Ayodhya rally
-
అందరి దృష్టి అయోధ్యపైనే..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం దిగ్గజ నేతల ర్యాలీలకు అయోధ్య వేదికగా మారనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి ఎన్నికల ప్రచార ర్యాలీలతో అయోధ్య హోరెత్తనుంది. అయోధ్యకు 27 కిమీ దూరంలోని గోసాన్గంజ్లోని మాయాబజార్లో ప్రధాని మోదీ ర్యాలీ జరగనుంది. ఇప్పటివరకూ ప్రధాని ప్రసంగాలు అభివృద్ధి, ఉగ్రవాదం, కాంగ్రెస్ వైఫల్యాల చుట్టూ సాగగా, అయోధ్య వేదికగా రామమందిర అంశంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇక ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని రామ్సనేహి ఘాట్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలు నేడు ప్రచార ర్యాలీలో పాల్గొంటారు. రామ్సనేహి ఘాట్ అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండటం గమనార్హం. మే 6న అయిదో విడతలో ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఎస్పీ, బీఎస్పీలు కూటమిగా బీజేపీని ఢీకొంటున్న క్రమంలో అయోధ్య వేదికగా మోదీ లక్ష్యంగా అగ్రనేతలు ఇద్దరూ విమర్శలతో విరుచుకుపడనున్నారు. మొత్తంమీద కీలక రాష్ట్రం యూపీలోని అయోధ్యలో అగ్రనేతల వరుస ర్యాలీలతో సందడి నెలకొంది. -
వీహెచ్పీ ర్యాలీ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో భారీ భద్రత
అయోధ్యలో తాము నిర్వహించ తలపెట్టిన ర్యాలీని ఆపే ప్రసక్తి లేదని వీహెచ్పీ స్పష్టం చేయడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆరు జిల్లాల సరిహద్దులను మూసేసి, భద్రతను గణనీయంగా పెంచింది. ఈ యాత్రను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ వీహెచ్పీ యాత్రను అనుమతించే ప్రసక్తి లేదని హోంశాఖ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో అదనపు భద్రతా బలగాలను మోహరించడంతో పాటు మొత్తం మార్గమంతా బారికేడింగ్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పది కంపెనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్, పన్నెండు కంపెనీల ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టాబ్యులరీ దళాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల ప్రజలు అయోధ్యలో ప్రవేశించకుండా ఉత్తర్వులు జారీచేసినట్లు ఐజీపీ రాజ్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. వీహెచ్పీ ర్యాలీని ఎలాగైనా అడ్డుకోవాలని యూపీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ ర్యాలీ ఈనెల 25 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఈ యాత్ర హిందువుల మనోభావాలకు సంబంధించినది కాబట్టి దాన్నుంచి వెనుదిరిగేది లేదని వీహెచ్పీ తెలిపింది. తమ పార్టీలోని ముస్లిం నేతల ఒత్తిడి వల్లే సీఎం అఖిలేష్ యాదవ్ ఇలా వ్యవహరిస్తున్నారని స్వామి చిన్మయానంద ఆరోపించారు. అభివృద్ధి శాఖ మంత్రి మహ్మద్ ఆజంఖాన్ మీద ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఆరోపణలను యూపీ మంత్రి శివపాల్ యాదవ్ తిరస్కరించారు. మతసామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.