Government sites
-
ఇల్లు కట్టుకోకపోతే స్థలం రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి కూటమి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాన్ని మహిళల పేరుతో మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్న చోట్ల మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేనిచోట ఏపీ టిడ్కో సహా, ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇళ్లు కేటాయించాలని సూచించింది. ఈ పట్టాలపై పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు దక్కేలా కన్వేయన్స్ డీడ్స్ ఇస్తామని తెలిపింది. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇళ్ల స్థలం ఇవ్వాలని, కేటాయించిన రెండేళ్ల లోపు ఇల్లు కట్టుకోవాలని, ఆధార్ కార్డుతో పట్టాను లింకు చేయాలని స్పష్టం చేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న బీపీఎల్ లబ్ధిదారులు, రాష్ట్రంలో ఎక్కడా సొంత ఇల్లు లేదా స్థలం లేనివారు, గతంలో ఏ ప్రభుత్వ హౌసింగ్ స్కీం కిందకు రాని వారు, ఐదు ఎకరాలకు మించి మెట్ట వ్యవసాయ భూమి, 2.5 ఎకరాలకు మించి మాగాణి వ్యవసాయ భూమి, లేదా రెండు కలిపి 5 ఎకరాలకు మించని వ్యవసాయ భూమి లేని కుటుంబాలు ఇళ్ల స్థలాలకు అర్హులని స్పష్టం చేసింది. గతంలో ఇళ్ల పట్టా పొంది కోర్టు కేసుల వల్ల ఇల్లు పొందని వారికి దాన్ని రద్దు చేసి కొత్తగా పట్టా ఇవ్వవచ్చని పేర్కొంది. గతంలో ఇళ్ల పట్టా పొంది అక్కడ ఇల్లు కట్టుకోని వారికి పట్టాలు రద్దు చేసి తిరిగి మరొక చోట ఇవ్వాలని సూచించింది. ఇళ్ల స్థలాల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరించాలని, వాటిని వీఆర్వో, ఆర్ఐలు అర్హతలకు అనుగుణంగా విచారణ జరిపి జాబితాను తయారు చేసి అక్కడ అంటించాలని సూచించింది. లబి్ధదారుల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితాలకు తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా జిల్లా కలెక్టర్ల ఆమోదం తీసుకోవాలని పేర్కొంది. ఇళ్ల స్థలాలకు అవసరమైన భూముల్ని జిల్లా కలెక్టర్లు గుర్తించాలని స్పష్టం చేసింది. -
కబ్జాదారుల ఆటకట్టేనా?
కోరుట్ల : సర్కారు స్థలాలకు రక్షణ కరువైంది మహా ప్రభో.. అంటూ వందలాది ఫిర్యాదులు అంది నా ఇన్నాళ్లు స్పందించని రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా జూలు విదిల్చారు. ప్రభుత్వ స్థలాలను కాపాడటానికి స్పెషల్డ్రైవ్ చేపట్టారు. ఈ వ్యవహారం చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందాన్ని తలపిస్తోంది. ఇప్పటికే పట్టణంలో చాలాచోట్ల సర్కారు స్థలాలు కబ్జాదారుల కబంధహస్తాల్లోకి చేరిపోయాయి. ఈ ఆక్రమణలకు తెరదించి ప్రభుత్వ స్థలాలను కాపాడితే మున్ముందు ప్రజావసరాల కోసం వాడుకునేందుకు వినియోగించుకోవచ్చన్న స్పృహాప్రజాప్రతినిధులతోపాటు అధికార యం త్రాంగానికి రావడం ఆశించదగ్గ పరిణామం. జిల్లాలో రెండో స్థానం ప్రభుత్వ స్థలాలు అధికంగా ఉన్న మండలాల్లో కరీంనగర్ మినహాయిస్తే.. తిమ్మాపూర్ తర్వాత కోరుట్ల రెండోస్థానంలో ఉంది. పట్టణ పరిసరాల్లో పరంపోగు, కారీజుఖాతా, బంచరాయి కింద సుమారు 153 సర్వే నంబర్లలో దాదాపు 1,044 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ప్రస్తుతం ఈ స్థలాల్లో సుమారు 690 ఎకరాలు వివిధ సామాజిక అవసరాలతో పాటు వ్యక్తిగత అవసరాల కోసం అసైన్ చేసినట్లుగా రెవెన్యూ రికార్డులు చెబుతున్నా..వీటిలో చాలామేర ఆక్రమణకు గురయ్యాయి. మరో 350 ఎకరాల ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నాయి. కోరుట్లలో భూములకు డిమాండ్ పెరగడంతో కొందరు రియల్ వ్యాపారులు ఈ స్థలాలపైనా కన్నేశారు. ఇప్పటికే 1553, 1215,1497, 454, 478, 923 సర్వే నంబర్లతో పాటు కోరుట్ల వాగు కింది స్థలాల్లో చాలాచోట్ల ఆక్రమణలకు గురువుతున్నాయి. రానున్న కాలంలో ఇదేతీరు కొనసాగితే.. డివిజన్ కేంద్రంగా మారే అవకాశాలు పుష్కలంగా కోరుట్లలో ప్రభుత్వ స్థలాల కోసం దేవులాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కలెక్టర్, జగిత్యాల సబ్ కలెక్టర్ లతో మాట్లాడి ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు స్పెషల్డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. సర్వేకు ఇతర మండలాల అధికారులు ప్రభుత్వ స్థలాల సర్వేకు స్థానిక అధికారులు ఉపక్రమిస్తే నేతల నుంచి ఒత్తిళ్లు వచ్చే అవకాశాలు ఉండటంతో ఇతర మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులతో సర్వేకు శ్రీకారం చుట్టారు. ఈ సర్వే బృందం జగిత్యాల సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో కోరుట్ల తహశీల్దార్ అధ్వర్యంలో కొనసాగుతోంది. సర్వే కోసం ప్రత్యేకంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు సర్వేయర్లను నియమించనున్నారు. సర్వేయర్లు ప్రభుత్వ స్థలాలను సర్వే చేసి గుర్తించిన అనంతరం వాటికి హద్దులను నిర్ణయించి అక్రమణలను నిరోధిస్తారు. అవసరమైతే కొన్ని స్థలాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్న యోచనలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. ఆక్రమణలకు గురైన చోట కబ్జాదారులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ స్పెషల్డ్రైవ్ విషయంలో నేతలు.. అధికారులు తరతమ భేదాలు మాని పారదర్శకంగా వ్యవహారిస్తే ఎంతో మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.