అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి లోకేశ్ ఫొటోగ్రాఫర్లు
సాక్షి, అమరావతి: శాసనసభ ప్రెస్ గ్యాలరీలో మంగళవారం మంత్రి లోకేశ్ ఫొటో గ్రాఫర్లు కలకలం సృష్టించారు. నిబంధనల ప్రకారం ప్రెస్ గ్యాలరీలోకి సెల్ఫోన్లు, కెమెరాలు, రికార్డర్లు తీసుకురాకూడదు. మీడియా ప్రతినిధులు తప్ప ఇతరులకు అనుమతి ఉండదు. అయితే మంత్రి లోకేశ్ కార్యాలయ అధికారులు పంపారంటూ ఓ మార్షల్ను వెంటబెట్టుకుని ఇద్దరు ఫొటోగ్రాఫర్లు ప్రెస్ గ్యాలరీలోకి ప్రవేశించారు.
వీరు స్పీకర్ పోడియం ఎదురుగా ఉండే ప్రదేశానికి వెళ్లి ఫొటోలు తీయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలుపుతున్నారు. ఇంతలో కెమెరా ఫ్లాష్ తన ముఖం మీద పడడంతో స్పీకర్.. ఎవరో ఫొటోలు తీస్తున్నారని గమనించి చీఫ్ మార్షల్ను అప్రమత్తం చేశారు. దీంతో సిబ్బంది ప్రెస్ గ్యాలరీలోకి వచ్చి ఆ ఇద్దరు ఫొటోగ్రాఫర్లను బయటకు తీసుకువెళ్లారు.