cesarean cases
-
అమ్మకు.. 'కోతల' వేదన!
మంచి ముహూర్తానికే బిడ్డ పుట్టాలన్న గర్భిణి బంధువుల ఒత్తిడి.. వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రసవ నొప్పులు భరించలేకపోవడం.. కడుపుకోసి బిడ్డను తీసేస్తే పని అయిపోతుందిలే అన్న కొంతమంది వైద్యుల ధోరణి.. ప్రసవ కేసులతోనే కాసులు కూడబెట్టుకోవాలన్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల తీరుతో అమ్మ కడుపుపై కత్తిగాట్లు పడుతున్నాయి. సాధారణ ప్రసవాల స్థానంలో శస్త్ర చికిత్సలు అధికంగా జరుగుతున్నాయి. అమ్మను దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులుగా మార్చుతున్నాయి. జీవితాంతం వేదనకు గురిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లాలో అమ్మకు కడుపుకోత తప్పడం లేదు. కాన్పుకు వెళ్తే.. అవసరమున్నా, లేకున్నా సిజేరియన్ పేరుతో వైద్యులు ‘సుఖప్రసవం’ చేసేస్తున్నారు. దీంతో చిన్న వయస్సులోనే ‘అమ్మ’లు అనారోగ్యం బారిన పడుతున్నారు. కొద్దిరోజులుగా ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ అనే తేడాలేకుండా సాధారణ ప్రసవాలు చేయడమే మానేశారు. కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2023–24లో జిల్లాలో మొత్తం 10,417 ప్రసవాలు జరగ్గా.. ఇందులో 2,746 ప్రసవాలు శస్త్ర చికిత్సలు ద్వారా చేసినవే కావడం గమనార్హం. 2024–25లో 2,839 సిజేరియన్లు చేశారు. సిజేరియన్లకే ప్రాధాన్యం జిల్లాలో ఏటా సగటున 10 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ప్రభుత్వాస్పత్రులకు వచ్చిన వారిలో దాదాపు 60 శాతం వరకు గిరిజనులు, పేదలే ఉంటున్నారు. జిల్లాలో ప్రభుత్వాస్పత్రులు 44, ప్రైవేట్ ఆస్పత్రులు 20 వరకు ఉన్నాయి. దాదాపు అన్నిచోట్లా గర్భిణులకు ‘కడుపు కోత’లతో వేదన తప్పడం లేదు. అవసరం లేని సందర్భంలో సిజేరియన్లు చేయవద్దని పలు సందర్భాల్లో జిల్లా కలెక్టర్ చెబుతున్నప్పటికీ.. వైద్యుల తీరు మాత్రం మారడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో హైరిస్క్, ఆరోగ్య సమస్యల పేరుతో గర్భిణులను తరచూ పెద్దాస్పత్రులు, ప్రైవేట్ క్లినిక్లకు పంపుతున్నారు. అక్కడ శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు. చాలా పీహెచ్సీలు, సీహెచ్సీల్లో ప్రసవాలకు వెళ్తే.. పెద్దాస్పత్రులు వెళ్లాలని పంపించేస్తున్నారు. ఈ క్రమంలో అనేక సందర్భాల్లో 108 వాహనాల్లోనే మార్గమధ్యంలో ప్రసవాలు జరిగిపోతున్నాయి. గత మూడేళ్లలో 251 ప్రసవాలు 108 వాహనాల్లోనే కావడం గమనార్హం. మరోవైపు జిల్లా ఆస్పత్రికి గర్భిణుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 10 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. ప్రైవేటుకు వెళ్తే.. కాసుల బేరమే... జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పుకు వెళ్తే ప్యాకేజీ మాట్లాడుతున్నారు. రూ.వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. చాలా వరకు యాజమాన్యాలు గర్భిణులను సిజేరియన్లకు సంసిద్ధం చేస్తున్నాయి. ఉమ్మనీరు తక్కువ ఉందని, బిడ్డ అడ్డం తిరిగిందని.. తల్లీబిడ్డల ప్రాణానికి గ్యారంటీ ఇవ్వలేమని.. ఇలా ఏదో కారణం చెప్పి గర్భిణి కడుపు కోసి.. డెలివరీ చేస్తున్నారు. మరికొంత మంది గర్భిణులు ముహూర్తాలు, ఇతర కారణాలతో వారు కోరుకున్న సమయానికి సిజేరియన్తో డెలివరీ చేయించుకుంటున్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని చేస్తున్న ప్రకటనలు అక్కడి వరకే పరిమితమవుతున్నాయి. సంపాదనే లక్ష్యంగా గర్భిణుల ప్రాణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రులకు చెందిన కొందరు వైద్యులు అక్కడకు వచ్చిన గర్భిణులకు ఏదో కారణం చెప్పి.. తమ సొంత ఆస్పత్రుల్లో చేరేలా ప్రోత్సహిస్తుండడం గమనార్హం. (చదవండి: సుధామూర్తి హెల్త్ టిప్స్: అధిక కేలరీల ఆహారాన్ని నివారించాలంటే..?) -
ఎమర్జెన్సీలోనూ నార్మలే..! కడుపు కోతలకు చెక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాష్ట్రంలో సాధారణ కాన్పులపై దృష్టి సారించిన వైద్యారోగ్యశాఖ అధికారులు అత్యవసర సమయాల్లోనూ నార్మల్ డెలివరీ చేస్తూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. తల్లికో, బిడ్డకో ప్రాణహాని ఉంటే తప్ప సిజేరియన్ డెలివరీ చేయకూడదు. కానీ సిజేరియన్ డెలివరీతో ఎదురుకానున్న ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవడం, ముహూర్తాలు చూసుకుని ప్రసవాలు చేయడం వంటి కారణంగా చాలా మటుకు సిజేరియన్ డెలివరీకే మొగ్గు చూపుతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు వైద్యారోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గర్భిణులకు మొదటి వైద్య పరీక్షల నుంచి వారిలో సాధారణ ప్రసవాల ఆవశ్యకతపై ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర ఆరోగ్య సిబ్బంది వారిలో అవగాహన పెంచుతున్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలో ఇచ్చే తల్లిపాలు బిడ్డకు జీవితాంతం రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదం చేస్తుందన్న విషయంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ చర్యలు చాలా మట్టుకు ఫలితాలిస్తోంది. వారంపాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనూ వైద్యారోగ్యశాఖ ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. డెలివరీ తేదీలు దగ్గరలో ఉన్న గర్భిణులను ముందస్తుగా ప్రభుత్వాస్పత్రులకు, మాతాశిశు సంరక్షణ కేంద్రాలకు తరలించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని సర్కారు దవాఖానాలో గైనకాలజీ, మత్తు డాక్టర్లు లేనందున పూర్తిగా నార్మల్ డెలివరీలే జరుగుతున్నాయి. నార్మల్ డెలివరీ కావడం సంతోషంగా ఉంది నాలుగు రోజుల క్రితం నొప్పులు రావడంతో మా కుటుంబ సభ్యులు సిద్దిపేట గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పారు. ఒక రోజు అనంతరం నార్మల్ డెలివరీతో బాబు పుట్టాడు. సంతోషంగా ఉంది. నార్మల్ డెలివరీ గురించి రెండు నెలల క్రితం ఆస్పత్రికి వచ్చిన అప్పటి నుండే వైద్యులు, సిబ్బంది అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ కావడంతో రూ.30వేల నుంచి రూ.40 వేలు ఆదా అయ్యింది. కేసీఆర్ కిట్ కూడా ఇచ్చారు. – పద్మ, బాలింత, నర్మెట నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలో.. గర్భిణితో వ్యాయామం చేయిస్తున్న ఈ దృశ్యం నిర్మల్ ప్రభుత్వాస్పత్రిలోనిది. నార్మల్ డెలివరీ అయ్యేలా గర్భిణులకు ఇలా వ్యాయామంతోపాటు, కౌన్సెలింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో గర్భిణులకు సాధారణ ప్రసవాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. పడవలో వాగు దాటించారు పడవలో తీసుకొస్తున్న ఈ గర్భిణి పేరు మోర్రం పార్వతి. ములుగు జిల్లా రామచంద్రాపురం గ్రామం. గురువారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ట్రాక్టర్లో పాత్రపురం తీసుకొచ్చి అక్కడి నుంచి పడవలో వాగు దాటించారు. అక్కడి నుంచి 108 వాహనంలో వెంకటాపురం ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి అత్యవసర సమయంలోనూ వైద్యారోగ్యశాఖ అధికారులు ఆమెకు నార్మల్ డెలివరీ చేయగలిగారు. పార్వతికి పండంటి బాబు పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ముందుజాగ్రత్త చర్యగా.. భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బీమారం గ్రామానికి చెందిన శ్రావణి అనే గర్భిణిని ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యారోగ్యశాఖ సిబ్బంది మంచిర్యాలలోని మాతాశిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల క్రితం వైద్యులు ఆమెకు నార్మల్ డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. వైద్యుల సూచనల మేరకు మందులు వాడటంతో నార్మల్ డెలివరీ అయిందని శ్రావణి తెలిపింది. చదవండి: నూతన జోనల్ విధానం ఆధారంగా గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు -
కోసేయ్... కుట్టేయ్!
ఒకప్పుడు గర్భవతులకు ఇళ్ల వద్దే సుఖ ప్రసవాలు అయ్యేవి. ఇప్పుడు వైద్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. అయితే సుఖ ప్రసవాల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. సాధారణ కాన్పు చేయడం డాక్టర్లు కష్టంగా భావిస్తున్నారు. అదే తరహాలో కాసుల కోసం కక్కుర్తి పడి తల్లి కడుపునకు కోతలు పెడుతున్నారు. ఫలితంగా మాతాశిశు మరణాలు పెరిగిపోతున్నాయి. వీటి నివారణకు ప్రభుత్వం చేపట్టిన మార్పు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది. పలమనేరు, న్యూస్లైన్ : జిల్లాలో సాధారణ కాన్పులు నానాటికీ తగ్గిపోతున్నాయి. అదే స్థాయిలో సిజేరియన్లు పెరుగుతున్నాయి. ఫలితం గా తల్లీబిడ్డకు ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. జిల్లాలో 14 ఆరోగ్యశాఖ క్లస్టర్లు, వాటి పరిధిలో 95 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు జరగనప్పుడు పెద్దాస్పత్రులకు రెఫర్లు చేస్తారు. జిల్లాలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే 13 ఆస్పత్రులున్నాయి. ఇందులో శ్రీకాళహస్తి, పలమనేరు, కుప్పం, మదనపల్లెలో ఏరియా ఆస్పత్రులున్నాయి. ఇక్కడ అత్యవసర సమయాల్లో గర్భిణులకు సిజేరియన్లు చేసే సౌకర్యాలున్నాయి. ఈ ఆస్పత్రులకు నెలకు 1,560 వరకు డెలివరీ కేసులు రాగా అందులో సగం మందికి సిజేరియన్లే దిక్కుగా మారినట్టు రికార్డు లు చెబుతున్నాయి. కాసుల కోసం కత్తిరించేస్తున్నారు కాసుల కోసం కొందరు డాక్టర్లు సిజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. పలమనేరు వందపడకల ఆస్పత్రిలో ఏడాదిగా 40 మంది గర్భిణులను రెఫర్లు చేశారు. ఇందులో 25 మందికి ఆస్పత్రి బయట, మార్గ మధ్యంలో, 108 వాహనాల్లో సుఖప్రసవాలయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి జిల్లా మొత్తం మీదా ఉంది. ప్రభుత్వాస్పత్రులకు వెళ్లితే రెఫర్లు షురూ.. సంబంధిత ఏరియా ఆస్పత్రుల్లో పనిచేసే కొందరు డాక్టర్లకు సొంత నర్సింగ్ హోమ్లున్నాయి. ఒకవేళ లేకపోయినా రేఫర్ చేసిన నర్సింగ్ హోమ్ల నుంచి సంబంధిత డాక్టర్లకు కమీషన్లు ముడుతున్నట్టు సమాచారం. ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ కాన్పు అయ్యే పరిస్థితి కనిపించినా కాసుల కోసం రెఫర్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా తల్లి కడుపునకు కోతలు తప్పడం లేదు. పెరుగుతున్న మాతాశిశు మరణాలు సిజేరియన్ల కారణంగా జిల్లాలో మాతా శిశు మరణాల శాతం పెరుగుతోంది. ప్రస్తుతం శిశు మరణాలు 1000కి 46గా ఉంది. మాతృ మరణాలు 134గా నమోదైనట్టు సమాచారం. ఈ శా తాన్ని తగ్గించేందుకు మాతాశిశు సంక్షేమ శా ఖ చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ‘మార్పు’ లేదు ప్రభుత్వం మాతాశిశు మరణాలను తగ్గించాలని భావించింది. ఇందులో భాగంగా గత ఏడాది నవంబర్లో మార్పు (సోషియల్ బిహేవిరల్ చేంజ్ కమ్యూనికేషన్) కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తక్కువ బరువుతో జన్మించిన శిశువుల శాతాన్ని తగ్గించడం, గర్భవతుల్లో రక్త హీనత సమస్యను అధిగమించడం దీని లక్ష్యం. వైద్య, ఐకేపీ, ఐసీడీఎస్ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. గర్భిణికి పోషకాహార సేవలు, ప్రమాదకర పరిస్థితుల్లో రెఫర్లు, ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలు, నవజాత శిశువుల సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, తల్లీబిడ్డకు పోషకాహారం ఇందులో ముఖ్యమైనవి. అయితే ఇవేవీ క్షేత్ర స్థాయిలో అమలుకావడం లేదు. ముఖ్యంగా గర్భిణుల్లో రక్త హీనత ప్రధాన సమస్యగా మారింది. జిల్లాలో ‘మత్తు’ డాక్టర్లు లేరు వైద్య విధాన ఆస్పత్రులతో పాటు ఏరియా ఆస్పత్రుల్లో మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ల కొరత ఏర్పడింది. చిత్తూరు, మదనపల్లెలలో మినహా మరెక్కడా ఈ డాక్టర్లు లేరు. సర్జన్లే అన్నీ చేసుకోవాల్సి వస్తోంది. ఇక ఆస్పత్రుల్లోని బ్లండ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు లేవు. ఫలితంగా ప్రసవనొప్పులతో వచ్చే కేసులను రెఫర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలమనేరు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ వీణాకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. సిజేరియన్లు పెరగడం ఆందోళనకరమే సుఖప్రసవాలు తగ్గి సిజేరియన్లు పెరగడం ఆందోళన కలిగించే అంశమే. కొందరు డాక్టర్లు అనవసరంగా సిజేరియన్లు చేస్తున్నారు. ఈ సమస్య పలమనేరు, మదనపల్లె ఆస్పత్రుల్లో ఎక్కువగా ఉంది. ప్రైవేటు నర్సింగ్హోమ్లు, వాటితో ప్రభుత్వ డాక్టర్లకు లింకులు తదితరాలపై విచారణ జరుపుతాం. మార్పు కార్యక్రమం కాస్త వెనకబడ్డ మాట నిజమే. ఈ నెల రెండో వారం నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మళ్లీ ముమ్మరం చేస్తాం. - దశరథరామయ్య, డీఎంఅండ్హెచ్వో, చిత్తూరు