gopi chand academy
-
బ్యాడ్మింటన్ మళ్లీ మొదలైంది...
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు కోర్టులోకి అడుగు పెట్టారు. కోవిడ్–19 నిబంధనలకు లోబడి ప్రాక్టీస్కు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇవ్వడంతో వారంతా మళ్లీ రాకెట్ పట్టారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పర్యవేక్షణలో గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం జట్టుకు ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం ఉన్న ఎనిమిది మందిని మాత్రమే ఈ క్యాంప్కు ‘సాయ్’ అనుమతించింది. వీరిలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు, సాయిప్రణీత్, డబుల్స్ స్పెషలిస్ట్ ఎన్.సిక్కిరెడ్డి మాత్రమే తొలి రోజు శిక్షణలో పాల్గొన్నారు. సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఇంకా ఆట మొదలు పెట్టలేదు. మరో వైపు బెంగళూరులో ఉన్న సిక్కి భాగస్వామి అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్ జోడి ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి కూడా సాధన షురూ చేయలేదు. చిరాగ్, సాత్విక్, శ్రీకాంత్ తమ స్వస్థలాలు ముంబై, అమలాపురం, గుంటూరులలోనే ఉన్నారు. కరోనా సమస్య లేకుండా సురక్షిత వాతావరణంలో ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ వెల్లడించారు. గోపీతో పాటు విదేశీ కోచ్లు పార్క్ టే సంగ్, ఆగస్ డ్వి సాంటోసో కూడా శిక్షణలో పాల్గొన్నారు. షట్లర్లకు కోవిడ్ పరీక్షలు... ఈ ఎనిమిది మంది ఆటగా ళ్లకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని ‘సాయ్’ ఆదేశించింది. వీరితో పాటు ఎనిమిది మంది కోచ్లు, ఇతర సహాయక సిబ్బంది ఎవరైనా కలిసి పని చేస్తుంటే వారంతా కూడా కోవిడ్ టెస్టులకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సోమవారం ఈ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. -
కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభం
సెంట్రల్ యూనివర్శిటీ, న్యూస్లైన్: దేశంలో మొదటిసారిగా కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్)కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శుక్రవారం ఈ టోర్నీ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్లో 68 కార్పొరేట్ సంస్థలకు చెందిన దాదాపు 400 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఈ క్రీడలను భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరగడం మంచి పరిణామమని అన్నారు. ఈ క్రీడలకు ఏర్పడిన క్రేజ్ కుర్రాళ్లకు స్ఫూర్తినిస్తుందన్నారు. సీబీఎల్కు దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు హాజరవ్వడం అభినందనీయమని ఆయన చెప్పారు. సీబీఎల్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో టెక్ మహేంద్ర ఉపాధ్యక్షులు రాజేంద్ర తునుగుంట్ల, లొకేషన్ కౌన్సిల్ హెడ్ బీకే మిశ్రా, హెచ్సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్లతో పాటు స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పీవీ సింధు, కశ్యప్ పాల్గొన్నారు. దేశంలోని ప్రముఖ కార్పొరేట్ కంపెనీలైన టీసీఎస్, క్వాల్కామ్, వెల్స్ఫార్గో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, విప్రో, ఐబీఎం, హెచ్ఎస్బీసీ, డెలాయిట్, మైక్రోసాఫ్ట్, అసెంచర్, జీఈ తదితర జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. -
మహిళల సింగిల్స్ లో సైనా,సింధు
ఇన్నాళ్లూ గోపీచంద్ అకాడమీలో కలిసి ప్రాక్టీస్ చేసిన సైనా నెహ్వాల్, పి.వి.సింధు తొలిసారి ముఖాముఖిగా పోరాడనున్నారు. ఐబీఎల్లో గురువారం ఈ దృశ్యం కనిపించనుంది. మహిళల సింగిల్స్ ఏకైక మ్యాచ్లో హైదరాబాద్ హాట్షాట్స్ తరఫున సైనా... అవధ్ వారియర్స్ నుంచి సింధు బరిలోకి దిగనున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో కాంస్యం నెగ్గి సింధు జోరు మీద ఉండగా... వరుసగా నాలుగోసారీ ప్రపంచ చాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా ఒత్తిడిలో ఉంది. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితానికి అధికారిక గుర్తింపు లేకపోయినా...టోర్నీకి హైలైట్ కావచ్చు. ఐబీఎల్లో నేడు హైదరాబాద్ హాట్షాట్స్ x అవధ్ వారియర్స్ సాయంత్రం గం. 4.00 నుంచి ముంబై మాస్టర్స్ x బంగా బీట్స్ రాత్రి గం. 8.00 నుంచి ఈఎస్పీఎన్లో ప్రత్యక్ష ప్రసారం