Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu govt Red Book conspiracy exposed once again1
రిమాండ్‌ నివేదిక సాక్షిగా.. బాబు భేతాళ కుట్రే...!

సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్‌ కుట్ర మరోసారి బట్టబయలైంది. టీడీపీ వీరవిధేయ పోలీసు అధికారులతో నియమించుకున్న సిట్‌ ద్వారా సాగిస్తున్న కుతంత్రం న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్‌ నివేదిక సాక్షిగా బయటపడింది. దర్యాప్తు, ఆధారాలు తదితర న్యాయపరమైన విధానాలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా సాగిస్తున్న కుతంత్రం మరోసారి వెలుగుచూసింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో అవాస్తవాలు, అభూత కల్పనలతో రూపొందించిన నివేదికలనే సిట్‌ తన రిమాండ్‌ నివేదికలతో సమర్పించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు బరితెగిస్తోందని ఆధారాలతో సహా వెల్లడైంది. ఈ అక్రమ కేసులో సిట్‌ తాజాగా అరెస్టు చేసిన అంతర్జాతీయ సిమెంట్‌ దిగ్గజ కంపెనీ వికాట్‌ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప రిమాండ్‌ నివేదిక ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. ఇప్పటికే రాజ్‌ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా ఆయన పేరిట అబద్ధపు వాంగ్మూలంతో రిమాండ్‌ నివేదిక రూపొందించి సిట్‌ అడ్డంగా దొరికిపోయింది. ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్‌ అధికారులే న్యాయస్థానానికి వెల్లడించాల్సి వచ్చింది. అయినా సరే సిట్‌ తీరు ఏమాత్రం మారలేదు. ఈ కేసులో తాజాగా బాలాజీ గోవిందప్ప రిమాండ్‌ నివేదికలోనూ అదే అబద్ధపు వాంగ్మూలాల కుతంత్రానికి తెగబడింది. కర్ణాటకలో మంగళవారం అరెస్టు చేసిన ఆయన్ను సిట్‌ అధికారులు బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 20 వరకు రిమాండ్‌ విధించింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ కుట్రలను సవాల్‌ చేస్తూ ఈ కేసులో అరెస్టైన రాజ్‌ కేసిరెడ్డి కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అరెస్టు అక్రమమని, చట్ట విరుద్ధమని నివేదించింది. దీనిపై స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణలో అరెస్టుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తామని ప్రకటించింది.బాలాజీ గోవిందప్పతో సిట్‌ అధికారులు పలు పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించారని న్యాయస్థానానికి సమరి్పంచిన మెమోలో పేర్కొన్న భాగం గోవిందప్పతో బలవంతంగా సంతకాలు చేయించిన సిట్‌చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రతోనే ఈ అక్రమ కేసులో బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చారన్నది వెల్లడైంది. ఆయన పేరిట అవాస్తవాలతో సిట్‌ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేసేశారు. ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు బాలాజీ గోవిందప్ప నిరాకరించారని.. ఆయనతో పోలీసులు బలవంతంగా కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టంగా ఉండటం గమనార్హం. అంతేకాదు మూడో పార్టీకి చెందిన మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సిట్‌ అధికారులు అక్రమంగా జప్తు చేశారన్నది కూడా వెలుగులోకి వచ్చింది. వాటిని ట్యాంపర్‌ చేయడం ద్వారా ఈ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించాలన్నది సిట్‌ లక్ష్యమన్నది స్పష్టమవుతోంది. ఇదే విషయాలను బాలాజీ గోవిందప్ప తరపు న్యాయవాది ప్రత్యేక మెమో ద్వారా న్యాయస్థానం దృష్టికి తెచ్చారని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. ఆ మెమోలో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం కీలకంగా మారింది. ఇక బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని తెలిసే... అంతకుముందే తెల్లవారు జామునే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారని గోవిందప్ప న్యాయవాది న్యాయస్థానానికి నివేదించారు. సిట్‌లో సభ్యుడుకాని అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లుకు ఎలాంటి అధికారం లేనప్పటికీ బాలాజీ గోవిందప్పను అక్రమంగా అరెస్ట్‌ చేశారని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. సిట్‌ పూర్తిగా అవాస్తవాలు, అభూతకల్పనలతో బాలాజీ గోవిందప్ప రిమాండ్‌ నివేదికను రూపొందించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించింది.అరెస్టుకు ముందే రిమాండ్‌ నివేదికలా..!ఆ నివేదిక కుట్రే... ఇదిగో సాక్ష్యం...ఇక నిందితుల అరెస్టు, విచారణతో నిమిత్తం లేకుండానే టీడీపీ కార్యాల­యంలోనే రిమాండ్‌ నివేదికలు రూపొందిస్తున్న కుట్రలు బట్టబయ­లయ్యాయి. బాలాజీ గోవిందప్ప రిమాండ్‌ నివేదికే ఈ విషయాన్ని వెలు­గులోకి తెచ్చింది. ఆయన అరెస్టుకు కారణాలను వెల్లడిస్తూ... నిందితుడు పెళ్ల­కూరు కృష్ణమోహన్‌రెడ్డి ఇతరులు అవినీతికి పాల్పడ్డారు అని పేర్కొంది. అసలు బాలాజీ గోవిందప్ప అరెస్టుపై రిమాండ్‌ నివేదికలో కృష్ణమోహన్‌రెడ్డి పేరును ఎందుకు ప్రస్తావించినట్టు..? అంటే నిందితుల అరెస్టులతో నిమిత్తం లేకుండానే ముందుగానే టీడీపీ ఆఫీసులోనే రిమాండ్‌ నివేదికలు రూపొందించి.. వాటిని కాపీ, పేస్ట్‌ చేస్తూ న్యాయస్థానానికి సమర్పిస్తున్నట్టు వెల్లడైంది.ఎవరినైనా ఇరికిస్తాం..!బాలాజీ గోవిందప్ప వైఎస్‌ జగన్‌ దగ్గర పనిచేస్తున్నట్లు రిమాండ్‌ రిపోర్టులో రాశారు. కానీ ఆయన వైఎస్‌ జగన్‌ సంస్థల్లో పని చేయట్లేదు. 12 దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ వికాట్‌లో పూర్తి స్థాయి డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో మెజార్టీ వాటాను వికాట్‌ ఎప్పుడో కొనుగోలు చేసింది. వైఎస్‌ జగన్‌ కుటుంబ సభ్యులకు కంపెనీలో మైనార్టీ షేర్‌ మాత్రమే ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికారులతో గోవిందప్ప చాలా సన్నిహితంగా మెలిగి కుట్రలకు పాల్పడ్డారని రిపోర్టులో రాశారు. ఆయన ఎప్పుడూ హైదరాబాద్‌లోనే ఉంటారు. ఏపీకి రావడం చాలా తక్కువ. వృత్తిరీత్యా చార్టెడ్‌ అక్కౌంటెంట్‌ అయిన గోవిందప్పకు నిరంతరం ఊపిరి సలపని పనులు ఎన్నో ఉంటాయి. ఓ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ హోల్‌టైమ్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌నే ఇలా టార్గెట్‌ చేసి అక్రమ కేసులో, జరగని కుంభకోణంలో ఇరికించారంటే.. ఇక దేశంలో ఎవరినైనా కేసుల్లో ఇరికించవచ్చు అనే సందేశాన్ని చంద్రబాబు సర్కారు పంపింది. దీన్నిబట్టి భేతాళ కుట్రలు మరోసారి నిరూపితమవుతున్నాయి.

CM Revanth Reddy About Kaleshwaram and Other Irrigation Projects2
కట్టిన మూడేళ్లకే కూలింది: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈ భూ ప్రపంచంలో కట్టిన మూడేళ్లకే కుప్పకూలిన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ఒక్కటే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిజాం కాలంలో మూసీ నదిపై కట్టిన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌తో పాటు జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలో నిర్మించిన శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని చెప్పారు. కానీ మూడేళ్లలోనే కాళేశ్వరం.. కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని అన్నారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టినా 50 వేల ఎకరాలకు కూడా నీరివ్వలేదని విమర్శించారు. నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్లుగా, టెక్నికల్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు పొందిన 423 మందికి బుధవారం జలసౌధలో జరిగిన కార్యక్రమంలో సీఎం నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగంలో చేరుతున్న వారికి పలు సూచనలు చేస్తూ.. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల తీరుతెన్నులను వివరించారు. ఓ రాజకీయ పార్టీ భావోద్వేగాన్ని వాడుకుంది ‘నీళ్లు నాగరికతను నేర్పుతాయి. తెలంగాణ ప్రజలకు నీళ్లు ఉద్యమాన్ని నేర్పాయి. నీళ్ల కోసం పరితపించి పోరాడాం. అంతటి ప్రాధాన్యత గల నీటిపారుదల శాఖలో పనిచేయడం ఉద్యోగం కాదు. భావోద్వేగం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది నీళ్లు, నిధులు నియామకాలు. ఈ మూడింటితో కూడిన భావోద్వేగాన్ని ఓ రాజకీయ పార్టీ వాడుకుని పదేళ్లు అధికారంలో కొనసాగింది. పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఉమ్మడి రాష్రంలో జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమై పెండింగ్‌లో ఉన్న ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. పాలమూరు–రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఇందిరా సాగర్, రాజీవ్‌ సాగర్, దుమ్ముగూడెం, సీతారామ ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ఈ రూ.2 లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయి? 10 ఏళ్లు నియామకాలు జరగలేదు. మేం ఇప్పటివరకు నీటి పారుదల శాఖలో 1,161 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. లష్కర్లుగా మరో 2 వేల మందిని నియమించాం. మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత సాగునీటి పారుదలకే..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ మూడుచోట్లా కనీసం సాయిల్‌ టెస్ట్‌ చేయలేదు ‘సాగునీటి ప్రాజెక్టులు ఎలా కట్టాలో.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మొదలు సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్‌ కట్టిన ఇంజనీర్లు చూపించారు. 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని భయపడ్డా. కానీ ఆ కట్టడానికి ఏం కాలేదు. ఒక ప్రాజెక్టు ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్‌ టెస్ట్‌ చేయలేదు. హెలీకాప్టర్‌లో వెళ్తూ కిందకు చూపించి మూడు బరాజ్‌లు కట్టించారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది. ఎవరి పని వారు చేయాలి ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలి. ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలి. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరే. అలా చేసిన వాళ్లు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఎదురుకాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలడానికి అధికారులే బాధ్యులన్నట్టుగా నివేదికలు వస్తున్నాయి. మీరు కట్టే ప్రాజెక్టులు భావితరాలకు ఉపయోగపడతాయి. 30 ఏళ్లు కష్టపడితే తప్ప అసిస్టెంట్‌ ఇంజనీర్‌.. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ కాలేరని గుర్తుంచుకోవాలి. కుప్పకూలిన ప్రాజెక్టు కాళేశ్వరంను ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందిన వారు సందర్శించాలి..’ అని రేవంత్‌ చెప్పారు. ‘సీతారామ’ కూడా లోపభూయిష్టంగానే ఉంది ‘సీతారామ ప్రాజెక్టు కూడా లోపభూయిష్టంగానే ఉంది. 45 కిలోమీటర్ల అతి పొడవైన టన్నెల్‌ ప్రాజెక్టు ఎస్‌ఎల్‌బీసీ 75 శాతం ఎప్పుడో పూర్తయితే పదేళ్లలో 10 కిలోమీటర్ల పనులు పూర్తి చేయలేదు. 3.36 లక్షల ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టును పదేళ్లు పట్టించుకోకపోతే మళ్లీ మేం అధికారంలోకి వచి్చన తరువాత పనులు ప్రారంభించాం. అయితే పదేళ్లు పనులు జరగక సొరంగం కుప్పకూలి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌ రాష్ట్రంలో సాగునీటికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి ఏటా 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. నీటిపారుదల శాఖలో తొలిసారిగా ఉద్యోగ ఖాళీలన్నింటినీ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిధుల కొరత వచ్చినా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ‘సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి. తెలంగాణకు అతిపెద్ద సెంటిమెంట్‌ నీళ్లు. నిధుల కొరత వచ్చినా, ఏదోరకంగా పూర్తి చేస్తాం. ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తాం. గ్రూప్‌ వన్‌ నియామకాలను అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు. త్వరలోనే గ్రూప్స్‌ ఉద్యోగ నియామకాలు పూర్తి చేస్తాం’ అని సీఎం అన్నారు.

Chandrababu Itself Liquor Mafia Don in Andhra Pradesh3
లిక్కర్‌ మాఫియా డాన్‌ 'చంద్రబాబే'

సాక్షి, అమరావతి: దొంగే.. ‘దొంగా...దొంగా!’ అని అరుస్తున్నట్లుగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు!! మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసు కుట్రకు తెరతీశారు. మద్యం కుంభకోణంలో గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారు. టీడీపీ వీర విధేయులతో నియమించిన సిట్‌ ద్వారా కుతంత్రానికి పాల్పడుతున్నారు. బెదిరింపులు, వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు, ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం... ఇవన్నీ టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రలో అంతర్భాగాలుగా మారుతున్నాయి. గతంలో టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అవాస్తవ ఆరోపణలతో దాఖలు చేసిన కేసును ‘కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) కొట్టివేయడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానం పారదర్శకంగా ఉందని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కానీ అవే అవాస్తవ ఆరోపణలతో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్‌ కుతంత్రమేనన్నది స్పష్టమవుతోంది. అసలు మద్యం మాఫియా డాన్‌ చంద్రబాబే అని నిరూపించే వాస్తవాలు ఇవిగో ఇలా ఉన్నాయి... సూత్రధారి, లబ్ధిదారు బాబే... రూ.25 వేల కోట్ల లూటీపై ఆధారాలతో సీఐడీ కేసు 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్‌ ద్వారా చంద్రబాబు యథేచ్చగా దోపిడీకి గేట్లు తెరిచారు. మద్యం దుకాణాలు, బార్ల ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు, 4,380 పర్మిట్‌ రూమ్‌లు, 43 వేల బెల్ట్‌ దుకాణాలతో మద్యాన్ని ఏరులుగా పారించారు. టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, డీకే ఆదికేశవులు, ఎస్పీవై రెడ్డి కుటుంబాలకు చెందిన 14 కొత్త డిస్టిలరీలకు అనుమతినిచ్చారు. మొత్తం 20 డిస్టిలరీలను బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్లకు ఎంప్యానల్‌ చేశారు. అంతేకాదు తమ అస్మదీయులకు చెందిన నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేశారు. చీప్‌ లిక్కర్‌లో బ్రాండ్లకు ఎలాంటి వాల్యూ లేదని ఊరూపేరూలేని దాదాపు 200 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ప్రెసిడెంట్‌ మెడల్, పవర్‌ స్టార్, లెజెండ్, టీఐ మాన్షన్‌ హౌస్, హై ఓల్టేజ్‌ వంటివి వాటిలో కొన్ని. వీటిని గతంలో సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. మంత్రిమండలికి కూడా తెలియకుండా ప్రివిలేజ్‌ ఫీజు రద్దు చేస్తూ చీకటి జీవోలు జారీ చేసిన నోట్‌ ఫైళ్లపై అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర సంతకాలు చేసిన పత్రాలు వెలుగులోకి వచ్చాయి. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లకుపైగా గండి కొట్టారు. ఎంఆర్‌పీ కంటే ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్‌ ద్వారా ఆ ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి మొత్తం రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. టీడీపీ హయాంలో మద్యం దోపిడీకి పాల్పడ్డారని రాజ్యాంగబద్ధ సంస్థ కంప్ట్రోలర్‌ అండ్‌ అడిటర్‌ జనరల్‌ సైతం స్పష్టం చేసింది. చంద్రబాబు మద్యం దోపిడీని సీఐడీ ఆధారాలతోసహా నిగ్గు తేల్చింది. చంద్రబాబు, కొల్లు రవీంద్ర తదితరులపై సీఐడీ 2023లో ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఇక స్కిల్‌ స్కామ్‌లో అరెస్టై 52 రోజులు రిమాండ్‌లో ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అసైన్డ్‌ భూముల దోపిడీ, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమా­లు, ఫైబర్‌ నెట్‌ కుంభకోణం, ఇసుక దోపిడీ కుంభకోణం కేసుల్లో కూడా చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసుల దర్యాప్తును అటకెక్కించింది. చంద్రబాబుపై మద్యం దోపిడీ కేసుతోపాటు ఇతర కేసులు న్యాయస్థానం విచారణలోనే ఉన్నాయనే వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం యత్నిస్తోంది. మ­రోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వం 2024 నుంచి మ­ళ్లీ ప్రైవేటు మద్యం సిండికేట్‌ దోపిడీకి తలుపులు బా­ర్లా తెరచింది. యథేచ్చగా అదే దోపిడీ సాగిస్తోంది. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రమే... 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పారదర్శకంగా ప్రభుత్వ మ­ద్యం దుకాణాలను ప్రవేశపెట్టింది. దుకాణాల వేళల­ను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను దశలవారీగా 2,934 దుకాణా­లకు తగ్గించింది. చంద్రబాబు ప్రభుత్వం అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెట్టిన 43 వేల బెల్ట్‌ దుకాణాలను నిర్మూలించింది. రాష్ట్రంలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సులు మంజూరు చేయలేదు. ఈ విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్‌సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మ­కాలు తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గా­యి. అలాంటప్పుడు ఇక కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? ఇక మద్యం విధానానికి సంబంధించి ఏ ఒక్క ఫైలుపై కూడా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతకాలు చేయలేదు. ఆ వ్యవహారాలన్నీ బెవరేజెస్‌ కార్పొరేషనే సమర్థంగా పర్యవేక్షించింది. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో సిట్‌ ఎలాంటి ఆధా­రాలు సేకరించలేకపోవడంతో అధికారులు, సాక్షులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయడమే పనిగా పెట్టుకుంది. వాటి ఆధారంగానే కేసు కొనసాగించడమే సిట్‌ ఏకైక విధానంగా మారింది. 2014–19 మధ్య మద్యం విధానం ముసుగులో తాను చేసిన కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రస్తుతం చంద్రబాబు ఈ అక్రమ కేసు కుట్రకు తెరతీశారన్నది సుస్పష్టం.విక్రయాలు పెంచిందెవరు? మద్యం అమ్మకాలు పెరిగిన కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. గతంలో చంద్రబాబు హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు ప్రతి ఏటా భారీగా పెరగ్గా... అనంతరం వైఎస్‌ జగన్‌ హయాంలో 2019–24లో అమ్మకాలు ప్రతి ఏటా గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది చంద్రబాబు సర్కారుకేనన్నది సుస్పష్టం. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం విధానం తేల్చిచెప్పిన కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా చంద్రబాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిన అభియోగాలనే గతంలో టీడీపీ దు్రష్పచారం చేసింది. వాటిని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘కాంపిటీటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నిర్ద్వందంగా తిరస్కరించడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ సీసీఐకి 2021లో ఫిర్యాదు చేయించింది. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. దీనిపై విచారించిన సీసీఐ 2022 సెపె్టంబరు 19న విస్పష్టమైన తీర్పు ప్రకటించింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని.. బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్ల విధానం పారదర్శకంగా ఉందని తన తీర్పులో స్పష్టం చేసింది. సీసీఐ తిరస్కరించిన ఆరోపణలతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్‌ కుట్రేనన్నది స్పష్టమవుతోంది. అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్‌ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? ⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? ⇒ దుకాణాలకు తోడు పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్‌ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ⇒ 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్‌ రేట్లను పెంచి.. డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా?⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ⇒ ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? ⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? వైఎస్సార్‌సీపీ హయాంలో.. ⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్‌ వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది. ⇒ లిక్కర్‌ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది. ⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది. ⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. ⇒ మద్యం ధరలను షాక్‌ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది. ⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.

Rasi Phalalu: Daily Horoscope On 15-05-2025 In Telugu4
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.తదియ రా.1.46 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: జ్యేష్ఠ ప.12.26 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.8.58 నుండి 10.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.32, సూర్యాస్తమయం: 6.19. మేషం.. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.వృషభం.... ముఖ్యమైన పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వాహన, గృహయోగాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నతి.మిథునం... నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.కర్కాటకం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు.సింహం.... కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.కన్య.... రుణాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. నూతన ఒప్పందాలు. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.తుల... ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.వృశ్చికం... విద్యార్థులు సత్తా నిరూపించుకుంటారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.ధనుస్సు.. ముఖ్య పనులు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యపరంగా చికాకులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.మకరం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.కుంభం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.మీనం... వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

India Successfully Tests New Counter-drone System Bhargavastra5
భార్గవాస్త్రం సిద్ధం

న్యూఢిల్లీ: ప్రత్యర్థి దేశాల డ్రోన్లు, మానవ రహిత గగనతల వాహనాలను తుత్తునియలు చేసే స్వదేశీ కౌంటర్‌–డ్రోన్‌ సిస్టమ్‌ ‘భార్గవాస్త్ర’ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల రూపంలో ఎదురవుతున్న ముప్పును సమర్థంగా తిప్పికొట్టడంలో గొప్ప ముందడుగు వేసింది. సోలార్‌ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌(ఎస్‌డీఏల్‌) అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ల నిరోధక వ్యవస్థను ఒడిశా రాష్ట్రం గోపాల్‌పూర్‌లోని సీవార్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌(ఏఏడీ) అధికారుల సమక్షంలో మంగళవారం పరీక్షించారు. మొత్తం మూడు ట్రయల్స్‌ నిర్వహించగా, అన్నీ విజయవంతమయ్యాయి. ఎక్కడా గురి తప్పలేదు. ‘భార్గవాస్త్ర’లోని నాలుగు మైక్రో రాకెట్లు అన్ని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి. తొలుత రెండు రాకెట్లను వేర్వేరుగా ఫైర్‌ చేశారు. దాంతో రెండు ట్రయల్స్‌ పూర్తయ్యాయి. మూడో ట్రయల్‌లో భాగంగా.. మరో రెండు రాకెట్లను ఒకేసారి సాల్వో మోడ్‌లో కేవలం రెండు సెకండ్ల వ్యవధిలోనే పరీక్షించారు. నాలుగు రాకెట్ల పనితీరూ అద్భుతంగా ఉన్నట్లు తేలింది. అవి నిర్దేశిత లాంచ్‌ పారామీటర్లను సాధించాయి. భారీ డ్రోన్లతో దాడులు జరిగినప్పుడు వాటిని గురిపెట్టి కచ్చితంగా నేలకూల్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌ సొంతం చేసుకుంది. పాకిస్తాన్‌ ఉగ్రవాదులపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ప్రారంభించిన కొన్ని రోజులకే భార్గవాస్త్రను విజయవంతంగా పరీక్షించడం ప్రాధాన్యం సంతరించుకుంది. → భార్గవాస్త్రలో మొదటి దశలో ఆన్‌గైడెడ్‌ మైక్రో రాకెట్లు ఉంటాయి. ఇవి శత్రుదేశాల డ్రోన్లను కూల్చివేస్తాయి. → ఇక రెండో దశలో గైడెడ్‌ మైక్రో మిస్సైల్‌ ఉంటుంది. ఇది పిన్‌పాయింట్‌ కచ్చితత్వంతో ప్రత్యర్థి డ్రోన్లను చిత్తుచేస్తుంది. శత్రువు డ్రోన్లు తప్పించుకొనే అవకాశమే ఉండదు. గైడెడ్‌ మైక్రో మిస్సైల్‌ను గతంలోనే పరీక్షించారు. → అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో సమర్థంగా పనిచేసేలా భార్గవాస్త్రను అభివృద్ధి చేశారు. సముద్ర మట్టానికి 5 కిలోమీటర్లకుపైగా ఎత్తులోనూ చక్కగా పనిచేయగలదు. భారత సైనిక దళాల అవసరాలను అనుగుణంగా రూపొందించారు. → పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, చాలా తక్కువ ఖర్చుతో భార్గవాస్త్రను డిజైన్‌ చేయడం విశేషం. త్రివిధ దళాల అవసరాల మేరకు ఇందులో అదనంగా మార్పుచేర్పులు చేసుకోవచ్చని ఎస్‌డీఏఎల్‌ వెల్లడించింది. → అడ్వాన్స్‌డ్‌ సీ4ఐ(కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, ఇంటెలిజెన్స్‌) టెక్నాలజీతో భార్గవాస్త్ర పనిచేస్తుంది. గగనతలంలో ఎదురయ్యే ముప్పును రియల్‌–టైమ్‌లో ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. → ఇందులోని రాడార్‌ 6 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించగలదు. అలాగే ఎలక్ట్రో ఆప్టికల్‌/ఇన్‌ఫ్రారెడ్‌(ఈఓ/ఐఆర్‌) సెన్సార్లు ‘లో రాడార్‌ క్రా–సెక్షన్‌’ లక్ష్యాలను కనిపెట్టగలవు. → కౌంటర్‌–డ్రోన్‌ టెక్నాలజీలో భార్గవాస్త్ర ఒక మైలురాయి అని ఎస్‌డీఏఎల్‌ అధికారులు చెబుతున్నారు. → కొన్ని దేశాలు భార్గవాస్త్ర తరహాలో మైక్రో–మిస్సైల్‌ సిస్టమ్స్‌ను రూపొందించినప్పటికీ... పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖర్చుతో ఇలాంటి బహుళ దశలతో కూడిన కౌంటర్‌–డ్రోన్‌ వ్యవస్థను ఎవరూ తయారు చేయలేకపోయారు. → భార్గవాస్త్రను హార్డ్‌కిల్‌ మోడ్‌లో రూపొందించారు. భారీ డ్రోన్లతోపాటు చాలా చిన్నస్థాయి డ్రోన్లను కూడా గుర్తించి, కూల్చివేయగలదు.

Indian-origin Canadians in Mark Carney cabinet6
కెనడా కేబినెట్లో మనోళ్లు 

ఒట్టావా: కెనడాలో మార్క్‌ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు కీలక పదవులు దక్కాయి. విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్‌ (58) , అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా మణీందర్‌ సిద్ధూ (41) బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ వ్యవహారాల సహాయ మంత్రిగా రణ్‌దీప్‌ సరాయ్‌ (50), నేర నియంత్రణ శాఖ సహాయ మంత్రిగా రూబీ సహోటా (44) ప్రమాణస్వీకారం చేశారు. అనిత భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. ‘‘ఇది నాకు గర్వకారణం. కెనడియన్లకు సురక్షితమైన, న్యాయమైన ప్రపంచాన్ని అందించడానికి ప్రధాని మార్క్‌ కార్నీ బృందంతో కలిసి పని చేయనున్నా’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అనిత కెనడా లిబరల్‌ పారీ్టలో సీనియర్‌ సభ్యురాలు. గతంలో ప్రజా సేవలు, ఇన్నొవేషన్, సైన్స్, పరిశ్రమలు, రక్షణ మంత్రిగా పలు పదవులు నిర్వహించారు. మంత్రివర్గంలో స్థానం దక్కడం తనకు జీవిత కాలపు గౌరవమని సిద్ధూ పేర్కొన్నారు. ఆమెకు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయం సాధించిన రెండు వారాల అనంతరం కార్నీ తన మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించారు. మంత్రివర్గం సంఖ్యను 39 నుంచి 28కి కుదించారు. వారిలో సగం మహిళలే కావడం విశేషం! కెనడా–యూఎస్‌ సంబంధాల ఉద్రిక్తతల మధ్య కెనడియన్లు కోరుకునే, అవసరమైన మార్పును అందించడానికి మంత్రివర్గాన్ని ఎన్నుకున్నట్లు కార్నీ తెలిపారు. కెనడాలోనే పుట్టి పెరిగిన అనిత అనిత ఆనంద్‌ 1967 మే 20న కెనడాలోని కెంట్‌విల్లేలో భారతీయులైన వైద్య దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ఎస్వీ ఆనంద్‌ది తమిళనాడు కాగా తల్లి సరోజ్‌ డి రామ్‌ పంజాబీ. వారు 1960ల్లో భారత్‌ నుంచి కెనడాకు వలస వెళ్లారు. 1985లో ఒంటారియోలో పొలిటికల్‌ సైన్స్‌లో అకడమిక్‌ డిగ్రీ, ఆక్స్‌ఫర్డ్‌ నుంచి న్యాయశాస్త్రంలో ఆనర్స్, డల్హౌసీ వర్సిటీ నుంచి బ్యాచిలర్స్, టొరంటో వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. న్యాయవాద వృత్తిలో, బోధన, ప్రజా సేవలో బలమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. 1995లో న్యాయవాది, వ్యాపారవేత్త జాన్‌ నోల్టన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. అనిత 2019లో కెనడా మంత్రివర్గంలో అడుగుపెట్టారు. ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. రక్షణ మంత్రిగా ఆమె క్రమశిక్షణ, పనితీరుకు ప్రశంసలు లభించాయి. నిరసనల ఫలితంగా గతేడాది జస్టిన్‌ ట్రూడో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక ఆయన వారసునిగా అనిత పేరు ప్రముఖంగా విని్పంచింది. ఇక సిద్ధూవి పంజాబీ మూలాలు. తల్లిదండ్రులతో కలిసి బాల్యంలోనే కెనడా వెళ్లారు. బ్రాంప్టన్‌ ఈస్ట్‌ ఎంపీగా ఉన్నారు. పలువురు మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశారు. రూబీవీ పంజాబీ మూలాలే. ఆమె టొరంటోలో జని్మంచారు. సరాయ్‌ తల్లిదండ్రులు కెనడా వలస వెళ్లారు. బ్రిటిష్‌ కొలంబియాలో జన్మించిన ఆయన నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 22 మంది భారత సంతతి నేతలు ఎంపీగా గెలవడం తెలిసిందే.

Sakshi Guest Column On Chandrababu govt Axis Power Agreement7
ఎవరి కోసం ఈ ఒప్పందం?

చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్‌ విధానాలతో ముందుకు పోతున్నది. పోర్టులను, మెడికల్‌ కాలేజీలను, విద్య, వైద్యం వంటివాటిని ప్రైవేట్‌ పరం చేయనుంది. తాజాగా నిత్యం అవసరంగా ఉన్న కరెంట్‌ను కూడా ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెడుతున్నది. అందులో భాగమే ‘యాక్సిస్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’తో విద్యుత్‌ కొనుగోళ్ల గురించి చేసుకున్న ఒప్పందం. 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మించి, వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్‌ 25 సంవత్సరాల పాటు యూనిట్‌కు 4.60 రూపాయల చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ధర తగ్గించేందుకు వీలు లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్‌’ షరతు విధించారు.ఇంతకు ముందు కూడా యాక్సిస్‌ సంస్థ 5 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకునేందుకు 2018లో టీడీపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. అందుకే 400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2019 జనవరి 23న విద్యుత్‌ సంస్థలు అనుమతించాయి. దీన్ని గమనిస్తే యాక్సిస్‌తో చంద్రబాబు అనుబంధం ఏమిటో తెలుస్తుంది. 2014–18 మధ్య టీడీపీ పాలనలోనే ఏపీ ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు 5.98 రూపాయల చొప్పున చెల్లించాలి. రెండవ ఏడాది నుంచి ఏటా 3% పెంపుతో పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగు తుంది. ఫలితంగా పదో ఏడాది నాటికి యూనిట్‌కు 7 రూపాయలకు పైగా చెల్లించాలి. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ యూనిట్‌ 4.20 రూపాయలకే అందు బాటులో ఉన్నా, 7 రూపాయలకు ప్త్రెవేట్‌ సంస్థల నుంచి కొనేందుకు టీడీపీ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది?2019 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లోని పీపీఏల సమీక్షతో పాటు 2019 ఏప్రిల్‌ 1 ముందు కుదిరిన ఒప్పందాల మేరకు ఇంకా మొదలు కాని పనులను రద్దు చేయాలని ఆదేశించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో యూనిట్‌ రూ. 2.49 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని టీడీపీ వ్యతిరేకించింది. కానీ, ‘చౌకగా విద్యుత్‌ వస్తున్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయకూడదు?’ అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. యాక్సిస్‌ సంస్థ నుంచి తొలుత 400 మెగావాట్లకు, తర్వాత మరో 774.9 మెగావాట్లకు ఒప్పందాలు కుదుర్చుకునేలా దస్త్రాన్ని ఏపీఈఆర్‌సీ ఆమోదం కోసం అధికారులు పంపారు. ఆ పీపీఏల ద్వారా యూనిట్‌ ధర 4.28 రూపాయల చొప్పున ఖరారు చేయాలని డెవలపర్‌ సంస్థ విద్యుత్‌ నియంత్రణ మండలిని కోరింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో హైబ్రిడ్‌ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ యూనిట్‌ రూ. 2.90లకు దొరుకుతుంది. అలాంటప్పుడు 4.28 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేయాలి? గత ప్రభుత్వంలో 2022 నవంబర్‌ 11న యాక్సిస్‌ సంస్థ నుంచి యూనిట్‌ 3.50 రూపాయల చొప్పున పీపీఏల కొనుగోలు ఆమోదం కోసం ఏపీఈఆర్‌సీ అనుమతి కోసం డిస్కం పంపింది. ఆ పీపీఏలను ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాలంటూ డ్రాప్ట్‌ పీపీఏలను విద్యుత్‌ నియంత్రణ మండలి డిస్కంకి తిప్పి పంపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్‌ చట్టం 2003 సెక్షన్‌ 108 ప్రకారం యాక్సిస్‌ సంస్థతో పీపీఏలను ఆమోదించాలంటూ 2024 సెప్టెంబర్‌ 24న ఏపీఈఆర్‌సీకి లేఖ రాసి, దీన్ని తిరస్కరించటానికి వీలు లేదనీ, ఒక వేళ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ముందుకు పోతా మనీ బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. యాక్సిస్‌తో కచ్చితంగా పీపీఏలు కుదుర్చుకోవాలంటూ విద్యుత్‌ సంస్థలను అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌ ఆదేశించలేదు. కాని ఆ సంస్థతో పీపీఏలు కుదుర్చు కోవటానికి విద్యుత్‌ సంస్థలు ముందుకు వచ్చాయి. అధికారులు కూడా ఆ సంస్థ నుంచి విద్యుత్‌ తీసుకోవటం చాలా చౌకనే రీతిలో వివరణ ఇవ్వటం ద్వారా పీపీఏలకు మద్దతు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం, విద్యుత్‌ అధికారుల మద్దతుతో యాక్సిస్‌ సంస్థకు చెందిన సౌర, పవన ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే వాటి ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీకి చేరాయి. విద్యుత్‌ యూనిట్‌ ట్యారిఫ్‌ ఎంత ఉండాలో కూడా యాక్సిస్‌ సంస్థే ప్రతిపాదించింది. దాన్ని ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ కో – ఆర్డినేషన్‌ కమిటీ (ఏపీపీసీసీ) ఏపీఈఆర్‌సీ ఆమోదం కోసం పంపింది. దీన్ని గమనిస్తే కూటమి ప్రభుత్వ విద్యుత్‌ ఒప్పందం ద్వారా యాక్సిస్‌ సంస్థ ఎంత ప్రయోజనం పొందుతుందో తెలుస్తుంది. బొల్లిముంత సాంబశివరావు వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుమొబైల్‌: 98859 83526

Sakshi Editorial On Donald Trump8
‘శాంతిదూత’ ట్రంప్‌!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అంత సులభంగా అర్థం కారని ఆయన గల్ఫ్‌ దేశాల పర్యటన తీరుతెన్నులు చూస్తే తెలుస్తుంది. తాను అధికారంలోకొస్తే పశ్చిమాసియాలో సాగుతున్న ‘అంతూ దరీ లేని యుద్ధాలకు’ ముగింపు పలుకుతానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన తరచు అనే వారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు రోజుల గల్ఫ్‌ పర్యటనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చదల్చుకున్నట్టు కనబడుతోంది. తన రెండో దశ పాలనలో ట్రంప్‌ మొదలెట్టిన తొలి విస్తృత విదేశీ పర్యటన ఇది. ఈ ప్రాంతంలోనే ఉన్న ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లకపోవటం ఆయన తాజా వైఖరికి సంకేతం. ఇది ఎన్నాళ్లుంటుందన్నది తెలియక పోయినా చేస్తున్న ప్రకటనలైతే భిన్నంగా ఉన్నాయి. ఇరాన్‌తో అమెరికా 46 ఏళ్లుగా సాగిస్తున్న ‘అప్రకటిత యుద్ధం’ ఇక కొనసాగనీయరాదన్న అభిప్రాయం ఉందని మంగళవారం సౌదీ అరే బియాలోని రియాద్‌లో ఆయన ప్రకటించారు. బుధవారం సిరియా అధ్యక్షుడు అహ్మద్‌ అల్‌– షారాతో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుకొనాలని సలహా ఇచ్చారు. అల్‌–షారాకు గతంలో అల్‌ కాయిదాతో, ఐఎస్‌తో సంబంధాలుండేవి. ఈ భేటీకి ముందే గల్ఫ్‌ సహకార మండలి(జీసీసీ) సదస్సులో సిరియాపై ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు తెలియజేశారు. ఈ నిర్ణయాలపై ఇజ్రాయెల్‌ అలిగినా, మరొకరు అభ్యంతర పెట్టినా ఆయన ఖాతరు చేయదల్చుకున్నట్టు లేరు. గత నెలలో ట్రంప్‌ను కలిసి సిరియాపై ఆంక్షలు కొనసాగించాలని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ వేడుకున్నారు. ఇరాన్‌ విషయంలో అయితే చాలా చెప్పివుంటారు. సిరియాపై ఆంక్షలు ఎత్తేయటం, ఇరాన్‌తో చెలిమికి సిద్ధపడటం నెతన్యాహూకు ససేమిరా ఇష్టం లేదు. కానీ లీకుల ద్వారా తప్ప నేరుగా తన అసమ్మతిని ఇంతవరకూ తెలియజేయలేదు. ఆ మధ్య ట్రంప్‌ ఇందుకు భిన్నంగా మాట్లాడారు. అణు ఒప్పందాన్ని అంగీకరించి, శాంతికి సిద్ధపడకపోతే ఇరాన్‌ భారీ స్థాయి ఒత్తిడులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. కానీ ట్రంప్‌ తాజా ధోరణి అందుకు భిన్నంగా ఉంది. ఇరాన్‌తో చెలిమి గురించి ఆయన ఏదో మాటవరసకు అనలేదు. ‘ప్రస్తుతం అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలు కొన్ని తరాల కిందట మాపై శత్రుత్వంతో చెలరేగినవే’ అని గుర్తుచేశారు. సిరియా, ఇరాన్‌ల విషయంలో తన వైఖరి మారటానికి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ కారణమని ఆయన జీసీసీ వేదికపైనే ప్రకటించారు కూడా. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతూనే ఉన్నా ఈనెల 5న వారితో అవగాహనకొచ్చారు. స్నేహంలోనైనా, శత్రుత్వంలోనైనా ట్రంప్‌ తీరే వేరని ఆయన నిర్ణయాలు తెలియజేస్తున్నాయి. మూడేళ్లనాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సౌదీ వచ్చినప్పుడు దేశంలో మానవహక్కులు అడుగంటుతున్న వైనంపై సౌదీ యువరాజును నేరుగా ప్రశ్నించారు. 2018లో జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గి ప్రాణం తీయించడాన్ని ప్రస్తావించారు. ఈ మాదిరి హత్యలు తమకు సమ్మతంకావని చెప్పారు. అందుకే కావొచ్చు... ఇప్పుడు ట్రంప్‌కు ఎదురైన స్వాగతసత్కారాల వంటివి బైడెన్‌కు లభించలేదు. సౌదీ గడ్డపై గతకాలపు అమెరికా అధ్యక్షుల్ని నిశితంగా విమర్శించటానికి ట్రంప్‌ వెన కాడలేదు. అమెరికన్‌ సమాజం గురించి కాస్తయినా తెలియనివారు ఎంతో జటిలమైన గల్ఫ్‌ సమా జాల్లో జోక్యం చేసుకోవటానికి ఎగబడ్డారని వ్యాఖ్యానించటం చిన్న విషయం కాదు. పశ్చిమాసియా దేశాలతో ఎన్ని వేల కోట్ల డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకోగలమన్నదే ఆయన ఆరాటంగా కనబడు తోంది. దానికి తగ్గట్టే మంగళవారం సౌదీతో 14,200 కోట్ల డాలర్ల మేర ఆయుధ ఒప్పందంపై సంతకాలయ్యాయి. ఇదిగాక అమెరికాలో 60,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు యువరాజు ప్రకటించారు. ట్రంప్‌ దీంతో సంతృప్తిపడలేదు. దీన్ని లక్ష కోట్ల డాలర్లకు పెంచాలని ఆ వేదికపైనుంచే కోరారు. సౌదీతో అమెరికాకు ఎప్పుడూ మంచి స్నేహసంబంధాలేవున్నా ఈ స్థాయి ఒప్పందాలెప్పుడూ లేవు. ఒక పరిశోధక సంస్థ నివేదిక ప్రకారం 2010–20 మధ్య అమెరికాకు సౌదీతో 10,000 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలు మాత్రమే కుదిరాయి.స్నేహం పేరుతో అమెరికాను దోచుకుంటున్నారని నాటో భాగస్వామ్య దేశాలైన పాశ్చాత్య మిత్రులపై తరచూ విరుచుకుపడే ట్రంప్‌...పశ్చిమాసియా దేశాలకు ఏ కష్టమొచ్చినా అమెరికా దృఢంగా నిలబడుతుందని హామీ ఇవ్వటం గమనార్హం. ఇంధన అవసరాల్లోనూ, రక్షణరంగంలోనూ పనికొచ్చే అత్యంత విలువైన లిథియం, కోబాల్ట్‌లతోపాటు థోరియం వంటి రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్స్‌ అన్వేషించి అమెరికా చేర్చటానికి సౌదీ–అమెరికా ఖనిజ సంస్థల మధ్య ఈ పర్యటనలో 900 కోట్ల డాలర్ల ఒప్పందం కుదరటంతో ట్రంప్‌ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. అందువల్లే పశ్చిమాసియాకు శక్తి మంతమైన సెమీ కండక్టర్‌ చిప్స్, ఏఐ డేటా సెంటర్లకు పనికొచ్చే కీలక విడిభాగాల ఎగుమతులకు ఆయన పచ్చజెండా ఊపారు. ఇది సంప్రదాయ అమెరికా విదేశాంగ విధానానికి భిన్నం.ఈ పర్యటనలో ట్రంప్‌ స్వకార్యమూ నెరవేర్చుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేశ ప్రయోజనాలకూ, అధ్యక్షుడిగా ఆయన నిర్ణయాలకూ చుక్కెదురన్నది విమర్శకుల వాదన. ట్రంప్‌ సొంత సంస్థకు సారథ్యం వహిస్తున్న ఆయన కుమారులు గత కొన్నివారాలుగా గల్ఫ్‌లో తిష్ఠ వేసి తమ సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, కుదిరిన ఒప్పందాలన్నీ వారికి మేలు కలిగించేవేననీ అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్‌ వైఖరి మళ్లీ మారేలోగా పశ్చిమాసియా చక్కబడితే ప్రపంచానికి అంతకన్నా కావాల్సిందేమీ లేదు.

The state is in decline during Chandrababu's one year rule9
‘అప్పే’.. ఏమీ లేదు!

మహమ్మారులు ప్రబలలేదు.. ప్రకృతి విపత్తులు ముంచెత్తలేదు.. ఆర్థిక సంక్షోభం లాంటివి తలెత్తలేదు..సంక్షేమ పథకాలు ఇచ్చింది కూడా లేదు.. కానీ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. రాబడులు పడిపోతుండగా.. గ్రాంట్లు కొడిగడుతున్నాయి. సంపద పెంచేస్తా.. అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పనిచేయలేకపోగా ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. కాగ్‌ వెలువరించిన నివేదిక ఆధారంగా వెల్లడైన వాస్తవాలు.. సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వ ఏలుబడిలో రాష్ట్ర ఆదాయం తిరోగమనంలో ఉందని కాగ్‌ గణాంకాలు వెల్లడించాయి. ఓపక్క రెవెన్యూ రాబడి తగ్గుతూ ఇంకోపక్క రాష్ట్ర అప్పులు భారీగా పెరుగుతున్నట్లు తేలింది. మార్చి నెలతో ముగిసిన 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రాబడులు, వ్యయాల లెక్కలను కాగ్‌ బుధవారం వెల్లడించింది. వీటిని గమనిస్తే.. సంపద సృష్టించడం దేవుడెరుగు.. అస్తవ్యస్త పాలనతో ఉన్న సంపదను కూడా ఆవిరి చేసేస్తున్నారని స్పష్టమవుతోంది. అంతకుముందు వచ్చిన దానిని కూడా నిలబెట్టలేకపోయారని అర్థమవుతోంది. ఇందుకు ప్రధాన కారణం కక్షసాధింపులు, రెడ్‌బుక్‌ వేధింపులపైనే దృష్టిపెట్టి పాలనను గాలికి వదిలేయడమేనని తెలుస్తోంది. సహజంగా ఎలాంటి సంక్షోభాలూ లేకుంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రాబడులకు మించిన ఆదాయం వస్తుంది. కానీ, రాష్ట్రంలో 2023–24లో వచ్చిన ఆదాయం 2024–25లో రాకపోగా రూ.5,520 కోట్లు తగ్గినట్టు కాగ్‌ గణాంకాలు పేర్కొంటున్నాయి. మరోపక్క రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు తేల్చాయి. అంటే, సంపదలోనూ, వృద్ధిలోనూ రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నట్లు తేలుతోంది.అమ్మకం పన్ను తగ్గిందంటే..» అమ్మకం పన్నుతో పాటు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల ఆదాయం 2024–25లో తగ్గిపోయింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే అమ్మకం పన్ను రాబడి రూ.1,053 కోట్లు పడిపోయింది. దీని అర్థం ప్రజల కొనుగోలు శక్తి తగ్గడమేనని ఆర్థిక రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులేక కొనుగోలు శక్తి తగ్గిపోవడం.. అమ్మకం పన్ను ద్వారా రాబడి పడిపోవడానికి ప్రధాన కారణమని అధికార వర్గాలు కూడా తెలిపాయి.» స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్ల ఆదాయం కూడా కుదేలైంది అంటే రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పురోగతి లేదని స్పష్టమవుతోంది. అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో స్టాంప్స్‌ అండ్‌ రిజి్రస్టేషన్‌ ఆదాయం రూ.705 కోట్లు తగ్గిపోయింది.» పన్నేతర ఆదాయం కూడా తిరోగమనంలో ఉందని కాగ్‌ గణాంకాలు స్పష్టం చేశాయి. అంతకుముందు ఆర్థిక ఏడాదిలో పోల్చితే 2024–25లో ఇది రూ.842 కోట్లు తగ్గినట్లు కాగ్‌ గణాంకాలు పేర్కొన్నాయి.» కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ల రూ­పంలో రావాల్సిన నిధుల్లోనూ భారీగా తగ్గుదల నమోదైంది. 2023–24తో పోల్చితే 2024–25లో గ్రాంట్లు రూ.14,563 కోట్లు తగ్గిపోయాయి.» బడ్జెట్‌ అంచనాలను మించి అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని కాగ్‌ గణాంకాలు పేర్కొన్నాయి. తెచ్చిన అప్పును ఆస్తుల కల్పన కోసం మూలధన వ్యయంపై పెట్టాలని ఇటీవల చంద్రబాబు విలేకరుల సమావేశంలో నీతి వాక్యాలు పలికారు. అయితే, 2023–24తో పోల్చితే 2024–25లో మూలధన వ్యయం రూ.4,413 కోట్లు తగ్గిపోయింది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనపైనా పెట్టలేదు.. సూపర్‌ సిక్స్‌ హామీలనూ అమలు చేయలేదు.అంతా బడాయి» విద్య, వైద్యం, పౌష్టికాహారం, సంక్షేమానికి సంబంధించి సామాజిక రంగ వ్యయం కూడా అంతకుముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25లో రూ.4,696 కోట్లు తగ్గినట్లు కాగ్‌ స్పష్టం చేసింది. రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగినట్లు తేల్చింది.» కాగ్‌ గణాంకాలనే చూస్తే 2023–24 కన్నా 2024–25లో రాష్ట్ర రెవెన్యూ రాబడులు తగ్గిపోయినట్లు తేలుతోంది. అయినా రాష్ట్ర వృద్ధి రేటు పెరిగి పోతోందని.. అదే సంపద అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నారు.» ఇదంతా కేవలం అప్పులు ఎక్కువగా చేయడానికే తప్ప.. రాష్ట్ర సంపద సృష్టికి కాదని స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Smartphone sales stagnate in rural India10
చిన్న నగరాల్లో స్మార్ట్‌ఫోన్స్‌ హవా!

మెట్రోలు, బడా నగరాల వంటి అర్బన్‌ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు పతాక స్థాయికి చేరుకోవడంతో డిమాండ్‌ మందకొడిగా మారింది. అయితే, హ్యాండ్‌సెట్‌ తయారీ సంస్థలకు ద్వితీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాలు ఇప్పుడు ఈ లోటును భర్తీ చేస్తున్నాయి. చౌక ఫోన్లే కాదు.. ప్రీమియం 5జీ ఫోన్ల కొనుగోళ్లకూ కస్టమర్లు తగ్గేదేలే అంటున్నారు. పెద్ద నగరాలను మించి విక్రయాలు నమోదవుతుండటంతో సేల్స్‌ పెంచుకోవడానికి కంపెనీలు రూరల్‌ రూట్‌ ఎంచుకుంటున్నాయి. అంతేకాదు, ఫైనాన్సింగ్‌ ఆప్షన్ల దన్నుతో సెకండ్‌ హ్యాండ్‌ 4జీ ఫోన్లు కూడా హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఒకప్పుడు కీప్యాడ్‌ ఫీచర్‌ ఫోన్స్‌ వాడకానికి బాగా అలవాటు పడ్డ గ్రామీణ, చిన్న పట్టణాల ప్రజలు ‘స్మార్ట్‌’గా అప్‌గ్రేడ్‌ అవుతున్నారు. దీంతో చిన్న నగరాలు, పట్టణాలతో పాటు పల్లెల్లోనూ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్‌ దూసుకెళ్తోంది. పెద్ద నగరాల్లో స్తబ్దుగా మారిన సేల్స్‌ను కంపెనీలు అక్కడ పూడ్చుకుంటున్నాయి. దీంతో మొత్తంమీద స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు పడిపోకుండా, వృద్ధి సిగ్నల్స్‌కు వీలవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘4జీతో పాటు 5జీ మోడల్స్‌ కూడా అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటంతో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ ఏడాది అమ్మకాల వృద్ధి భారీగా నమోదుకానుందని టెక్‌ఆర్క్‌ అడ్వయిజర్‌ అజయ్‌ శర్మ చెప్పారు. ‘2023, 2024 సేల్స్‌ ట్రెండ్‌ను పరిశీలిస్తే, పెద్ద నగరాలకు మించి టియర్‌–2 నగరాల్లో అమ్మకాలు పుంజుకున్నాయి. ప్రీమియం ఫోన్ల పట్ట ఆసక్తి ఈ నగరాలకూ పాకింది. మరోపక్క, చౌక 5జీ ఫోన్ల దన్నుతో కొన్ని బ్రాండ్‌లు మిగతా కంపెనీల కంటే వేగంగా వృద్ధి చెందుతున్నాయి’ అని పేర్కొన్నారు.ఆఫ్‌లైన్‌ స్టోర్స్‌ ద్వారా... చిన్న నగరాలు, పట్టణాల్లో కూడా ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో పాటు డిజిటల్‌ టెక్నాలజీ పట్ల అవగాహన, రిటైల్‌ నెట్‌వర్క్‌లను విస్తరిస్తుండటం వల్ల కస్టమర్లు హై–ఎండ్‌ డివైజ్‌లకు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌ సుభమ్‌ సింగ్‌ తెలిపారు. ‘ప్రధాన హ్యాండ్‌సెట్‌ బ్రాండ్‌లన్నీ ఆఫ్‌లైన్‌ (రిటైల్‌ స్టోర్స్‌) ద్వారా చిన్న నగరాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ (ఐడీసీ) గణాంకాల ప్రకారం 2024లో 15.1 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. 4 శాతం వృద్ధి నమోదైంది. స్టోర్‌లో నేరుగా ఫోన్‌ను చూసి, అనుభూతి చెందే అవకాశం, అలాగే ఈజీ ఫైనాన్సింగ్‌ ఆప్షన్లతో ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ కొనుగోళ్లకు వెనకాడటం లేదు’ అని సింగ్‌ వివరించారు. 30 నగరాల్లో నిర్వహించిన మార్కెట్‌ అధ్యయనం ప్రకారం, బడా నగరాల్లో (టియర్‌–1) వార్షిక అమ్మకాల వృద్ధి సింగిల్‌ డిజిట్‌కు పరిమితం కాగా, టియర్‌–2, అంతకంటే చిన్న నగరాల్లో రెండంకెల వృద్ధి నమోదవుతున్నట్లు చెప్పారు. ఫీచర్‌ ఫోన్స్‌ కస్టమర్లు అప్‌గ్రేడ్‌ అవుతుండటం, అనువైన రుణ సదుపాయాల వల్ల తృతీయ శ్రేణి (టియర్‌–3) ప్రాంతాల్లో తమ అమ్మకాలు 19–20 శాతం పెరిగాయని హ్యాండ్‌సెట్‌ బ్రాండ్‌ టెక్నో సీఈఓ అరిజిత్‌ తలపాత్ర పేర్కొన్నారు.అమ్మకాలు ఫ్లాట్‌.. ఆదాయాలు జూమ్‌ కోవిడ్‌ ముందు నాటి స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల వృద్ధితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో సేల్స్‌ మందగమనం స్పష్టంగా కనబడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటా విక్రయాలు 15 కోట్ల స్థాయికి పరిమితం అవుతున్నాయి. ఈ ఏడాది (2025) అమ్మకాలు ఫ్లాట్‌గా ఉంటాయని అంచనా వేస్తున్నారు. టాప్‌లేపుతున్న వివో, శాంసంగ్, షావోమి, ఒప్పో, రియల్‌మీ వంటి బ్రాండ్‌లకు ఇది ప్రతికూల సిగ్నల్స్‌ పంపుతోంది. అయితే, 2024లో దేశీ స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమ మొత్తం ఆదాయం ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి (9% వార్షిక వృద్ధి) దూసుకెళ్లడం విశేషం. ప్రధానంగా 5జీ, జెనరేటివ్‌ ఏఐ వంటి ఫీచర్లు గల ఖరీదైన స్మార్ట్‌ఫోన్స్‌పై కస్టమర్లు భారీగా ఖర్చు చేయడమే దీనికి కారణమని కౌంటర్‌పాయింట్‌ వెల్లడించింది.సగం ఫోన్‌ సేల్స్‌ అక్కడి నుంచే... ‘ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల వాడకం ట్రెండ్‌ మెట్రోలు, పెద్ద నగరాలకే పరిమితం కావడం లేదు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా రూ.8,500–17,000 స్థాయికి మించి ఖరీదైన ఫోన్లకు కస్టమర్లు సై అంటున్నారు. ముఖ్యంగా ఔత్సాహిక మధ్య తరగతి కొనుగోలుదారులు వేగంగా ప్రీమియం ఫోన్లకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారు’ అని సీసీఎస్‌ ఇన్‌సైట్‌ సీనియర్‌ ఎనలిస్ట్‌ ఏక్తా మిట్టల్‌ చెప్పారు. స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలో భవిష్యత్తు వృద్ధికి చిన్న నగరాలే చోదకంగా నిలుస్తాయంటున్నారు. ప్రస్తుతం సగానికి పైగా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు చిన్న నగరాలు, పట్టణాల్లోనే నమోదవుతున్నాయని కూడా సీసీఎస్‌ ఇన్‌సైట్‌ తెలిపింది. మరోపక్క, జియో, ఎయిర్‌టెల్‌ తమ 5జీ నెట్‌వర్క్‌ను గ్రామీణ, సబర్బన్‌ ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తుండటం, క్వాల్‌కామ్, మీడియాటెక్‌ వంటి చిప్‌ తయారీ దిగ్గజాలు రూ.12,000 కంటే తక్కువ స్థాయిలో 5జీ ఫోన్లు లభించేలా చౌక 5జీ ప్రాసెసర్లను అందుబాటులోకి తేవడం కూడా పరిశ్రమకు దన్నుగా నిలుస్తోందనేది నిపుణుల మాట!–సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement