Employee separation process
-
మా మొర వినే ఆప్షనే లేదా?
సాక్షి, హైదరాబాద్: ఇలాంటి ఉదంతాలు ప్రతీ జిల్లాలో కోకొల్లలు. ఇలా అసంతృప్తి, ఆందోళనల మధ్య ఉద్యోగుల విభజన శరవేగంగా సాగిపోతోంది. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్ను గానీ, సీనియారిటీ వల్ల అన్యాయం జరుగుతోందన్న జూనియర్ల వాదనను గానీ ఎక్కడా పరిగణలోనికి తీసుకోలేదు. దీంతో ఎవరు ఎక్కడకు వెళ్తారో? ఎంతమంది స్థానికేతర జిల్లాలకు వెళ్తారో తెలియక ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఇప్పటికే విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లను పరిశీలించి, జిల్లా కేటాయింపు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మెదక్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో గురువారం నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నారు. దీంతో ఈ జిల్లా ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 13న ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి, ఆప్షన్ల పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అదే రోజు రాత్రి విభజనకు సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు. దీంతో ఉద్యోగులు స్థానికత, ఆప్షన్ల విషయంలో నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది. నకిలీల నాటకం.. దివ్యాంగుల ప్రాధాన్యతనూ కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. 75 శాతం వైకల్యం ఉంటే నిబంధనల ప్రకారం ఆప్షన్లలో రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ ఇష్టానుసారం తప్పుడు ధ్రువీకరణలు పెడుతున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు వచ్చాయి. భవిష్యత్లో ఇవన్నీ కోర్టు కేసుల వరకూ వెళ్లే వీలుందని, సమస్య మరింత జఠిలమవుతుందని పలువురు టీచర్లు చెప్పారు. హడావిడి విభజన వల్లే ఈ సమస్య తలెత్తుతోందని అంటున్నారు. సంతృప్తినివ్వని ఊరట! ఉద్యోగుల విభజనలో ఉపాధ్యాయులే ఎక్కువ. వారి నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ఉన్నతాధికారులు కొంత ఊరట కల్పించే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. విభజనలో జిల్లా మారకపోతే వీలైనంత వరకూ వాళ్లు పనిచేస్తున్న స్కూల్లోనే కొనసాగించేలా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు. సాధ్యాసాధ్యాలపై జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే, ఈ చిన్న ఊరట ఉపాధ్యాయ వర్గాలను ఏమాత్రం సంతృప్తి పర్చడం లేదు. ‘జిల్లాల్లో సీనియారిటీ జాబితా పెట్టామని అధికారులు చెబుతున్నారే గానీ దాన్ని ఎక్కడా డిస్ప్లే చేయలేదు. అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. నాకు మూర్ఛవ్యాధి ఉన్న సంతానం ఉందని, ఆప్షన్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరేందుకూ చాన్స్ లేకుండా పోయింది. సీనియారిటీలో వెనుకబడి ఉండటం వల్ల ఎక్కడేస్తారో అని గందరగోళంగా ఉంది.’– కార్తీక్, టీచర్, వరంగల్ జిల్లా ‘నాకు సీనియారిటీ లేకపోవడంతో కొత్తగూడెం జిల్లాలో వేస్తారేమో? ఆ జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో? కనీసం వంద కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సి వస్తుందేమో. నాకు వృద్ధ తల్లిదండ్రులున్నారు.. వాళ్లను అక్కడకు తీసుకెళ్లడం అదనపు భారమవుతుంది.’– వసంత్, టీచర్, ఖమ్మం జిల్లా నేను మేడ్చల్ జిల్లాలో పనిచేస్తున్నా.. అత్తమామలతో హైదరాబాద్లో ఉంటున్నా. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన నాకు దూరప్రాంతానికి బదిలీ తప్పదేమోనని భయంగా ఉంది. స్థానికతకు ప్రాధాన్యత నిస్తే, సమీపంలోనే ఏదో ఒక స్కూల్లో అవకాశం ఉంటుంది.’ – స్వరూప, టీచర్, మేడ్చల్ జిల్లా -
డీఈఓ కార్యాలయం, ఎస్ఎస్ఏ ఉద్యోగుల విభజన పూర్తి
విద్యారణ్యపురి : నూతన జిల్లాల పాలన దసరా నుంచే ప్రారంభం కానున్నందున జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. డీఈఓ కార్యాలయం, సర్వశిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులను కలిపి సీనియార్టీ ప్రాతిపదికన డీఈఓ రాజీవ్ కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా జిల్లాలకు కేటాయించారు. ఈనెల 6వతేదీ నుంచే పలువురు ఉద్యోగులు ఫైళ్లు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని శనివారం ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి డీఈఓ రాజీవ్ ఆదేశించారు. వరంగల్ జిల్లా డీఈఓ కార్యాలయానికి 23 మంది, హన్మకొండకు 17 మంది, మహబూబాబాద్కు 14మంది, భూపాలపల్లికి 13మంది ఉద్యోగులను కేటాయించారు. ఆన్లైన్లో ఫైళ్లు జిల్లా విద్యాశాఖలో ఆయా సెక్షన్లలో సుమారు 7వేల ఫైళ్ల ప్రాథమిక వివరాలను ఆన్లైన్లో సంబంధిత ఉన్నతాధికారుకులకు అందుబాటులో ఉంచారు. వాటిలో కరెంట్ ఫైళ్లు, డిస్పోజల్ ఫైళ్లుగా విభజించారు. ఆయా జిల్లాలకు సంబంధించిన ఫైళ్లు కూడా విభజించారు. అందులో 176 కామన్ ఫైళ్లుగా గుర్తించి నాలుగు జిల్లాలతోపాటు సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కలిసే మండలాలకు కూడా అందుబాటులో ఉంచారు. కామన్ ఫైళ్లను స్కాన్చేసి డీవీడీల్లో నింపి, జిరాక్స్లు ఆయా జిల్లాలకు పంపనున్నారు. ఒరిజినల్ ఫైళ్లు ప్రస్తుత డీఈఓ కార్యాలయంలో పెడతారు. ఈనెల 3 నుంచే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు తదితర సామగ్రిని విభజించి మిగతా మూడు జిల్లాలకు పంపుతారు. ఈనెల 6వతేదీ నుంచే కేటాయించిన ఉద్యోగుల్లో కొందరు ఆయా జిల్లాలకు ఫైళ్లను తీసుకెళ్లి అక్కడ కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ఈనెల 11న జిల్లా కార్యాలయాల విధులు ప్రారంభం కావాల్సి ఉంది. జిల్లాకు రూ.5లక్షలు నూతనంగా ఏర్పడే హన్మకొండ, జయశంకర్ జిల్లా (భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాల్లోని విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో మరమ్మతులు, ఇతర పనులకు రూ.5లక్షల చొప్పున కలెక్టర్ కేటాయించారు. దీంతో ఆయా పనులు ఇప్పటికే మొదలయ్యాయి. భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆర్ఎంఎస్ఏ గదుల్లోనే డీఈవో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అందులో మరమ్మతులు చేస్తున్నారు. మహబూబాబాద్లో ఎమ్మార్సీ భవనంలో మరమ్మతులు చేస్తున్నారు. హన్మకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంగా డీఈఓ కార్యాలయం పక్కనే ఉన్న సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు కార్యాలయానికి కేటాయించారు. ఇప్పటికే ఉన్న వరంగల్ డీఈవో కార్యాలయం యథావిధిగా వరంగల్ జిల్లా డీఈఓ కార్యాలయంగా కొనసాగనుంది. సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయం భవనం (హన్మకొండ జిల్లా డీఈవో కార్యాలయం)ను వరంగల్ డీఈవో కార్యాలయం ఒకే ఆవరణలో రెండు కార్యాలయాలు ఉండబోతున్నాయి. అయితే ఈ రెండింటికి మధ్య ప్రహరీ నిర్మించేందకు శనివారం సంబంధిత విద్యాశాఖాధికారులు ఉపక్రమించారు. ఈమేరకు పొక్లెయినర్తో కందకం తవ్వించారు. పునరాదిరాళ్లు కూడా తెప్పించారు. నాలుగు రోజుల్లో ఈ పను లు పూర్తి కానున్నాయి. ఒకే ఆవరణలో రెండు భవనాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటి మధ్య ప్రహరీ నిర్మిస్తున్నారు. కందకం తవ్వుతుండగా చూసిన వారు అనవసరంగా ప్రహరీ నిర్మిస్తున్నా రని అభిప్రాయపడుతున్నారు.