స్కూలు మానేశాడు.. కోటిన్నర లాటరీ కొట్టాడు!
అతడు ఎప్పుడో చిన్నప్పుడే చదువు మధ్యలో మానేశాడు. తర్వాత తొలిసారి ఒక లాటరీ టికెట్ కొన్నాడు.. అంతే, ఏకంగా కోటిన్నర రూపాయలు గెలుచుకున్నాడు. ఈ ఘటన హరియాణాలోని ఫతేబాద్ జిల్లా దయ్యార్ గ్రామంలో వెలుగుచూసింది. ఆజాద్ సింగ్ అనే 24 ఏళ్ల యువకుడు తన జీవితంలో మొట్టమొదటిసారి కొన్న లాటరీ టికెట్కే ఈ బహుమతి పొందాడు. గ్రామంలోని బస్టాండు సమీపంలో చిన్న దుకాణం పెట్టుకుని, ఒక పూరిపాకలో నివసించే ఆజాద్.. పంజాబ్ ప్రభుత్వం నిర్వహించే న్యూ ఇయర్ బంపర్ లాటరీన 2016 డిసెంబర్ నెలలో సిర్సాలో కొన్నాడు.
ఆ టికెట్ మీద తప్పకుండా 400 రూపాయల బహుమతి ఉండటంతో అది వస్తుందనే తాను కొన్నానని, కానీ కోటీశ్వరుడిని అవుతానని గానీ, తన గ్రామంలో అంత ప్రముఖుడిని అవుతానని గానీ జీవితంలో ఎప్పుడూ ఊహించలేదని చెప్పాడు. జనవరిలోనే విజేతలను ప్రకటించాలి గానీ, పంజాబ్లో ఎన్నికల కారణంగా అది ఆలస్యమైంది. దాంతో ఇప్పుడు అతడికి తాను కోటిన్నర గెలుచుకున్న విషయం తెలిసింది. రెండు రోజుల క్రితం తాను లాటరీ పరిస్థితి ఏమైందని చూసుకున్నప్పుడు.. తన టికెట్కు టాప్ ప్రైజు వచ్చిందని తెలిసిందని, ముందు తన కళ్లను తానే నమ్మలేకపోయానని అన్నాడు. చివరకు పది సార్లు చూసుకుని.. లాటరీ వచ్చిన విషయాన్ని నిర్ధారించుకున్నట్లు చెప్పాడు. వెంటనే స్నేహితులకు చెప్పి, ఇంటికి వెళ్లి.. సంబరాలు చేసేసుకున్నాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదివి ఆపేసిన ఆజాద్... ముందు ఓ పక్కా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడు. తర్వాత దేవుడికి కొంత దక్షిణ వేస్తానని, ఆ తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడి, సొంత వ్యాపారం పెట్టుకుంటానని అన్నాడు.