Bastar region
-
వెళ్లినంత తేలిక కాదు.. వెనక్కి రావడం
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీ సైన్యంగా పేర్కొనే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 24వ వారోత్సవాలు ఈనెల 8తో ముగియనున్నాయి. ఒకప్పుడు పీఎల్జీఏ వారోత్సవాలంటే ఉత్తర తెలంగాణ పల్లెల్లో ఉద్రిక్తత నెలకొనేది. ఒకవైపు పటిష్ట పోలీసు నిఘా, మరోవైపు ఆ నిఘా నేత్రాల కళ్లుగప్పి మావోయిస్టులకు మద్దతు పలికేవారు కనిపించేవారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. పదేళ్లుగా తెలంగాణపై పట్టు కోసం మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. తెలంగాణ నుంచి బస్తర్ వెళ్లిన మావోయిస్టులు.. తిరిగి తెలంగాణలో ప్రభావం చూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కష్టతరమవుతున్నాయి.బస్తర్ వైపు అడుగులుశ్రీకాకుళం జిల్లాలో మొదలైన నక్సల్బరీ ఉద్యమం 80వ దశకంలో ఉత్తర తెలంగాణ జిల్లాలను ఊపు ఊపింది. అప్పటి ప్రభుత్వాలపై అసంతృప్తితో ఉన్న జనాలు అన్నలకు అండగా నిలిచారు. యువకులు అడవుల బాట పట్టేందుకు ఉత్సాహం చూపారు. వందలు, వేలుగా వస్తున్న యువతరానికి దళాలుగా శిక్షణ ఇస్తూ భవిష్యత్ లక్ష్యాల దృష్ట్యా తెలంగాణ సరిహద్దులో ఉన్న బస్తర్ అడవులకు పీపుల్స్వార్ గ్రూపు పంపింది. జనతన సర్కార్ పేరుతో బస్తర్లో అన్నలు సమాంతర పాలన స్థాపించారు. దీంతో మావోయిస్టుల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆపరేషన్ గ్రీన్హంట్ను 2009లో కేంద్రం చేపట్టింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, డీఆర్జీ, కోబ్రా దళాలు నలువైపులా బస్తర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టులకు కొత్త స్థావరం అవసరమైంది.తెలంగాణ వైపు..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా వస్తే మావోయిస్టులు పాగా వేస్తారంటూ ఆం«ధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది. అందుకు తగినట్టుగానే తెలంగాణ వచ్చాక మావోయిస్టులు ఇటువైపు దృష్టి సారించారు. ఈ క్రమాన తొలి ఎన్కౌంటర్ భద్రాచలం సమీపాన ఛత్తీస్గఢ్ రాష్ట్ర పరిధిలో 2015 జూన్ 15న జరిగింది. ఆ తర్వాత అప్పటి వరంగల్ జిల్లా ములుగులో మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, బ్యానర్లు రావడం మొదలైంది. అనంతరం నిర్మాణ పనుల్లో ఉన్న భారీ యంత్రాలను మావోయిస్టులు తగలబెట్టారు. ముందుగా తమ ఉనికి చాటుకుని.. ఆ తర్వాత దాన్ని సుస్థిరం చేసుకునే యత్నంలో ఉండగా 2015 సెప్టెంబర్ 15న గోవిందరావుపేట మండలం రంగాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. దీంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలు నెమ్మదించాయి.పదేళ్లలో 98 మంది..తెలంగాణ వచ్చాక 2015లో జరిగిన రంగాపూర్ ఎన్కౌంటర్ మొదలు నిన్నమొన్నటి కరకగూడెం, ఏటూరునాగారం ఎన్కౌంటర్ల వరకు మొత్తం 98 మంది మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 44 సార్లు మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పట్టుమని ఆరు నెలలు కూడా దళాలు ఇక్కడ ఆయుధాలతో సంచరించే పరిస్థితి లేదు. పోలీసుల నిఘా పటిష్టంగా ఉండడం ఒక కారణమైతే.. ఏజెన్సీలు, అడవి సమీప గ్రామాల ప్రజల నుంచి గతంలో లభించిన స్థాయిలో మావోయిస్టులకు ఇప్పుడు మద్దతు దొరకడం లేదు. ఫలితంగా తెలంగాణలోకి చొచ్చుకుని వచ్చేందుకు ప్రయత్నించిన ప్రతీసారి మావోయిస్టులకు ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీనికి తోడు వారు కోవర్టుల పేరుతో సృష్టిస్తున్న రక్తపాతం మరింత చేటు తెచ్చింది. చివరకు మావోయిస్టులు తమ గ్రామాల వైపు రావొద్దంటూ ప్రజలు ర్యాలీలు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది.కాళేశ్వరం మీదుగా..కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు 2016లో మొదలైన తర్వాత రెండు రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగాయి. ఈ నేపథ్యాన ముందుగా మావోయిస్టు సానుభూతిపరులు, ఆ తర్వాత దళాలు మహదేవపూర్ అడవుల్లోకి రాకపోకలు సాగించడం మొదలైంది. అయితే, మహదేవపూర్ – ఏటూరునాగారం ఏరియా పరిధిలో పెద్దగా హింసాత్మక ఘటనలు మాత్రం చోటు చేసుకోలేదు. కానీ, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, సుక్మా జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో తరచూ కరపత్రాలు పంచడం, మందుపాతరలను అమర్చడం వంటివి చేస్తూ వచ్చారు. ఈ క్రమాన 2017 డిసెంబర్ 15న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు, ఆ తర్వాత 2020 సెప్టెంబర్లో చర్లలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మృతి చెందారు. -
ఛత్తీస్గఢ్లో ఆరుగురు మావోయిస్టులు మృతి
రాయ్పూర్/చర్ల: గత 24 గంటల్లో ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల ఘటనల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ జిల్లా కిరండోల్ పరిధిలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి డీఆర్జీ బలగాలు కూంబింగ్ జరుపుతుండగా తారసపడిన మావోలు కాల్పులకు దిగారు. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి చెందారు. బిజాపూర్ జిల్లా ఆవుపల్లి అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావో మృతి చెందాడు. సుక్మా జిల్లాలోని తాడ్మెట్ల–ముక్రంనల్లా గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఘటనలో ముగ్గురు మావోలు మృతి చెందారు. -
బస్తర్లో వీచిన సానుభూతి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఛత్తీస్గఢ్లో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ హవా సాగితే బస్తర్ డివిజన్లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఈ డివిజన్లోని మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ఎనిమిదింటిని కాంగ్రెస్ దక్కించుకోగా.. బీజేపీ నాలుగింటితో సరిపెట్టుకుంది. ఈ నాలుంటిలో ఒకటైన రాజ్నంద్గావ్ నియోజకవర్గంలో ప్రస్తుత సీఎం రమణ్సింగ్ 24,163 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఇక్కడ సానుభూతిని నమ్ముకొని కాంగ్రెస్ బరిలోకి దిగింది. దర్భాఘాట్లో జరిగిన మావోయిస్టుల ఘటనలో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్ భార్య అల్కా ముదలియార్ను రమణ్సింగ్పై పోటీకి దింపినా.. కాంగ్రెస్కు పరాభవం తప్పలేదు. గత ఏడాది మే 25న బస్తర్ డివిజన్లోని దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో కాంగ్రెస్ అగ్రనేతలతో సహా 27 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ నేతలైన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు, సల్వాజుడుం ముఖ్య నేత మహేంద్రకర్మ, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్ చనిపోయారు. ఈ డివిజన్లోని మొత్తం 12 నియోజకవర్గాలు ఎస్టీలకే రిజర్వ్ చేశారు. 2008 ఎన్నికల్లో బీజేపీ ఈ 12 నియోజకవర్గాలకుగాను 11 స్థానాల్లో గెలవగా.. ఈసారి సానుభూతి పవనాలు వీయడంతో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. కొంటా, దంతేవాడ, చిత్రకూట్, బస్తర్, కాంకేర్, భానుప్రతాప్పూర్, కేశ్కల్, కొండగావ్ నియోజకవర్గాల్లో బీజేపీని చిత్తుచేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దంతెవాడ ఘటనలో మృతి చెందిన సల్వాజుడుం నేత మహేంద్రకర్మ భార్య దేవతీకర్మ 5,987 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కొండగావ్ నియోజకవర్గాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర మంత్రి లతా ఊసెండి ఇక్కడ బరిలోకి దిగినా.. కాంగ్రెస్ అభ్యర్థి మోహన్లాల్ మరకం చేతిలో ఓటమి పాలయ్యారు. రమణ్సింగ్ సొంత జిల్లా రాజ్నందగావ్ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఆధిక్యత ప్రదర్శించింది. ఆరు నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో కాంగ్రెస్ నాలుగు స్థానాలు దక్కించుకోగా, బీజేపీ రెండింటికే పరిమితమైంది. -
ఛత్తీస్గఢ్లో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి పేట్రేగిపోయారు. బస్తర్ ప్రాంతంలోని సుకుమా జిల్లాలోని కేర్లపాల్ సమీపంలోని కల్వర్ట్ను మంగళవారం మావోయిస్టులు మందుపాతరతో పేల్చేశారు. ఆ ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అతడిని రాయ్పూర్ తరలించినట్లు చెప్పారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆ దుర్ఘటన చోటు చేసుకున్న ప్రాంతాల్లో పోలీసులు భద్రత సిబ్బంది సంయూక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్లో మొదటి దఫా ఎన్నికలు సోమవారం ముగిశాయి. ఆ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో విధులు ముగించుకుని వెళ్తున్న భద్రత దళాలకు చెందిన జవాన్లనే లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి అని ఊపిరి పీల్చుకుంటున్న అధికారులకు ఈ సంఘటనతో మళ్లీ తలనెప్పి మొదలైంది. రాష్ట్రంలో రెండవ మలి దశ ఎన్నికలు నవంబర్ 19న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పటిష్ట భద్రత చర్యలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.