hostal
-
TSPSC HWO : తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్ (TSPSC Hostel Welfare Officer) ఫలితాలు విడులయ్యాయి. కొద్ది సేపటి క్రితమే టీఎస్పీఎస్సీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ను విడుదల చేసింది. 581 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్ఈ పరీక్ష నిర్వహించింది. 581 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్, 2024 జూన్లో రాత పరీక్ష నిర్వహించింది. ఇప్పటికే జీఆర్ఎల్ విడుదల చేసి నాలుగు విడుతల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తిచేసింది. ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో ఉద్యోగాలు పొందినవారికి శాఖల వారీగా కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్లు ఇస్తారు -
సీఎంఆర్ కాలేజీ ఘటనలో కీలక పరిణామం
సాక్షి,హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు లభ్యమైన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎంఆర్ కాలేజీ గాల్ట్స్ హాస్టల్ ఘటనపై విచారణకు మహిళా కమిషన్ సెక్రెటరీ ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతికి సూచించారు.ఈ సందర్భంగా , రాష్ట్ర ఉమెన్ కమిషన్ మెంబర్ పద్మజా రమణ మాట్లాడుతూ.. సీఎంఆర్ గర్ల్స్ కాలేజీలో జరిగిన ఘటనపై స్టూడెంట్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేశాం. పూర్తి వివరాలు ఉమెన్ కమిషన్ చైర్మన్కి అందిస్తాం. ఉమెన్ కమిషన్ చైర్మన్ సుమోటాగా కేసు తీసుకున్నారు. అటు సీఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్కి నోటీసులు ఇచ్చాం. స్టూడెంట్స్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏం జరిగిందో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా తేడా జరిగితే సీఎంఆర్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యంపై సీరియస్ యాక్షన్ ఉంటుంది’ అని హెచ్చరించారు. బాత్రూమ్లో లభ్యమైన కెమెరాలపై విద్యార్థినుల చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో తాముండగా.. అగంతకులు హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా బాత్రూమ్లలో మూడు చోట్ల కెమెరాలను గుర్తించినట్లు విద్యార్థునులు స్పష్టం చేశారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన స్మార్ట్ ఫోన్లలో ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు. అయితే, ఈ తరుణంలో గురువారం సాయంత్రం సీఎంఆర్ కాలేజీ హాస్టల్ను మహిళా కమిషన్ తనిఖీ చేసింది. అనంతరం, సీఏంఆర్ కాలేజి హాస్టల్లో జరిగిన నిజానిజాలను తేల్చాలని సైబారాబాద్ సీపీ అవినాష్ మహంతికి సూచించింది. 👉చదవండి : సీక్రెట్ కెమెరాలపై విద్యార్థినుల ఆందోళన -
‘కాస్మొటిక్’ వెతలు!
ఆదిలాబాద్రూరల్: అమ్మానాన్నలకు దూరంగా ఉండి.. చదువే లక్ష్యంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు. ప్రభుత్వం హాస్టళ్లలో వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొనడం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్రభుత్వం విద్యార్థులకు సరిపడా కాస్మొటిక్ చార్జీలు చెల్లించకపోవడంతో ఆయా వసతిగృహ విద్యార్థులు విద్యపై దృష్టి సారించలేకపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలేవి..! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నా ఆచరణలో అవి కనిపించడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆయా వసతిగృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులకు గురై చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఖర్చులకు సరిపడా చార్జీలు అందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినెలా వాటిని కొనుగోలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కొంతమంది తల్లిదండ్రులు పిల్లల జీవితాలు చదువుతోనే బాగుపడుతాయని భావించి ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. అక్కడ విద్యార్థుల ఖర్చులకు నెలనెలా డబ్బులు పంపించాల్సి వస్తుండడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాస్మొటిక్ చార్జీలు ఇలా.. జిల్లాలో ఎస్సీ బాలుర 19 వసతి గృహాలు ఉండగా, ఇందులో 821 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బీసీ ప్రీమెట్రిక్ 9 వసతిగృహాలు ఉండగా 573 మంది చదువుతున్నారు. గిరిజన వసతి గృహాలు 38 ఉండగా ఇందులో 10,621 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలురకు కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.62 చెల్లిస్తున్నారు. ఆయా వసతి గృహాల్లో చదువుతున్న బాలుర విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీల కింద ప్రభుత్వం నెలకు రూ.62 అందజేస్తుంది. ఇందులో విద్యార్థి రూ.50 తో సబ్బులు, నూనెలు, టూత్పేస్ట్, పౌడర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు హెయిర్ కటింగ్కు రూ.12 చెల్లిస్తుంది. ఎస్సీ, బీసీ వసతిగృహాల కాస్మొటిక్ చార్జీలను నేరుగా విద్యార్థులకు అందజేస్తారు. కాగా ఐటీడీఏ పరిధిలోని వసతి గృహాల విద్యార్థులకు సంబంధించి కాస్మొటిక్ చార్జీలను టెండర్ ద్వారా అందజేస్తారు. కటింగ్ చార్జీలకు సంబంధించిన సొమ్మును సంబంధిత వసతిగృహ ప్రధానోపాధ్యాయుడి ఖాతాలో జమ చేస్తారు. అయితే ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలతో నాయీ బ్రాహ్మణులు హెయిర్ కటింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా లేకపోవడం, బయట మార్కెట్లో హెయిర్ కటింగ్కు ఒక విద్యార్థికి రూ.40 నుంచి రూ.50 తీసుకుంటుండడంతో ఇవి ఎటూ సరిపోవడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఆయా వసతి గృహ నిర్వాహకులకు తెలియజేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ వసతిగృహ విద్యార్థులు ఒకరికొకరు క్షవరం (హెయిర్ కటింగ్) చేసుకోవడం సంచలనం కలిగించింది. లోపిస్తున్న నాణ్యత.. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తున్న కాస్మొటిక్లలో నాణ్యత లోపిస్తోందనే విమర్శలున్నాయి. కాంట్రాక్టు దక్కించుకునే సమయంలో నాణ్యతగల వస్తువులను చూపించిన కాంట్రాక్టర్లు తీరా నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాస్మొటిక్ కిట్ మాదిరిగా పంపిణీ చేయాలి.. వసతి గృహాల్లోని విద్యార్థులకు కేసీఆర్ కిట్ అందిస్తున్న విధంగానే బాలుర వసతిగృహ విద్యార్థులకు సైతం కిట్లాగా అందజేస్తే బాగుంటుంది. ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలు విద్యార్థులకు సరిపోవడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించాలి. – శివకుమార్, హెచ్డబ్ల్యూవో, బీసీ హాస్టల్, ఆదిలాబాద్ చార్జీలు సరిపోవడంలేదు ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న కాస్మొటిక్ చార్జీలు రూ.62 సరిపోవడంలేదు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలి. హెయిర్ కటింగ్ కోసం ప్రభుత్వం రూ.12 మాత్రమే చెల్లిస్తుంది. కటింగ్ కోసం బయట రూ.40 నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా భారమవుతోంది. – సాయికృష్ణ, బీసీ హాస్టల్ విద్యార్థి, ఆదిలాబాద్ ప్రతిపాదనలు పంపించాం ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం కాస్మొటిక్ చా ర్జీల కింద ఒక్కొక్కరికి నెలకు రూ.62 అందజేస్తున్నాం. ఇందులో హెయిర్ కటింగ్ కోసం రూ.12, మిగితా రూ.50తో సబ్బులు, పౌడర్, నూనె కొనుగోలు చేసేందుకు అం దిస్తుంది. విద్యార్థినులకు కాస్మొటిక్ కిట్లు అందజేస్తున్నట్లుగా బాలురకు కూడా అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి -
ట్యూటర్లెక్కడ?
కరీంనగర్ సిటీ : రెగ్యులర్ విద్యార్థులకు దీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో హాస్టళ్లలో నియమించాల్సిన ట్యూటర్ల జాడ జిల్లాలో లేకుండాపోయింది. విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ఏ హాస్టల్లో ట్యూటర్ను నియమించిన దాఖలాలు లేవు. జిల్లాలో 53 బీసీ, 93 ఎస్సీ, 22 ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో 15 వేల మంది విద్యార్థులు ఉంటున్నారు. ఏడో తరగతి, పదో తరగతి విద్యార్థులకు సాధారణ బోధనతో పాటు అదనంగా నాణ్యతతోకూడిన ఉత్తమ బోధన అందించేందుకు ప్రభుత్వం ట్యూటర్ల వ్యవస్థ ప్రవేశపెట్టింది. ఈ రెండు తరగతుల విద్యార్థులను బోర్డు పరీక్షలకు సన్నద్ధం చేయడం, మెరుగైన ఫలితాలు రాబట్టడంలో ట్యూటర్ల పాత్ర కీలకం. ట్యూటర్గా ఉండడానికి కనీస విద్యార్హత డిగ్రీ కాగా, బీఈడీ ఉన్న వారికి ప్రాధాన్యతనిస్తారు. సబ్జెక్ట్కు ఒకరు చొప్పున మ్యాథ్స్, ఇంగ్లిష్, సైన్స్ సబ్జెక్ట్లకు ముగ్గురు ట్యూటర్లను ప్రతీ హాస్టల్కు నియమిస్తారు. హాస్టల్కు ముగ్గురు చొప్పున జిల్లా వ్యాప్తంగా 504 మంది ట్యూటర్లను నియమించాల్సి ఉంది. విద్యాసంవత్సరం ఆరంభంలోనే వీరిని నియమించడం లేదా కొనసాగించడం చే యాలి. కానీ, ఇప్పటివరకు నియమించకపోవడంతో హాస్టల్ విద్యార్థులు చదువుల్లో వెనకబడిపోతున్నారు. వేతనంతోనే సమస్య హాస్టళ్లలో ట్యూటర్ల నియామకానికి వారి వేతనమే అడ్డుగా నిలుస్తోందని సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతీ రోజు సాయంత్రం గంట పాటు బోధన చేసే ఈ ట్యూటర్లకు ప్రభుత్వం నెలకు కేవలం రూ.500 మాత్రమే చెల్లిస్తోంది. దీంతో హాస్టళ్లలో బోధించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సంక్షేమాధికారులు వాపోతున్నారు. గ్రామాల్లో ట్యూటర్ల సమస్య లేకున్నా... పట్టణాల్లో మాత్రం ఎవరూ ఆసక్తి కనపరచడం లేదు. పైవేట్ విద్యాసంస్థలు కోకొల్లలుగా ఉన్న పట్టణాల్లో రూ.500 వేతనంతో ట్యూటర్లుగా హాస్టళ్లలో పనిచేయడానికి ఎవరూ ప్రాధాన్యతనివ్వడం లేదు. వేతనం పెంచితే ఎవరైనా ముందుకు వచ్చే అవకాశముందని వార్డెన్లంటున్నారు. మొత్తానికి విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ట్యూటర్ల ఊసే లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, సంక్షేమశాఖ అధికారులు వెంటనే ట్యూటర్ల సమస్యకు పరిష్కారం చూపిస్తేనే హాస్టల్ విద్యార్థుల నూటికి నూరుశాతం ఫలితాల లక్ష్యం నెరవేరుతుంది.