fedaralism
-
సమాఖ్య స్ఫూర్తికి తూట్లు
జాతీయ సమైక్యతకు, దేశాభివృద్ధికి కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ హక్కులు, నిధులు, అధికారాలకు సంబంధించి ఘర్షణాత్మక వైఖరి కొనసాగు తూనే ఉంది. కేంద్రం వద్ద అపారమైన ఆర్థిక వనరులు సమకూర్చుకొనే అవకాశాలు ఉండగా, రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేదు. పైగా కేంద్రం దొడ్డి దారిన రకరకాల సెస్సులు, సర్ చార్జీలను విధిస్తోంది. అందులో వాటాను మాత్రం రాష్ట్రాలకు పంచడం లేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమ న్వయం, సహకారం పెరిగేందుకు గతంలో ఏర్పడిన కమిషన్లు పలు కీలక సిఫార్సులు చేశాయి. అవి అమలునకు నోచుకోకపోవడంతోనే సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగింది..‘నేతిబీరలో నెయ్యి చందం దేశంలో సహ కార సమాఖ్య స్ఫూర్తి’ అని అన్నారు ఎన్.టి. రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో. రాష్ట్రాలకు అందించే నిధులు, హక్కులకు సంబంధించికేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వపు పోకడల పట్ల విసిగి పోయి తమ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రులు గతంలో చాలా మంది ఉన్నారు. జాతీయ సమైక్యతకు, దేశాభివృద్ధికి కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని భారత రాజ్యాంగంలోని 256–263 వరకు ఉన్న అధికరణలు నిర్దేశిస్తున్నాయి. అయినప్పటికీ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రు హయాం నుంచి నేటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలన వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ హక్కులు, నిధులు, అధికారాలకు సంబంధించి ఘర్షణాత్మక వైఖరి కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం, సహకారం పెరిగేందుకు గతంలో సర్కారియా కమిషన్, పూంఛ్ కమిషన్లు పలు కీలక సిఫార్సులు చేశాయి. కానీ, అవన్నీ అమలునకు నోచుకోకపోవడంతోనే... సహకారం కొరవడింది, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగింది.గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా నరేంద్ర మోదీ నాటి యూపీఏ ప్రభుత్వ కేంద్రీకృత విధానాలను విమర్శిస్తూ రాష్ట్రాల హక్కుల పరిరక్షణకై బలంగా గొంతెత్తిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అనుసరించిన మార్గంలోనే పయనిస్తూ, సమాఖ్య స్ఫూర్తికి భిన్నమైన నిర్ణయాలు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరీముఖ్యంగా దక్షిణ భారతం పట్ల మోదీ వివక్ష చూపిస్తున్నారన్న భావన ప్రజలలో క్రమేపీ బలపడుతోంది. ఇది ఎంత దూరం వరకు వెళ్లిందంటే దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం చూపే ఈ వివక్ష ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో దక్షిణ భారతాన్ని ఓ ప్రత్యేక దేశంగా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటుందని కర్ణాటకకు చెందిన కొందరు మంత్రులు ఇటీవల బాహాటంగా వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ప్రతి ఐదేళ్లకు కేంద్ర ప్రభుత్వ పన్నులు, ఇతర ఆదాయాల్లో విభజించ దగ్గ మొత్తాలను (డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్) పంచడానికి, భారత రాజ్యాంగంలోని అధికరణ 290 ప్రకారం, 1951 నుంచి ప్రతి ఐదేళ్లకోమారు ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తోంది. రాష్ట్రాల అర్థిక అవసరాలు తీర్చడానికి పన్ను ఆదాయాల్లో గణనీయమైన భాగం రాష్ట్రాలకు అందాలని ఆర్థిక సంఘాలు ఎప్పటికప్పుడు సిఫార్సులు చేస్తూ వచ్చాయి. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్ని 32 నుంచి 42 శాతానికి పెంచింది. 15వ ఆర్థిక సంఘం దాన్ని 41 శాతంకు కుదించి, 1 శాతం పన్నును కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన జమ్మూ, కశ్మీర్లకు బదలాయించాలని కేంద్రానికి సూచించింది. అయితే, పేరుకు 41 శాతంగా పైకి కనపడుతున్నప్పటికీ వాస్తవంగా 31 శాతం నిధులే అందుతున్నాయని బీజేపీయేతర రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.కేంద్రం వద్ద అపారమైన ఆర్థిక వనరులు సమకూర్చుకొనే అవకాశాలు ఉండగా, రాష్ట్రాలకు ఆ వెసులుబాటు లేదు. అయినప్ప టికీ కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఆదాయం పెంచుకొనేందుకు రక రకాల సెస్సులు, సర్ చార్జీలను విధిస్తోంది. వీటిద్వారా వచ్చే రాబడిని రాష్ట్రాలతో పంచుకోవడం లేదు. సర్చార్జీలు, సెస్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం పొందుతున్న మొత్తం పన్నుల వాటాలో 20 శాతం మేర ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఈ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక ఉగ్రవాదం అని పిలుస్తున్నాయి. అందువల్లనే ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ అరవింద్ పనగరియా అధ్యక్షతన ఏర్పడిన 16వ ఆర్థిక సంఘం... రాష్ట్రాలకు బదిలీ చేసే పన్నుల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలని బీజేపీయేతర ప్రభు త్వాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 11న కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ యేతర దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన అంశాలు, చేసిన డిమాండ్లను పరిశీలిస్తే కేంద్రంతో రాజీలేని పోరాటం చేయడానికి ఈ రాష్ట్రాలు సమాయత్తం అయినట్లుగా కనబడుతుంది. నిధుల కేటాయింపునకు కేంద్రం అనుస రిస్తున్న విధివిధానాల్లో శాస్త్రీయత లోపించిందన్నది నిర్వివాదాంశం. తక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువ నిధులు కేటాయిస్తు న్నది. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నది దక్షిణాది రాష్ట్రాలే. చారిత్రకంగా మొదట్నుంచీ దక్షిణాది రాష్ట్రాలు... ఉత్తరాది రాష్ట్రాలకంటే ఆర్థికంగానూ, ఇతరత్రా పలు అంశాల్లోనూ మెరుగ్గా ఉన్నాయి. దేశ విభజన పరిణామాలు ఉత్తరాది రాష్ట్రాల మీద ప్రతి కూల ఫలితాలు చూపాయి. మత, కులపర వైషమ్యాల కారణంగా కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో అభివృద్ధి అడుగంటింది. అదే సమయంలో పలు సామా జిక, సాంస్కృతిక ఉద్యమాల కారణంగా దక్షిణాదిలో విద్యకు ప్రాధాన్యం లభించింది. 1990 దశకంలో దేశంలో ప్రారంభమైన సంస్కరణల ఫలితాలను, ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్, ఫార్మా తదితర రంగాలలో వచ్చిన విప్లవాలను దక్షిణాది రాష్ట్రాలు సద్వినియోగపర్చుకొని ఆర్థికంగా ముందంజ వేశాయి. నిధుల కేటాయింపునకు మానవాభివృద్ధి సూచికల్లో రాష్ట్రాల పని తీరును, ప్రతిభను కొలమానంగా తీసుకోవాలని దక్షిణాది రాష్ట్రాలు గత రెండు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాయి.కాగా, వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికీ, వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పర్చడానికీ... ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగానైతే అధిక నిధుల్ని ఖర్చుచేస్తాయో... అదే నమూనాను జాతీయస్థాయిలో అమలు చేసి వెనుకబడిన రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించడంలో తప్పేముందని ఉత్తరాది రాష్ట్రాల ఆర్థికవేత్తలు వాదిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. వివిధ రాష్ట్రాలలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం... భారత కన్సాలిడేషన్ ఫండ్కు ఏటా జమ అవుతున్న లక్షల కోట్ల కార్పొరేట్ పన్నుల మొత్తం నుంచి ఖర్చు చేయవచ్చునన్న అభిప్రాయం వ్యక్తం అయింది.రాష్ట్రాలు తమ వాదనలను నీతి ఆయోగ్ సమావేశాలలోవిన్పించే అవకాశం ఉంది. కానీ, ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి, దానిస్ధానంలో ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ కేవలం కేంద్రానికి సలహా లిచ్చే ఓ సంఘంగానే మిగిలిపోయింది. ‘నీతి ఆయోగ్ సమావేశాలకు వెళ్లడం శుద్ధదండగ’ అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన 9వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని మమతా బెనర్జీతో సహా బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించడం గమనార్హం!ఇక, జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్వి భజించాలని కేంద్రం యోచిస్తున్న పూర్వరంగంలో దక్షిణాది రాష్ట్రా లకు తీరని నష్టం కలగడమేకాక... కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు పోషించే నిర్ణయాత్మక పాత్ర, వాటి పలుకుబడి గణనీయంగా తగ్గిపోతాయి. అదే జరిగితే ఎన్.టి. రామా రావు చెప్పినట్లు నేతిబీరలో నెయ్యి చందంగా సహకార సమాఖ్య వ్యవస్థ తయారవుతుంది. రాష్ట్రాల సూచనలను పట్టించుకోకుండా కేంద్రం ఒంటెత్తు పోకడలకు పోతే సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడటం తథ్యం!-డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు; కేంద్ర మాజీ మంత్రి -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర
భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగింది. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం! పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకించారు. ఇది అంబేడ్కర్ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే! భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే, ‘భారత రాజ్యాంగం అమలుకు ముందు, అటు తర్వాత’ అని చూడాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుషులంతా ఒక్కటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడివడి ఉన్నారు. కుల సమాజాన్ని సృష్టించి, పెంచి పోషించిన మనువాదం ఒక పరిపాలనాపత్రంగా, అదే శాసనంగా, అదే రాజ్యాంగంగా అమలు అవుతూ సమాజంలో అంత రాలను ఇంకా బలంగా వేళ్ళూనుకొనేలా చేసింది. అలాంటి సంద ర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రాజ్యాంగం ఒక్కటి చేయగలిగింది. అప్పటి వరకు కులాన్ని బట్టి విలువ ఉండేది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విలువను మనువాదం ప్రబోధించింది. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించి, కనీసం దానిలోనైనా ఒక సమానత్వ ప్రపంచాన్ని అందించింది. అందుకే భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. అయితే కొంతకాలంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగం గానే గతవారం కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’(సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకిక వాద) పదాలను తొలగించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానున్నది. ఇదే విషయమై, 2020 జూలైలో న్యాయవాది విష్ణు శంకర్ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీన్ని విచారించనున్నారు. సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించిన పీఠికలో లేవనీ, 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారనీ, రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు కూడా వీటిని వ్యతిరేకించారనీ ఈ పిటిషన్లో పేర్కొ న్నారు. పిటిషనర్గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఉటం కించినట్టు కనిపిస్తున్నది. అయితే, అంబేడ్కర్ మాటలను పరిశీలిస్తే సుబ్రహ్యణ్యస్వామియే అంబేడ్కర్ను తప్పుగా అర్థంచేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ రోజు సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘‘రాజ్యాం గాన్ని మనం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించు కోవాలి. భవిష్యత్లో ప్రజలు ఎటువంటి విధానాలను అవలంబించా లనుకుంటారో వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ ఇప్పుడే అన్ని విషయాలను ముగించకూడదు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని నాలుగవ భాగమైన ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సోషలిస్టు భావనలను సమర్థిస్తు్తన్నాయనే విషయాన్ని గుర్తుం చుకోవాలి’’ అంటూ రాజ్యాంగ సభకు కేటీ షా ప్రతిపాదించిన సవరణకు సమాధానమిచ్చారు. అంబేడ్కర్ ఎక్కడా, సోషలిస్టు భావనను వ్యతిరేకించింది లేదు. పైగా దాని సారాంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. సరిగ్గా ఇక్కడే అంబేడ్కర్ను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభలో మాట్లాడింది మాత్రమే సరిపోదు. ఒకరకంగా అది అప్పటి నాయకుల ఉమ్మడి అభిప్రాయం కూడా కావచ్చు. అయితే అంబేడ్కర్ మొదటినుంచీ సమానత్వ సమాజ స్థాపనకు పాటుపడిన వ్యక్తి. అంతేకాకుండా, రాజ్యాంగ సభలో తాను సభ్యుడిగా ఉంటానో లేదో నని భావించి, 1946లో రాజ్యాంగ సభకు ఒక మెమోరాండంను సమర్పించారు. దానినే ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అంటారు. అందులో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరించాలని, దానికి స్టేట్ సోషలిజం అనే మాటను కూడా ఆయన వాడారు. అందులో ఆర్థికపరమైన అంశాలను పేర్కొంటూ– దేశంలోని భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న భూములను జాతీయం చేయాలనీ ప్రతిపాదించారు. ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరచడానికి తన శాయశక్తులా కృషి చేశారు. అయినా సఫలం కాలేదు. అటువంటి సామాజిక మార్పును కోరుకుని, దాని కోసమే యావత్ జీవితాన్నే ప్రజలకు సమర్పించిన ఓ మహో న్నత వ్యక్తి వ్యాఖ్యలను తప్పుగా, తమ సోషలిస్టు వ్యతిరేక భావాలకు మద్దతుగా వాడుకోవడం విచారకరం. ఈ విషయం అట్లా ఉంచితే, 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ïపీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనే పదాలను మాత్రమే కాకుండా, ఇంకా చాలా విష యాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయాలను 43వ సవరణ ద్వారా తొలగించారు. అయితే రాజ్యాంగ పీఠికలోని ఆ రెండు పదాల జోలికి మాత్రం పోలేదు. ప్రస్తుత పిటిషనర్ సుబ్రహ్యణ్యస్వామి అప్పుడు జనతాపార్టీ లోక్సభ సభ్యుడిగా గెలిచారు. మరి అప్పుడు తన గొంతును ఎందుకు వినిపించలేదో ఆయనకే తెలియాలి. 2008లో ‘గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్’కు చెందిన సంజీవ్ అగర్వాల్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరించింది. ‘‘సోషలిజం అనగానే అదేదో కమ్యూనిస్టులకు సొంతమైనట్టు అను కోవడం సరైనది కాదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించింది. అందు వల్ల ఆ పదాలను తొలగించాల్సిన అవసరమే లేదని భారత అత్యు న్నత న్యాయస్థానం ఆనాడు కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుతం మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకుతెస్తున్నారనేది ప్రశ్న. దీనికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలు... సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ మతాలను, వాటికి సంబంధించిన సంస్థలను వేధిస్తుండడం ఎక్కువైందని అంత ర్జాతీయ సంస్థలు ఎన్నో నివేదికల ద్వారా వెల్లడించాయి. ఎవరైనా ఈ విషయాలన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేస్తారని ముందే ఊహించి, వాటిని తొలగిస్తే ఇక నైతికంగా కూడా తమకు ఎదురు ఉండదని భావించి అటువంటి పిటిషన్ను అధికార పార్టీ సభ్యుడే వేయడం జరిగి ఉండొచ్చనే అభిప్రాయానికి రావడవం తప్పేమీకాదు. అదే విధంగా భారత దేశంలో హిందూమతాన్ని అధికార మతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దానికి రాజ్యాంగాన్నే మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సా«ధువులు, సంతులు స్వయంగా ప్రకటించారు. అందుకనుగుణంగానే ఇప్పటికే ముప్ఫై పేజీల డాక్యుమెంటు రూపొందించినట్టు కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యం నుంచి ఈ పీఠికను చూడాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తిని బలపరచడమే కాకుండా నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతున్నాయి. సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయే తప్ప ఎటువంటి దుష్ప్రభావాన్నీ కలిగించడం లేదు. భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ సామాజిక ప్రగతికీ, మనుగడకూ ఒక తక్షణ అవసరంగా ఉంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి కుట్రలను భారత సమాజం సహించబోదని ఆశిద్దాం. (చదవండి: చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
దేశంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కడ!
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను హత్య చేయించినా చేయవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో నిజానిజాలు పక్కన పెడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్యస్ఫూర్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కేజ్రీవాల్తోనే మొదలు కాలేదు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీనే గుజరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సారి అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘నన్ను ఖతం చేయడానికి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి సుపారీ (కాంట్రాక్ట్) ఇచ్చింది’ అని మోదీ 2010లో వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలను వివిధ కేసుల్లో కేంద్రం ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల కేజ్రివాల్ అసహనం వ్యక్తంచేస్తూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ రాష్ర్ట ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలలాగా సంపూర్ణ అధికారాలు సంక్రమిస్తే తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లే అవకాశం లేదు. ఆ మాటకొస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమాఖ్య స్ఫూర్తి ఏనాడూ లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడూ తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కీలుబొమ్మ ముఖ్యమంత్రులనే పెట్టుకొంది. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా కొనసాగిన రోజుల్లోనూ ఇదే కొనసాగింది. స్వప్రయోజనాల కోసం ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నీరుగార్చేందుకే ప్రయత్నించింది. ‘కోఆపరేటివ్ ఫెడరలిజమ్ (సహకార సమాఖ్యవాదం)’ తమ ప్రభుత్వ విధానాల్లో ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు హర్షించారు. ఇప్పుడు వివిధ కేసుల్లో ఆప్ ఎమ్మెల్యేలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగమని అదే ప్రజలు భావిస్తున్నారు. మాటలు వల్లించడమే కాదు, చేతల్లో చూపించినప్పుడే ప్రజలు ప్రభుత్వాన్ని విశ్వసిస్తారు. --ఓ సెక్యులరిస్ట్ కామెంట్