krishnappa
-
‘పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో క్రిమినల్ గ్యాంగ్స్’
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్లను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంత్రి పరిటాల సునీతను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. టీడీపీ నేతల గూండాగిరికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్న కేసుల్లో సరైన విచారణ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. వారిపై ఆలస్యంగా ఛార్జిషీట్లు నమోదు చేసి శిక్షలు పడకుండా పోలీసులు సహకరిస్తున్నారని కృష్ణప్ప ధ్వజమెత్తారు. చదవండి : పరిటాల అనుచరుల రౌడీరాజ్యం -
వైఎస్ఆర్ సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కృష్ణప్ప
-
ఖాద్రీశుని దర్శించుకున్న కర్ణాటక మంత్రి
కదిరి : కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామంత్రి క్రిష్ణప్ప దంపతులు ఆదివారం తమ ఇలవేల్పు అయిన కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులను ఎండవేడిమి నుండి కాపాడేందుకు ఆలయ ప్రాంగణం మొత్తం షెడ్లు వేయించేందుకు అయ్యే ఖర్చు తాను భరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి, పాలకమండలి సభ్యులు ఇద్దే రఘునాథరెడ్డి, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కృష్ణప్ప ఎంపిక
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ మంత్రి ఏ. కృష్ణప్ప ఎంపికయ్యారు. నగరంలోని ఓ హోటల్లో జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలో బుధవారం పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. అనంతరం కృష్ణప్పను అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు ప్రకటించింది. నగరంలోని కేఆర్ పురం నియోజక వర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన కృష్ణప్ప 1999-2004 కాలంలో ఎస్ఎం. కృష్ణ హయాంలో సాంఘిక సంక్షేమ, పశు సంవర్ధక శాఖలను నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతో చిర కాల అనుబంధం కలిగిన ఆయనకు గత శాసన సభ ఎన్నికల సందర్భంగా పార్టీ టికెట్ను నిరాకరించడంతో జేడీఎస్లో చేరారు. ఆయన సామాజిక వర్గమైన యాదవులు అధిక సంఖ్యలో ఉన్న చిత్రదుర్గ జిల్లా హిరియూరు నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం వరించలేదు. మొన్నటి దాకా జేడీఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కుమారస్వామి వ్యవహరించారు. శాసన సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయనే. ఈ నేపథ్యంలో బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్సభ స్థానాలకు గత నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో జేడీఎస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. వాస్తవానికి ఆ రెండు స్థానాలు జేడీఎస్వే. కుమారస్వామితో పాటు మాజీ మంత్రి చలువరాయ స్వామి రాజీనామాలతో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల్లో ఓటమి అనంతరం కుమారస్వామి రెండు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జేడీఎల్పీ నాయకుడిగా కొనసాగాలని ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులు పట్టుబట్టడంతో సరేనన్నారు. కాగా కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నాయకులు ఎంసీ. నాణయ్య, బండెప్ప కాశంపూర్ ఇక్బాల్ అన్సారీ, మధు బంగారప్ప ప్రభృతులు పాల్గొన్నారు.