disruptive Constable
-
విప్లవాత్మక టెక్నాలజీల్లో ఫలితాలనిస్తున్న పెట్టుబడులు: ప్రేమ్జీ
బెంగళూరు: విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే టెక్నాలజీలపై ఆరంభంలో విప్రో చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ తెలిపారు. విప్రో వాటాదారుల 72వ వార్షిక సమావేశంలో ప్రేమ్జీ మాట్లాడారు. తమ క్లయింట్లను విజయవంతం చేసేందుకు వీలుగా, పరిశ్రమలో ముందుండేందుకు వీలుగా తమ సేవల్ని తీర్చిదిద్దుకుంటున్నట్టు చెప్పారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్:)విభాగంలో కంపెనీ వృద్ధి నెలకొనగా, ఇప్పుడు కన్జ్యూమర్ విభాగంలో పరీక్షించుకుంటున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారుతున్నట్టు చెప్పారు. 2017 ప్రారంభం నుంచి అంతర్జాతీయంగా చాలా వరకు పెద్ద ఆర్థిక వ్యవస్థలు మంచి పనితీరును చూపిస్తున్నాయని, టెక్నాలజీలో చోటు చేసుకుంటున్న అభివృద్ధి సమీకరణాలు అసాధారణ స్థాయికి చేరుతున్నాయని ప్రేమ్జీ వివరించారు. భారత్, అమెరికా, యూరోప్ దేశాలు, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. కంపెనీలు చురుగ్గా ఉంటూ టెక్నాలజీను స్వీకరిస్తూ తమను తాము మార్చుకోవాలని, మరీ ముఖ్యంగా తమ కస్టమర్ల అనుభవాన్ని మార్చే విధంగా ఉండాలని సూచించారు. -
మోసకారి కానిస్టేబుల్ అరెస్టు
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్లైన్ :ఇద్దరు యువతులను ప్రేమ పేరిట మోసగించి పెళ్లి చేసుకోవడమే కాకుండా.. ఓ యువతి తల్లిదండ్రులపై అట్రాసిటీ కేసు పెట్టించిన కానిస్టేబుల్ను సోమవారం అరెస్టు చేసి, విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు అర్బన్ జిల్లా ఎస్పీ బీవీ రమణకుమార్ తెలిపారు. స్థానిక నగరంపాలెం పోలీస్స్టేషన్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్రీవెన్స్ శిబిరంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.. మంగళగిరికి చెందిన ఎం.అశోక్ప్రభాకర్ 2011లో కానిస్టేబుల్గా విధుల్లో చేరాడు. రూరల్ జిల్లా నుంచి అటాచ్మెంట్లో అర్బన్ జిల్లా ఏఎన్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాడు. గుంటూరు నగరంలోని గాజులవారితోటకు చెందిన ఓ యువతిని ప్రేమించి గతేడాది జూలై 28న విజయవాడ దుర్గగుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి ఇంట్లోనే ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. ఈక్రమంలో సంగడిగుంటకు చెందిన మరో యువతితో ప్రేమాయణం నడిపాడు. ఆ యువతిని కూడా ఈ ఏడాది జూలై 27న విజయవాడలో వివాహం చేసుకుని మంగళగిరిలోని తన నివాసంలో కాపురం పెట్టాడు. ఈ విషయం ఆ యువతి తల్లిదండ్రులకు తెలిసి మంగళగిరి వెళ్లి కానిస్టేబుల్ అశోక్ప్రభాకర్ను నిలదీశారు. వారి పట్ల దురుసుగా వ్యవహరించడమేకాకుండా దుర్భాషలాడి పంపించివేశాడు. అంతటితో ఆగకుండా తనను కులం పేరుతో దూషించడంతోపాటు తనపై, తన తల్లిపై దాడికి పాల్పడ్డారంటూ వారిపై మంగళగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. తన తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించడమేకాకుండా, పెళ్లయిన నెలరోజులకే కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులకు దిగడంతో ఆమె సంగడిగుంటలోని పుట్టింటికి చేరింది. బాధితురాలు లాలాపేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అశోక్ప్రభాకర్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఉద్దేశపూర్వకంగా అట్రాసిటీ కేసు పెట్టినట్లు తేలింది. ఈ క్రమంలో ఈ విషయాలన్నీ తెలుసుకున్న మొదటి భార్య నగరంపాలెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. దీంతో అశోక్ప్రభాకర్ ఇద్దరు యువతులను వివాహం చేసుకుని మోసం చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు నిందితుడు అశోక్ప్రభాకర్ను అరెస్టుచేశారు. విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు అర్బన్ ఎస్పీ వెల్లడించారు. అశోక్ప్రభాకర్ తల్లి మేరిరోజమ్మ, బంధువులు అర్బన్ ఎస్పీని కలిసి సంగడిగుంటకు చెందిన యువతినే ప్రేమ వివాహం చేసుకున్నాడని, అంతకుముందు ఎలాంటి వివాహం జరగలేదని వివరించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే కేసు బనాయించారు.. రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోనే పోలీసులు తనపై అక్రమ కేసు బనాయించారని కానిస్టేబుల్ అశోక్ప్రభాకర్ విలేకరులకు తెలిపాడు. నిష్పక్షపాతంగా విచారించి న్యాయం చేయాలని ఎస్పీని కలిసి కోరాడు. కేసు దర్యాప్తులో ఉన్నందువల్ల తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని, వాస్తవాలకనుగుణంగానే చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు.