
గాలికుంటుతో జాగ్రత్త
వర్షాకాలంలో మూగజీవాలకు వచ్చే గాలికుంటు వ్యాధి విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యులు సూచిస్తున్నారు. పికోర్నా గ్రూపునకు చెందిన వైరస్ ద్వారా సోకే
* రైతులకు పశువైద్యాధికారుల సూచన
* నేటినుంచి సెప్టెంబర్ 10 వరకు అన్ని గ్రామాల్లో పశువైద్య శిబిరాలు
* మూగజీవాలకు వ్యాధి నిరోధక టీకాలు
* పశుపోషకులకు సదావకాశం
వర్షాకాలంలో మూగజీవాలకు వచ్చే గాలికుంటు వ్యాధి విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని పశువైద్యులు సూచిస్తున్నారు. పికోర్నా గ్రూపునకు చెందిన వైరస్ ద్వారా సోకే దీని వల్ల పశువులు తీవ్ర ఇబ్బందులు పడుతాయని చెబుతున్నారు. ఈ వ్యాధి నివారణ కోసం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా అన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి నిరోధక టీకాలు ఇస్తున్నారు. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు వెటర్నరీ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలపై నంగునూరు వెటర్నరీ ఆస్పత్రి వైద్యుడు
- డాక్టర్ వేణు, ఫోన్: 8790998014
అందించిన సలహాలు.. సూచనలు..
- నంగునూరు
ఆరు నెలల వరకు వ్యాధి ప్రభావం
మన ప్రాంతంలో ఓఏ, ఏఎస్ఐఏ-1 రకాల వైరస్ వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
దీని బారిన పడిన పశువుపై ఆరు నెలల వరకు వ్యాధి ప్రభావం ఉంటుంది.
మూగజీవాల్లో రక్తహీనత ఏర్పడి శ్వాస తీయడం కష్టంగా మారి ఎప్పుడూ ఎగపోస్తుంటాయి (శ్వాస అధికంగా తీయడం).
ఎండ వేడిమిని తట్టుకోలేక త్వరగా నీరసించిపోతాయి.
ఈ వ్యాధి బారిన పడిన ఆవు, లేదా బర్రె పాలు తాగిన లేగలు, దుడ్డెలు మృత్యువాత పడే అవకాశం ఉంది.
దేశవాలీ పశువులతో పోలిస్తే సంకర జాతి పశువులపై దీన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఈ వ్యాధి ప్రాణాంతకమైనది కాకపోయినా దీని ప్రభావంతో పశువుల్లో ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోతుంది.
వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి బారిన పడ్డ పశువులు మేత సరిగ్గా మేయవు. దీని ప్రభావంతో పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది.
- శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106 ఫారిన్హీట్స్ ఉంటుంది. జ్వరం తీవ్రత అధికంగా కనిపిస్తుంది.
- పళ్ల చిగుళ్లు, నాలుక, గిట్టల మధ్య, పొదుగు, ముట్టి లోపలి ప్రాంతాల్లో బొబ్బలు ఏర్పడి చితికిపోతాయి.
- బొబ్బలపై ఈగలు, పురుగులు, బ్యాక్టీరియా ఆశ్రయించడం వలన చీము ఏర్పడి పుండ్లు అవుతాయి.
- నోటి నుంచి సొంగ కారడంవంటి లక్షణాలు కనిపిస్తాయి.
- చూడి ఆవులు, బర్రెలకు ఈ వ్యాధి సోకితే గర్భస్రావం అవుతుంది. పాలు తాగిన దూడలు మృత్యువాత పడుతాయి.
వ్యాప్తి ఇలా...
పకో వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెంది ఒక పశువు నుంచి మరో పశువుకు సోకుతుంది.
- అపరిశుభ్రంగా ఉండే పశువుల పాకలు, వీటిలో నిల్వ ఉంటే మురుగు వల్ల వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
- లాలాజలం, మూత్రం, పేడ, వీర్యం, పాలు, చనుకట్ల పుండ్ల నుంచి వచ్చే స్రవాలు, కలుషిత పదార్థాల ద్వార కూడా ఇతర పశువులకు సోకుతుంది.
ముందు జాగ్రత్తలు
- మూగజీవాల్లో ఈ వ్యాధి రాకుండా పుట్టిన రెండు నెలల వ్యవధిలో మొదటి సారి నిరోధక టీకాలు వేయించాలి. అనంతరం ఒక నెల తర్వాత అంటే దూడలు మూడు నెలల వయసు ఉన్నప్పుడు బూస్టర్ డోస్ వేయించాలి.
- అనంతరం విధిగా ప్రతీ ఆరు నెలలకోసారి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.
- పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఇచ్చే వ్యాధి నిరోధక టీకాలను విధిగా ఇప్పించాలి.
పశువులకు చికిత్స
- వ్యాధిసోకిన పశువులను ఆరోగ్యవంతమైన పశువుల నుంచి వేరు చేసి పశువైద్యున్ని సంప్రదించాలి.
- వ్యాధి సోకిన పశువు శరీరంపై ఏర్పడిన పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం పరచాలి.
- నోటిలోని పుండ్లను బోరో గ్లిజరిన్తో శుభ్రంచేయాలి.
- కాలి పండ్లకు జింక్ఆక్సైడ్, లోరాక్సిన్ ఆయింట్మెంట్ రాయాలి.
-పుండ్లపై ఈగలు వాలకుండా వేపనూనె, ఈగ మందులను స్ప్రేలను వాడాలి.
- వ్యాధిసోకిన పశువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.
- వ్యాధి నిర్మూలనకు మూడు నుంచి ఐదు రోజుల వరకు యాంటీబయోటిక్స్ మందులు వాడాలి.
- నొప్పి నివారణకు అనాల్జిసిక్ మందులు వాడాలి.
- సులభంగా జీర్ణమయ్యేందుకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం అందించాలి.
- జావ, జొన్నలకు చిటికెడు ఉప్పు, బెల్లంలో కలిపి ప్రతి రోజూ తాగించాలి. బలహీనత తీవ్రంగా ఉంటే గ్లూకోజ్ ఇప్పించాలి.