్పష్టంగా కనిపిస్తోంది.
అది, నెహ్రూకు గురి పెట్టడం! నెహ్రూ, బోస్ల మధ్య బద్ధ శత్రుత్వం ఉండేదనీ, అధికారానికి తనతో బోస్ పోటీ పడతాడనే భయంతో నెహ్రూ ఆయన అడ్డు తొలగించుకునేందుకు కుట్ర చేశాడనే భావనను కలిగించే దిశగా చర్చ సాగుతోంది. నెహ్రూ కన్నా ఎక్కువ ప్రజాదరణ బోస్కే ఉండేదనీ, బోస్ సజీవంగా దేశానికి తిరిగి వచ్చి ఉంటే నెహ్రూ అధికారపీఠం కదిలిపోయి ఉండేదనీ బోస్ బంధువులు కొందరు నొక్కి చెబుతున్నారు. ఇక మమతా బెనర్జీ బోస్ తాలూకు రహస్య పత్రాలను బయటపెట్టడం వెనుక బెంగాల్ ఆత్మగౌరవ కోణాన్ని ఒడుపుగా వాడుకోవాలన్న ఆలోచన ఉండటంలో ఆశ్చర్యం లేదు.
అయితే, బోస్ను నెహ్రూ తన అధికారానికి పోటీగా నిజంగానే భావించాడా; ఆయన కుట్రదారేనా అన్నది కచ్చితంగా తేల్చి చెప్పగల ఆధారాలు ఏవీ ఇంతవరకు మన ఎదురుగా లేవు. ఈ పరిస్థితిలో చర్చ మొత్తం కొన్ని కాంగ్రెసేతర పక్షాల రాజకీయ లక్ష్యాలూ, బోస్ బంధువుల భావోద్వేగ స్పందనల కలగలుపుగా మారి వాస్తవాలకు పూర్తిగా దూరమై ఊకదంపుడు చర్చగా పరిణమించే ప్రమాదం సహజంగానే ఉంటుంది. కనుక అటో ఇటో ఒరిగిపోవడం కాకుండా అసలు చరిత్ర ఏం చెబుతోందో తెలుసుకుని ఎవరికి వారు ఒక అభిప్రాయానికి రావడం ఒక మార్గం. రాజమోహన్ గాంధీ రాసిన గాంధీ జీవిత చరిత్ర మోహన్ దాస్ ఆధారంగా ఆ చరిత్ర ఏమిటో క్లుప్తంగా చూద్దాం.
అంతర్జాతీయ దృక్కోణాలు
ఈ ప్రశ్నలకు జవాబులు రాబట్టాలంటే జాతీయరాజకీయాల నుంచి అంతర్జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి. గాంధీ, నెహ్రూ, రాజగోపాలాచారి, బోస్ తదితరులకు తమవైన అంతర్జాతీయ దృక్కోణాలున్నాయి. గాంధీది బ్రిటిష్ పట్ల మిత్ర వైరుధ్యమైతే, బోస్ది శత్రు వైరుధ్యమని చెప్పుకున్నాం. నెహ్రూ సోవియట్ యూనియన్ను అభిమానించేవాడు. 1938-42 మధ్య కాలంలో యూరప్లో సంభవించిన కల్ల్లోలం భారత్ను, తదనుగుణంగా జాతీయ నాయకుల అంతర్జాతీయ దృక్కోణాలను కూడా ప్రభావితం చేస్తూ వచ్చింది. జాతీయ-అంతర్జాతీయ రాజకీయాలు కలగలిసి పోయిన సందర్భమది.
1938లో జర్మనీ (హిట్లర్), ఇటలీ (ముసోలినీ), బ్రిటన్, ఫ్రాన్స్ల మధ్య జరిగిన మ్యూనిక్ ఒప్పందం చెకొస్లవేకియా విషయంలో హిట్లర్ ఇష్టానుసారం వ్యవహరించడానికి అవకాశమిచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్లు తమ ఆత్మగౌరవాన్ని హిట్లర్కు తాకట్టు పెట్టిన ఒప్పందంగా దానిని గర్హించిన గాంధీ; చెక్, యూదు జాతీయుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మద్దతు తెలిపాడు. ఇందుకు భిన్నంగా బోస్ను జర్మనీ తెగువా, ఇటలీ ఆత్మవిశ్వాసం ఆకట్టుకున్నాయి. బ్రిటిష్-కాంగ్రెస్ పొత్తును, కాంగ్రెస్ మంత్రివర్గాలను అంతమొందించి సామూహిక శాసనోల్లంఘన చేపట్టడానికి ఇదొక అవకాశంగా కనిపించింది. రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలనుకున్నది అందుకే. ఆయనకు భిన్నంగా నెహ్రూ అన్ని రకాల ఫాసిస్ట్ శక్తులనూ వ్యతిరేకించే వైఖరి తీసుకున్నాడు.
బోస్ జర్మన్ సంబంధాలు
ఇదే సమయంలో బోస్ కలకత్తాలోని జర్మన్ కాన్సూల్తో సంబంధం పెట్టుకుని ఏవో ఏర్పాట్లలో ఉన్నట్టు కేంద్ర గూఢచారి విభాగం వద్ద ఉన్న సమాచారాన్ని బొంబాయిలో న్యాయశాఖమంత్రిగా ఉన్న కె.ఎం. మున్షీ సంగ్రహించి గాంధీకి ఇచ్చాడు. ఇటలీ నియంత ముస్సోలినీ పట్ల కూడా బోస్ ప్రశంసాభావంతో ఉన్నట్టు అప్పటికే ఆధారాలు కనిపించాయి. గాంధీకి ఇవి సహజంగానే కలవరం కలిగించాయి. హిట్లర్ కారణంగా యూరప్ మొత్తాన్ని యుద్ధ మేఘాలు ఆవరించడం, జర్మనీ-రష్యాల మధ్య సంధి జరగడం, హిట్లర్ సేనలు పోలండ్లో అడుగుపెట్టడంతో జర్మనీతో బ్రిటన్ యుద్ధానికి దిగడం, భారతీయులు వేల సంఖ్యలో యుద్ధంలో చేరడం, 1941లో హిట్లర్ సోవియట్ యూనియన్పై దాడి చేయగానే భారత్లోని కమ్యూనిస్టులు కూడా బ్రిటన్కు మద్దతు ఇవ్వడం వగైరా పరిణామాలు వరసగా జరిగిపోయాయి.
జపాన్ విస్తరణ దాహం
ఇదే సమయంలో జర్మనీకి మిత్ర రాజ్యంగా ఉన్న జపాన్, ఆసియా అంతటా కమ్ముకోవడం ప్రారం భించింది. చైనాపై దాడి చేసి, ఆ తర్వాత భారత్ లోకి కూడా చొచ్చుకు వస్తున్నట్లు కనిపించింది. 1939-44 మధ్య కాలంలో జపాన్ విస్తరణ దాహం మనదేశంలో పెద్ద చర్చనీయాంశంగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్ సదస్సుల్లో తరచు ఇది చర్చలోకి రావడం, జపాన్కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయ డం, జపాన్ను అహింసాయుతంగా ఎదుర్కోవాలని గాంధీ నొక్కి చెప్పడం జరుగుతూ వచ్చాయి. 1942లో బ్రిటిష్ స్థావరమైన సిం గపూర్ను, రంగూన్ను జపాన్ చేజిక్కించుకుని భారత్ గుమ్మంలోకి అడుగుపెట్టింది.
బోస్ మద్దతుదారులు జపాన్ సేనలకు సహకరిస్తారన్న వదం తి గాంధీ చెవిన పడింది. జపాన్కు వ్యతిరేకంగా అహింసాయుత ప్రతిఘ టనను గాంధీ నొక్కిచెబితే; గెరిల్లా యుద్ధతంత్రాన్ని అనుసరించాలన్న వైఖరిని నెహ్రూ, కమ్యూనిస్టులు తీసుకున్నారు. తూర్పు బెంగాల్ మొదలైన చోట్ల భూదహన విధానంతో జపాన్ సేనలన్నీ అడ్డుకునే ప్రయత్నం జరిగింది.
బోస్కు పెరిగిన మద్దతు
అహింసతో సహా గాంధీ విధానాలు, వ్యూహాలు అన్నీ విఫలమై కాంగ్రెస్లో.. దేశంలో ఆయన దాదాపు ఒంటరైన సందర్భం ఇది. ఒకపక్క జనంలో బ్రిటిష్ వ్యతి రేకత తారస్థాయికి చేరగా, జపాన్ చేతిలో పాశ్చా త్యశక్తులు చిత్తుగా ఓడిపో తుండటం ఆ దేశంపట్ల వారిలో అనుకూలభావా న్నీ అదే స్థాయిలో పెంచిం ది. ఈ మధ్యలో 1941లో బోస్ తన కలకత్తా నిర్బం ధం నుంచి నాటకీయంగా తప్పించుకుని అప్ఘాన్ మీ దుగా జర్మనీ పారిపోయి, బెర్లిన్ నుంచి చేసిన రేడియో ప్రసంగాలు దానికి మరింత ఊతమిచ్చాయి. కాంగ్రెస్లో ఎక్కువ మంది నాయకులు బోస్ వైపు తిరిగారు.
జర్మనీ నుంచి ఆయన జపాన్ చేరుకుని జలాంతర్గాములను సేకరించబోతు న్నట్లు వార్త వచ్చింది. బోస్ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ జపాన్ సేనలతో కలసి భారత్-బర్మా సరిహద్దుల్లో వీరోచిత పోరాటం చేసింది. అయితే ఓటమిని మూటగట్టుకున్న సందర్భాలే ఎక్కువ. పరిస్థితి పూర్తిగా తన పట్టు జారిపోతోందనుకున్న గాంధీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా క్విట్ ఇండియా నినాదాన్ని అందుకున్న తర్వాతే మళ్లీ జనం ఆయన వైపు మళ్లడం ప్రారంభించారు.
గాంధీ-బోస్
సుభాష్ చంద్రబోస్ ది పాతికేళ్ల (1920-1945) రాజకీయ జీవితం. ఇందులో పద్దెనిమిదేళ్లు కాంగ్రెస్లోనే ఉన్నాడు. పటేల్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి, కృపలానీ, అబుల్ కలామ్ ఆజాద్ లాంటి ఎందరో నాయకుల్లానే ఆయన కూడా మొదట్లో గాంధీ ప్రభావితుడే. సహాయ నిరాకరణ సందర్భంలో స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టాడు. గాంధీ ఆయనకు అప్పగించిన పని, మరో బెంగాల్ ప్రముఖ నాయకుడు చిత్తరంజన్ దాస్కు కుడిభుజంగా ఉండడం. అయితే, గాంధీ అనుకూలుర శిబిరంలో బోస్ ఎప్పుడూ లేడు. 1923లో, మార్పునకు వ్యతిరేకులు (నో-చేంజర్స్), మార్పుకు అనుకూలురు (ప్రో-చేంజర్స్)గా కాంగ్రెస్ చీలిపోయినప్పుడు, గాంధీ మొగ్గు ఉన్న నో-చేంజర్స్ శిబిరంలో కాక, ప్రొ-చేంజర్స్ శిబిరంలో చేరి చట్టసభల్లో ప్రవేశాన్ని బోస్ సమర్ధించాడు. బ్రిటిష్ పట్ల వైఖరిలో కూడా గాంధీ-బోస్ల మధ్య విభేదాలున్నాయి. బ్రిటిష్తో గాంధీది మిత్ర వైరుధ్యమైతే బోస్ ది శత్రువైరుధ్యం.
కాంగ్రెస్ చర్చల్లో, తీర్మానాల్లో గాంధీ కనబరిచే బ్రిటిష్ అనుకూల వైఖరులను బోస్ అడుగడుగునా అడ్డుకునేవాడు. అలాగే హింస-అహింసల విషయంలో కూడా అభిప్రాయ భేదాలుండేవి. 1930లో వైస్రాయి ఇర్విన్ ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలు కింద బాంబు పేలినప్పుడు దానిని ఖండించాలని గాంధీ ప్రతిపాదించగా బోస్ వ్యతిరేకించాడు. 1933లో శాసనోల్లంఘనకు పాల్పడి కాంగ్రెస్ ప్రముఖనేతలందరూ జైళ్లకెళ్లినప్పుడు, సర్దార్ పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్తో కలసి ఆస్ట్రియాలో ఉన్న బోస్, గాంధీ నాయకత్వం విఫలమైందంటూ అక్కడి నుంచే ప్రకటన చేశాడు. అయితే, తనతో భావజాల విభేదాలున్న నెహ్రూతో అనుసరించినట్టే బోస్తో కూడా గాంధీ సర్దుబాటు వైఖరిని అనుసరిస్తూ ఆయన కాంగ్రెస్ గొడుగు కింద కొనసాగేలా వీలైనంతవరకు జాగ్రత్తపడేవాడు.
1936లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన లక్నో కాంగ్రెస్ సందర్భంలో వర్కింగ్ కమిటీ ఎంపిక బాధ్యతను తనకు అప్పగించినప్పుడు కొందరు సోషలిస్టు నాయకులతో పాటు బోస్ పేరును కూడా గాంధీ చేర్చాడు. 1938లో నెహ్రూ స్థానంలో ఎవరిని అధ్యక్షుని చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు, పటేల్ గట్టిగా వ్యతిరేకించినా సరే బోస్నే చేసి తీరాలని గాంధీ పట్టుబట్టి నెగ్గించుకున్నాడు. అయితే, ఇంతకుముందు నెహ్రూ వరసగా రెండు విడతలు అధ్యక్షుడిగా ఉన్నాడు కనుక, తనకు కూడా మరో విడత అవకాశమివ్వాలని బోస్ అన్నప్పుడు గాంధీ వ్యతిరేకించి, మొదట ఆజాద్ను; ఆయన తప్పుకోవడంతో భోగరాజు పట్టాభి సీతారామయ్యను ముందుకు తెచ్చాడు.
ఆ ఎన్నికలో బోస్ నెగ్గినప్పుడు ఖిన్నుడైన గాంధీ పట్టాభి ఓటమి నా ఓటమి అని ప్రకటించాడు. గాంధీ ఆ తర్వాత పటేల్, రాజగోపాలాచారి తదితరులను ప్రయోగించి బోస్ రాజీనామా చేసే పరిస్థితిని కల్పించాడు. బోస్ కాంగ్రెస్ జీవితానికి దానితో తెరపడింది. 1939లో బోస్కు గాంధీ ఉత్తరం రాస్తూ, ఇప్పుడు నా నుంచి నువ్వు దూరమైనా; నేను చేసింది న్యాయమూ, నా ప్రేమ స్వచ్ఛమూ అయితే ఎప్పటికైనా మళ్లీ నా దగ్గరికి వస్తావు అన్నాడు. కానీ ఆయన ఆకాంక్ష నెరవేరలేదు.
పటేల్-బోస్
మితవాదులుగా పటేల్, రాజగోపాలా చారిల మధ్య భావసారూప్యత ఉండేది. ఇద్దరూ నెహ్రూ, బోస్ల సోషలిజాన్ని, రాడికలిజాన్ని వ్యతిరేకించేవారు. ఆపైన బోస్ నిలకడలేని మనిషన్న అభిప్రాయం పటేల్కు ఉండేది. పటేల్, రాజగోపాలాచారి మొదట్లో నో-ఛేంజర్స్ శిబిరంలో ఉంటే; ప్రో-ఛేంజర్స్ శిబిరంలో మోతీలాల్, చిత్తరంజన్ దాస్, బోస్లతోపాటు పటేల్ అన్న విఠల్ భాయ్ పటేల్ ఉండేవాడు. బోస్తో ఆస్ట్రియాలో ఉన్నప్పుడే విఠల్ భాయ్ కన్ను మూశాడు. తన అన్నను బోస్ తప్పుదారి పట్టించాడన్న కోపం పటేల్కు ఉండేది. బోస్ను కాంగ్రెస్ అధ్యక్షుని చేయాలన్న గాంధీ ప్రతిపాదనను మొదట వ్యతిరేకించినా గాంధీ పట్టుబట్టడంతో ఎప్పటిలా శిరసావహించాడు.
నెహ్రూ-బోస్
బోస్ కన్నా నెహ్రూ ఆరేళ్లు పెద్ద. పటేల్తో ఆయన విభేదాలు ప్రసిద్ధాలే. గాంధీతో కూడా ఆయనకు భావజాల, వ్యూహపరమైన విభేదాలుండేవి. కొన్ని సందర్భాలలో, ఇద్దరం తెగతెంపులు చేసుకుందామా అనే వరకూ వెళ్లారు. విచిత్రం ఏమిటంటే, మిగతా ఎవరి మధ్యా లేనంత భావసమైక్యత నెహ్రూ, బోస్ల మధ్యే ఉండేది. ఇద్దరూ కాంగ్రెస్లో రాడికల్స్గా గుర్తింపు పొంది, ఆ వర్గానికి నాయకత్వం వహించారు. ఇద్దరూ కూడబలుక్కుని గాంధీకి నచ్చని తీర్మానాలు తెచ్చి నెగ్గించుకున్న సందర్భాలున్నాయి.
కాంగ్రెస్ నియమించిన మోతీలాల్ నెహ్రూ కమిటీ అధినివేశ ప్రతిపత్తిని కోరాలని సూచించినప్పుడు 1927లో మద్రాస్ కాంగ్రెస్లో దానిని తోసిపుచ్చి, సంపూర్ణ స్వరాజ్యాన్ని డిమాండ్ చేస్తూ వీరు తెచ్చిన తీర్మానం ఒక ఉదాహరణ. 1928లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ను వీరిద్దరూ కలసి తమ రాడికల్ భావాలతో ఒక ఊపు ఊపారు. అప్పుడు కూడా అధినివేశ ప్రతిపత్తికి బదులు సంపూర్ణ స్వరాజ్యానికి ఇద్దరూ పట్టుబట్టారు. గాంధీ మెట్టు దిగి రాజీకి వచ్చాడు. గాంధీ ఇష్టానికి విరుద్ధంగా బ్రిటిష్తో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని బోస్ సవరణ ప్రతిపాదిస్తే నెహ్రూ దానిని సమర్ధించాడు. గాంధీ అస్పృశ్యతా నివారణపై మరీ ఎక్కువగా దృష్టి పెట్టడాన్నీ ఇద్దరూ వ్యతిరేకించారు. అలాగే బ్రిటిష్ పట్ల గాంధీ సామరస్య వైఖరిని వ్యతిరేకించడంలోనూ ఇద్దరిదీ ఏకీభావమే.
అయితే ఇద్దరిలోనూ కొన్ని తేడాలూ ఉన్నాయి. గాంధీతో నెహ్రూ ఒక్కోసారి తెగతెంపుల వరకూ వెళ్లినా వెనక్కి తగ్గేవాడు. ఆయన మౌలికంగా కాంగ్రెస్, గాంధీల మనిషి. ఆ రెండు గొడుగుల అంచుల్లో వేళ్లాడేవాడే కానీ పూర్తిగా బయటికి వచ్చేవాడు కాదు. బోస్కు కాంగ్రెస్, గాంధీల పట్ల అంత నిబద్ధతలేదు. నెహ్రూ కాంగ్రెస్ గుంపులో ఉంటూనే కొన్ని సందర్భాలలో అలీనతను పాటించేవాడు. బోస్ పూర్తిగా ఒక వైపు ఒరిగిపోయేవాడు. 1923లోనే కాంగ్రెస్ ప్రో-చేంజర్స్గా, నో-చేంజర్స్గా చీలిపోయి, తన తండ్రి ప్రో-చేంజర్స్ శిబిరంలో చేరినా నెహ్రూ రెండు శిబిరాలకూ దూరంగా ఉండడం ఆయన అలీనతకు ఒక చిత్రమైన ఉదాహరణ.
బోస్ రెండోసారి అధ్యక్షుడైనప్పుడు ఆయనతో అర్ధాంతరంగా రాజీనామా చేయించే ప్రయత్నాలలోనూ నెహ్రూ అలీనంగానే ఉండిపోయాడు. ఇంతకు ముందు పలు సందర్భాలలో తనూ, బోస్ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నా; కాంగ్రెస్లో బోస్ ఒంటరి అయ్యే క్లిష్టపరిస్థితిలో మాత్రం ఆయన నోరు తెరిచి మద్దతు అడిగినా నెహ్రూ ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయాడు. అయితే, నెహ్రూ గతంలోనూ అలా అలీనంగా ఉండిపోయిన సందర్భాలున్నాయి కనుక, బోస్ అడ్డు తొలగించుకోడానికే మద్దతు ఇవ్వలేదని చటుక్కున నిర్ధారణకు రావడానికి వీల్లేదు. మొత్తం మీద నెహ్రూ-బోస్ సంబంధాలను పరిశీలిస్తే వారు విరోధించుకుని వీధికెక్కిన ఉదంతాలు లేవనే చెప్పవచ్చు.
అప్పటికి పద్దెనిమిదేళ్లుగా బోస్ తనతో మాటిమాటికీ విభేదిస్తున్నా, తన నాయకత్వం విఫలమైందని ప్రకటించినా ఆయనతో సర్దుబాటు చేసుకుంటూ పోవడమే కాక; పట్టుబట్టి ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్షుణ్ణి చేసిన గాంధీ- రెండో విడత ఆయన అధ్యక్షుడైనప్పుడు దింపేవరకూ ఎందుకు నిద్రపోలేదు? అలాగే, తనున్న క్లిష్టపరిస్థితిలో బోస్ నోరు తెరిచి మద్దతు కోరినా నెహ్రూ ఎందుకు ఇవ్వలేదు? ఇవీ ఇక్కడ వేసుకోవలసిన ప్రశ్నలు.
హిట్లర్ మరణం-జపాన్ లొంగుబాటు
అంతవరకూ యుద్ధానికి దూరంగా ఉన్న అమెరికా, పెరల్ హార్బర్ పై జపాన్ దాడిచేసేసరికి యుద్ధంలోకి అడుగుపెట్టింది. దాంతో బ్రిటన్ యుద్ధపాటవం అనేక రెట్లు పెరిగి బలాబలాలు తారుమారయ్యాయి. 1945 నాటికి హిట్లర్ మరణించడం, అణు బాంబు ప్రయోగంతో జపాన్ లొంగిపోవడం, ఆ వెనువెంటనే తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్టు వార్త రావడం సంభవించాయి. ఆ తర్వాత క్రమంగా అంతర్జాతీయ పరిణామాల మబ్బులు తొలగిపోయి జాతీయరాజకీయాలు తిరిగి తేటపడటం ప్రారంభించాయి. ఇప్పుడు బోస్ లేకపోవడం ఒక్కటే తేడా.
ఎవరు ఎంత బాధ్యులు?
జాతీయరంగస్థలి నుంచి బోస్ నిష్ర్కమణ రెండు అంచెలలో జరిగింది. మొదటిది, కాంగ్రెస్ నుంచి. రెండోది, మరణం లేదా అంతర్ధానం రూపంలో. ఎవరు బాధ్యులన్న ప్రశ్నను కాసేపు పక్కన పెడితే; కాంగ్రెస్ నుంచి బోస్ నిష్ర్కమ ణకు గాంధీ, నెహ్రూ తదితరులే బాధ్యులవు తారు. అదే, ఆయన మరణం లేదా, అంత ర్ధానానికి బాధ్యులెవరన్నప్పుడు అంతర్జాతీయ శక్తులు తప్పనిసరిగా అడుగు పెడతాయి. జర్మనీ, జపాన్లతో తలపడుతున్న బ్రిటిష్కు, ఆ రెండు దేశాల నుంచి సాయం పొందుతున్న బోస్ కదలికలపై నిఘావేయాల్సిన అవసరం స్పష్టమే.
రహస్య పత్రాలు బయటపెడితే కొన్ని దేశాలతో సంబంధాలు దెబ్బతినవచ్చని ఇప్పటి కేంద్ర ప్రభుత్వం వినిపిస్తున్న వాదన కూడా; బోస్ మరణం, లేదా అంతర్ధానం వెనుక అంత ర్జాతీయశక్తుల పాత్ర గురించిన అనుమానాన్ని బలోపేతం చేసేదే. కాంగ్రెస్ నుంచి బోస్ నిష్ర్కమణకు గాంధీ, నెహ్రూ తదితరులు ఎలాంటి బాధ్యులన్న ప్రశ్న చూద్దాం. అందుకు కారణం వ్యక్తిగత రాగద్వేషాలు, అధికారంలో పోటీ అవుతాడన్న భావనే అన్న నిర్ధారణకు అవకాశం లేకుండా భావజాలపరమైన వ్యత్యా సాలు ఉండనే ఉన్నాయి. బోస్-గాంధీలది హింస-అహింసల మధ్య పెనుగులాట. బోస్- నెహ్రూలది ఫాసిస్టు-ఫాసిస్టు వ్యతిరేక శక్తుల మధ్య స్పర్థ.
రెండో విడత కాంగ్రెస్ అధ్యక్షుడు కావడానికి నెహ్రూకు ఇచ్చిన అవకాశాన్ని బోస్కు గాంధీ నిరాకరించడాన్నీ, బోస్కు నెహ్రూ మద్దతు ఇవ్వకపోవడాన్నీ అర్థం చేసుకోవడానికి ఇదొక కోణం. ఒకవేళ గాంధీ, నెహ్రూలను బోస్ విషయంలో ముద్దాయిలుగా పరిగణించాల్సి వచ్చినా పెద్ద ముద్దాయి గాంధీ అవుతాడు కానీ, నెహ్రూ అవడు. బోస్తో గాంధీకి ఉన్నంత విభేదం నెహ్రూకు లేదని చెప్పుకున్నాం. ఐతే, నెహ్రూ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 1968 వరకూ బోస్ కుటుంబ సభులపై నిఘా ఎందుకు కొనసాగించాయన్న ప్రశ్న వస్త్తుంది. పరిపాలనా కోణం నుంచి చూస్తే అదేమంత విశేషం అనిపించదు. సంఘ్ పరివార్ వర్గాలు, వామపక్ష తీవ్రవాదులతో సహా కొన్ని రకాల భావజాలాల వారిపై నిఘా ఎప్పుడూ ఉంటూనేఉంది.
బోస్ మరణం, లేదా అంత ర్ధానం వెనుక అంతర్జాతీయశక్తుల పాత్ర ఉన్నట్టు కేంద్రం వద్ద ఉన్న రహస్య పత్రాలు వెల్లడిస్తూ ఉంటే, ఆ విషయం నెహ్రూ ఎందుకు బయట పెట్టలేదనే ప్రశ్న వస్తుంది. అందులో కూడా ఆయనను మొదటి ముద్దాయిగా నిర్ధారిం చాలంటే, ప్రస్త్తుత ప్రభుత్వం తన దగ్గరున్న అన్ని రహస్య పత్రాలనూ బయటపెట్టాలి!
బోస్ ప్రతిష్టను మసకబార్చారనీ, స్వాతంత్య్రోద్యమంలో ఆయన పాత్రను తక్కువ చేశారనే ఆరోపణలు, అనుమానాలు సహజమే కానీ; పూర్వాపరాల అవగాహన లోపించినప్పుడు అవి కేవలం సొంత అభిమాన ప్రకటనలుగానో, రాజకీయ ప్రేరితాలుగానో తేలిపోతాయి. గాంధీకి బోస్ విషయంలో పూర్తి స్పష్టత ఉంది. తమిద్దరివీ రెండు భిన్నమార్గాలు గానే చూశాడు. బోస్ దేశభక్తిని, సాహస ప్రవృత్తిని ఆకాశానికి ఎత్తాడు. నీ మార్గంలో నువ్వు విజయం సాధిస్తే మనస్ఫూర్తిగా అభినందిస్తానని కూడా ఒకసారి బోస్కు రాశాడు. ఒకవేళ జపాన్-జర్మనీ కూటమే గెలిచి ఉంటే ఆ విజయం బోస్ మార్గానికే దక్కి, భారత్ చరిత్రే భిన్నమైన మలుపు తిరిగేది. కానీ అలా జరగలేదు. జపాన్-జర్మనీ ఓటమి బోస్ను శాశ్వతంగా తెరమరుగు చేసి గాంధీ-నెహ్రూ భావజాలాన్ని విజయ తీరం చేర్చింది. ఒకవేళ కేంద్రం వద్ద ఉన్న రహస్య పత్రాలు కూడా వెల్లడై, అన్ని విధాలా నెహ్రూనే విలన్గా స్థాపించిన పక్షంలో, అప్పుడది వేరే కథ!
- భాస్కరం కల్లూరి, మొబైల్: 9703445985