muduchintalapalli village
-
సీఎం దత్తత గ్రామాల్లో పెండింగ్ పనులు
సాక్షి, మేడ్చల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ముచ్చటగా మూడోసారి మూడు చింతలపల్లి (ఎంసీపల్లి) మండల కేంద్రంలో పర్యటించి వెళ్లిన తర్వాత.. ఆ మండలంలో పెండింగ్లో ఉన్న సమస్యలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎంసీపల్లిపై రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నందునే జిల్లా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చినట్లు తెలుస్తోంది. ‘ధరణి’ పోర్టల్ ప్రారంభోత్సవంలో భాగంగా గురువారం ఎంసీపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి మూడోసారి ఈ మండలంలో పర్యటించారు. గతంలో 2017 ఆగస్టులోనూ రెండు సార్లు పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతోపాటు ఎస్డీఎఫ్ నుంచి నిధులు కేటాయించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పక్కనే ఉన్నందున సమీప గ్రామాల అభివృద్ధిపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అధికారయంత్రాంగం ఎంసీపల్లి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పెండింగ్ పనులు వేగవంతం 2017లో మూడు చింతలపల్లి మండలంలో పర్యటించిన ముఖ్యమంత్రి ఐదు గ్రామాల పరిధిలో 117 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమేగాక, సీడీఎఎఫ్ నుంచి రూ.66 కోట్లు మంజూరు చేయించారు. అయితే మూడేళ్లు గడచినా పనులు 20 శాతం కూడా పూర్తి కాలేదు. దీనిపై సీఎంకు సమాచారం అందడంతో పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎంసీపల్లి పర్యటన సందర్భంగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పెండింగ్ పనులపై దృష్టి సారించింది. కేశవరంలో నిర్మాణంలో ఉన్న మల్టీ పర్పస్ ఫంక్షన్హాల్ అభివృద్ధి పనులివీ.. ఎంసీపల్లి మండల పరిధిలోని కేశవరం, లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, నాగిశెట్టి పల్లి, లింగాపూర్ తండాలో 117 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు దాదాపు రూ.66 కోట్లు నిధులు మంజూరు చేశారు. అదే పర్యటనలో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మిగిలిన పనులకు నెల రోజుల వ్యవధిలోనే అప్పటి రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, మహేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులను ఆర్అండ్బీ, ఇరిగేషన్, పీఆర్, విద్య, విద్యుత్, వ్యవసాయ శాఖలు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. పనుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినా పురోగతి కనిపించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లలో 78 కార్యక్రమాలకు సంబంధించి 80 పనులు శాతం పూర్తికాగా, మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. మూడు చింతలపల్లి, లక్ష్మాపూర్ల్లో చేపట్టిన 200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు పునాది దశలో ఉండగా, కేశవరంలో 100 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. నిధుల మంజూరు ఇలా.. కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు, అభివృద్ధి పనులకు సీఎంఓ ప్రత్యేక అభివృద్ధి ఫండ్స్ కింద రూ.27.76 కోట్లు విడుదల చేశారు. ఇందులో కేశవరం గ్రామానికి రూ. 12.26 కోట్లు కాగా, లక్ష్మాపూర్ గ్రామానికి 15.50 కోట్లు మంజూరు చేశారు. మూడు చింతలపల్లి గ్రామస్తులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి నిర్వహించి, పంచాయతీ పరిధిలో మౌలిక వసతులు,పలు అభివద్ధి కార్యక్రమాలకు రూ. రూ.27.29 కోట్లు మంజూరు చేశారు. ఐదు గ్రామాల్లో సీసీరోడ్లు, మురికికాలువలు, కమ్యూనిటీ హాలు, మినీ స్టేడియం, దోభిఘాట్, స్మశానవాటిక, ట్రాన్స్పార్మర్లు, మహిళా భవనం, నీటి ట్యాంక్, ఆసుపత్రి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తదితర 117 అభివృద్ధి కార్యక్రమాలకు రూ.66 కోట్లు మంజూరు చేశారు. -
'ధరణి' పోర్టల్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
ప్రతి ఇంచూ డిజిటల్ సర్వే
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణలోని ప్రతి ఇంచు జాగాను డిజిటల్ మెకానిజంలో పూర్తిగా సర్వే చేస్తం. గట్టు నిర్ణయించి అక్షాంశాలు, రేఖాంశాలు రికార్డు చేస్తరు. భూగోళం ఎన్ని రోజులుం టదో అన్ని రోజులు ఈ రేఖ ఉంటది. ఎవ్వరూ దీనిని మార్చలేరు. ఎల్లయ్యకు ఫలాన సర్వే నంబర్, ఫలానగ్రామం, ఫలాన జిల్లాలో ఈ అక్షాంశాలు, రేఖాంశాల మధ్య ఇంత భూమి ఉంది అని రికార్డుల్లో రాస్తరు. అప్పుడు ఆ భూమి హద్దులను చెరిపేయ డం ఎవరి వల్లా కాదు. వంద శాతం చెక్కు చెదర కుండా ఉంటుంది. ప్రపంచం లోని ఏ శక్తీ దీన్ని మార్చలేదు. టాంపర్ చేయలేదు. కిరికిరిగాళ్లు కూడా ఏం చేయలేరు’ అని సీఎం కె.చంద్రశేఖర్రావు అన్నారు. మేడ్చల్ –మల్కాజ్గిరి జిల్లా మూడు చింతల పల్లిలో గురువారం ఆయన ధరణి పోర్టల్ను ప్రారం భించి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ధరణి పోర్టల్ పనితీరు, ప్రత్యేకతలను వివరించారు. ‘ధరణి పోర్టల్ భారత దేశానికే ట్రెండ్సెట్టర్. ప్రపంచంలో క్లీన్ ల్యాండ్ రికార్డులున్న ప్రాంతం భారతదేశం లోని తెలంగాణ అని ప్రపంచవ్యాప్తంగా పేరురావాలి. దేశంలో తొలిసారిగా రెవెన్యూ రికార్డుల్లో ఎలక్ట్రానిక్ ఇంటర్వెన్షన్ ప్రవేశపెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. శాశ్వతంగా భూ బాధలుపోవాలి’ అని సీఎం ఆకాంక్షించారు. గురువారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, ధరణి పోర్టల్ను మొబైల్ ఫోన్లో చెక్ చేస్తున్న సభకు హాజరైన మహిళలు ఇకపై పహణీలో మూడే కాలమ్స్ ‘పహణీలో ఇంతకుముందు 33 కాలమ్స్ ఉండే. ఇప్పుడే మూడే మూడు ఉంటయి. రైతు పేరు, పట్టాదారుపేరు ఉంటది. ఏయే కాలం (పంట కాలం) ఉంటది. మన భూమి ఉంటది. ఎవరూ మార్చలేరు. ప్రశాంతంగా నిద్రపోవచ్చు. భవిష్యత్తులో సంపూర్ణమైన యాజమాన్య హక్కులిచ్చే దిశగా పోతున్నం. సర్వే తర్వాత స్పష్టత వస్తే అప్పుడిచ్చే అవకాశం వస్తుంది. అది సువర్ణావకాశం. ధరణి వచ్చిన తర్వాత భూముల మార్పిడి ఇక జరగదు. సాదాబైనామాలకు ప్రభుత్వం ఇప్పటికే చిట్టచివరి అవకాశమిచ్చింది. ఆ తర్వాత కేవలం రిజిస్ట్రేషన్ ద్వారానే భూమి మారుతుంది. సాదాబైనామాల రిజిస్ట్రేషన్ల కోసం ఇప్పటివరకు 1.64 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంకో వారం పొడిగించాలని సీఎస్ను కోరుతున్న. దాని తర్వాత సాదాబైనామా ఉండదు. సాదాబైనామా రిజిస్ట్రేషన్ సమయంలో ఒక రూపాయికి కూడా ఎవరినీ ఇబ్బంది పెట్టం. అటవీ, పోడు, వక్ఫ్ భూములు తేలాలి. దీనికి కూడా సర్వే సమాధానం ఇస్తది. చేవెళ్ల దగ్గర గిరిజనులు ఏళ్ల నుంచి అటవీ భూములను సాగు చేసుకుంటున్నరు. వారికి పోడు భూముల పట్టాలిస్తం’ అని సీఎం తెలిపారు. ఒక్క క్లిక్తో ఆర్థికశాఖ కార్యదర్శి నేరుగా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేయడానికి ధరణి వీలు కల్పిస్తుందన్నారు. రైతుల బాకీలన్నీ తీరిపోయి బ్యాంకు ఖాతాల్లో నాలుగైదు లక్షల రూపాయలున్నప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్టు అన్నారు. కౌలు రైతుల కోసం రికార్డుల్లో అనుభవదారుడి కాలమ్ పెడితే వారు కోర్టుకెళ్లి అసలుదారుడికి ఎసరుపెట్టే అవకాశం ఉందనే కౌలుదారులకు రైతుబంధు ఇవ్వడం లేదన్నారు. 15, 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ‘రిజిస్ట్రేషన్కు పైరవీలు అవసరం లేదు. ధరణి పోర్టల్/ మీ సేవ/ వ్యక్తిగతంగా ఆఫీసుకు పోయి దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మాత్రమే ఉండే. అదనంగా 570 తహసీల్దార్ కార్యాలయాలు కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా మారినయి. రిజిస్ట్రేషన్ కోసం మీ ఇష్టమున్న రోజు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ముందే ఫీజు కట్టేయవచ్చు. మీరే దస్తావేజులు రాసుకుంటాం అంటే నమూనా పత్రాలు కూడా సిద్ధంగా ఉంటయి. రాయించుకుంటాం అంటే డాక్యుమెంట్ రైటర్లు ఉంటరు. వారికి నిర్ణీత ఫీజు ఉంటది. ఇష్టం వచ్చినట్టు వసూలు చేయడానికి లేదు. రానున్న 10 – 15 రోజుల్లో ఏ మండలానికి ఎవరు డాక్యుమెంట్ రైటర్లు ఉంటరో జిల్లా కలెక్టర్లు అధికారికంగా ప్రకటిస్తరు. క్రయవిక్రయాలు జరిపే ఇద్దరూ వ్యవసాయదారులైతే ఇద్దరికీ పాసుబుక్కులుంటయి. ఒకాయన రెండెకరాలు ఇంకొకాయనికి అమ్మిండు. ఇద్దరి మధ్య బేరం అయిపోయిన తర్వాత వారిద్దరు కలిసి మేము ఫలాన విధంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటున్నం, ఆ ప్రకారం ఈ ఫీజు చలాన్ ద్వారా కడుతున్నం అని తహసీల్దార్ కార్యాలయానికి సమాచారమివ్వాలి. మ్యుటేషన్ ఫీజు కూడా ఉంటది. రెండు ఫీజులు కడితే హక్కు స్థాపితం అవుతుంది. మ్యుటేషన్ ఫీజు చాలా స్వల్పంగానే పెట్టినం. ఫీజులు కట్టాక మీరు కోరుకున్న రోజు మీకు స్లాట్ కేటాయిస్తరు. కార్యాలయానికి వచ్చాక గరిష్టంగా 15 – 20 నిమిషాల్లో అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయిపోతుంది. కొన్నాయన పాస్బుక్లో భూమి ఎక్కుతది. అమ్మినాయిన పాస్బుక్ నుంచి దానిని తీసేస్తరు. అప్పుడే ధరణి సైట్లో కూడా వచ్చేస్తది. వాపస్ వెళ్లిపోయేటప్పుడు ఎవరి పాస్బుక్కులు వారికి ఇస్తరు. రిజిస్ట్రేషన్ కాగితాలను కొనుక్కున్న ఆయనకు ఇస్తరు. ధరణిలో ఎక్కినటువంటి నకలు ఇస్తరు. మీరు ఇలా హ్యాపీగా ఇళ్లకు వెళ్లిపోవచ్చు. బ్యాంకు పాస్బుక్ ఎలా అప్డేట్ అవుతుందో ఇక్కడా భూమి అమ్మినా, కొన్నా ఆటోమేటిక్గా అప్డేట్ అవుతది. కొనేటటువంటి వ్యక్తికి గతంలో పాస్బుక్ లేకుంటే కొత్త పాస్బుక్ ఇస్తరు. అందుకు కొంత ఫీజును కొరియర్ చార్జీలుగా ఇవ్వాలి. అప్పుడు తాత్కాలిక పాస్బుక్లాగా ఓ పత్రం ఇస్తరు. పాస్బుక్ ఎక్కడపడితే అక్కడ ప్రింట్ చేయరు. దుర్మార్గులకు తెలిస్తే నకిలీ పాస్బుక్కులు ప్రింట్ చేస్తరు కాబటి రహస్యంగా చేస్తుంది ప్రభుత్వం. అలా ఆర్డర్ ఇచ్చిన పాస్బుక్ పోస్టల్ ద్వారా ఇంటికే వస్తది. మనుషుల ప్రమేయం లేకుండా ఒక్క రూపాయి అవినీతి లేకుండా జరిగిపోతుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని వివరించారు. తహసీల్దార్లే బాధ్యులు ‘చట్టం చాలా స్పష్టంగా ఉంది. భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్, కొనేటాయన, అమ్మేటాయనకు సంబంధించిన బయోమెట్రిక్ వేలిముద్రలతోనే పోర్టల్ తెరుచుకుంటది. అ అధికారం జిల్లా కలెక్టర్, రెవెన్యూ కార్యదర్శి, రెవెన్యూ మంత్రికి కూడా లేదు. గతంలో రిజిస్ట్రేషన్లు చేసి.. నేను చేయలేదు. ఆ సంతకం నాది కాదని అనేవారు. తహసీల్దార్లు ఇకపై అలా తప్పించుకోవడానికి లేదు. రిజిస్ట్రేషన్ జరిగిందంటే తహసీల్దారే బాధ్యుడు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తహసీల్దార్లు లేకుంటే, సమయానికి ఏదైన కారణంతో రాకపోయినా, సెలవుపెట్టినా నాయబ్ తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ చేస్తరని సీఎం తెలిపారు. హేరాపేరీకి అవకాశం లేదిక.. ‘భూ సమస్యల శాశ్వత నివారణకు ధరణి పోర్టల్ తీసుకొచ్చాం. పెద్ద విప్లవం, గొప్ప సంస్కరణలు వచ్చినప్పుడు కొన్ని బాలారిష్టాలు ఉంటయి. వాటిని తట్టుకుని ముందుకుపోవాలి. ప్రతికూల శక్తులుంటయి. ఎక్కడ్నో ఏదో మండలంలో చిన్న పొరపాటు వస్తే దాన్నే ఎక్కువ చేసి చూపించే అవకాశం ఉంటది. దానికి ప్రజలెవరూ ఆందోళనపడొద్దు. ఇది పూర్తిగా పారదర్శకమైన పోర్టల్. అన్ని రకాలుగా క్లీన్ అయిన కోటీ 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలు ధరణి వెబ్సైట్లో దర్శనమిస్తున్నయి. వీటిపై ఎలాంటి పంచాయితీ, కిరికిరి లేవు. వీటి వివరాలను ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్లైనా సరే చూసుకోవచ్చు. ఎట్టిపరిస్థితుల్లో ఒకరి భూమి ఇంకొకరి పేరుపై రాయడం, మార్చడం, గోల్మాల్ చేయడం ఉండదు. దేవాలయ, వక్ఫ్, ప్రభుత్వ, అటవీ భూములను ఇంతకుముందు ఎవరికిపడితే వారికి రిజిస్ట్రేషన్లు చేసినరు. దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్ రైల్వేస్టేషన్ను ఓ ప్రబద్ధుడు రిజిస్ట్రేషన్ చేస్తే ఓ బ్యాంకు వాళ్లు నమ్మి లోన్కూడా ఇచ్చారు. ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరగవు. ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అటవీ భూములన్నీ కూడా ధరణి పోర్టల్లో ఉంటయి కానీ, ఆటోలాక్లో ఉంటయి. ఎమ్మార్వో, కలెక్టర్ ఓపెన్ చేయాలన్నా ఓపెన్ కావు. హేరాపేరీ జరగడానికి అవకాశం ఉండదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కోర్టు తీర్పులకు అనుగుణంగా పార్ట్–బీ భూములపై నిర్ణయం ‘మూడుచింతలపల్లిలో నూటికి 99 మందికి గట్లున్నయి. ఒకటి రెండు శాతం భూములకు మాత్రమే పంచాయితీలున్నయి. ఆ ఒక్క, రెండు శాతం భూముల కోసం మొత్తం కార్యక్రమాన్ని ఎందుకు వాయిదా వేయాలని నేను అధికారులతో వాదించేవాడిని. ఆ విధంగానే నిర్ణయం తీసుకున్నం. పరిష్కారం కాని భూములను గతంలో పార్ట్–బీలో పెట్టినరు. ఈ వివాదాలపై వచ్చే కోర్టు తీర్పును బట్టి నిర్ణయం ఉంటది’ అని సీఎం అన్నారు. ఇక విచక్షణాధికారాలకు చెల్లు ‘రిజిస్ట్రేషన్ ఫీజుల విషయంలో గతంలో సబ్రిజిస్ట్రార్కు కొంత విచక్షణాధికారం ఉండేది. సపోజ్ మన పక్క సర్వేనంబర్ వాడు రూ.20లక్షల ధరతో రిజిస్ట్రేషన్ చేయించుకుండు. నువ్వుకూడా అదే రేటుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సబ్రిజిస్ట్రార్ తన విచక్షణాధికారాలతో అడిగేవాడు. డబ్బులు తీసుకుని పాత ధరకే చేసేవాడు. ఇప్పుడు అలాంటి విచక్షణాధికారం లేదు. పాత రిజిస్ట్రేషన్ ధరలనే మళ్లీ నిర్ధారించాం. ఈ విలువ ప్రకారమే ఫీజులివ్వాలి’ అని ముఖ్యమంత్రి కోరారు. వారసత్వంపై కుటుంబాలే నిర్ణయించుకోవాలి ‘కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఫౌతి (వారసత్వ) హక్కులు మార్చుకునే అధికారం ఆ కుటుంబానికే మేము ఇచ్చినం. కుటుంబసభ్యులంతా కూర్చుని వాటాలపై తీర్మానం చేసుకుని ఎమ్మార్వోకి ఇస్తే ఆ మేరకు వారసత్వ మార్పిడి చేస్తరు. లేదంటే సివిల్ కోర్టుకు వెళ్లి తేల్చుకోమని చెప్పినం. వారసత్వ మార్పిడిలో ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ రాసిండని గతంలో మాదిరిగా తహసీల్దార్లను తిట్టడానికి అవకాశం ఉండదు’ అని సీఎం స్పష్టం చేశారు. వీఆర్వోలను ఖాళీల్లో సర్దుబాటు చేస్తం.. ‘భూసమస్య రైతులకు తలనొప్పిగా మారింది. ఉద్యోగ సంఘాల నేతలు రవీందర్రెడ్డి, గౌతంకుమార్, రాజేందర్ ఈ సమావేశానికి నాతోపాటు వచ్చారు. వీఆర్వోల వల్ల రెవెన్యూ శాఖకు చెడ్డపేరు వస్తున్నదని, వీరందరినీ తీసివేయాలని వారికి చెప్పిన. ‘రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తామని ఎన్నికల్లో కూడా హామీనిచ్చారు. మీ ప్రజలకు వాగ్దానం ఇచ్చారు కాబట్టి నెరవేర్చాల్సిందే. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంద’ని వారు అన్నారు. వీర్వోలను ఏ శాఖలో ఖాళీలుంటే అక్కడ సర్దుబాటు చేస్తం. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడి త్వరలో వారి సమస్యను తీరుస్తం’ అని సీఎం తెలిపారు. దేశానికే దిక్సూచిలాంటి ధరణి పోర్టల్కు శ్రీకారం చుట్టిన రెవెన్యూ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కొందరు అధికారులు చేసే తప్పులకు మొత్తం రెవెన్యూ శాఖను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 15–20 రోజుల్లో.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. మీడియాతో చిట్చాట్లో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన ‘ధరణి’ని 15–20 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆ తర్వాతే ఆస్తుల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం సాగు భూములకు ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చిందని, సాంకేతికంగా సాధకబాధకాలను అంచనా వేసి పకడ్బందీగా ముందడుగు వేయనున్నట్లు తెలిపా రు. ఈ పోర్టల్ 12 రోజుల్లో వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ‘వ్యవసాయ, వ్యవసాయేతర ధరణి సాఫ్ట్వేర్లో తేడా ఉంటుంది. సాగు భూమికి ఒకరే పట్టాదారు ఉంటారు. అదే వ్యవసాయేతర(అపార్ట్మెంట్) ఆస్తికి వచ్చేసరికి చాలామంది యజమానులు ఉంటారు. వీటిన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ధరణి ని రూపొందిస్తున్నాం’అని సీఎం చెప్పారు. గురువారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో ధరణి పోర్టల్ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం సీఎం మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. తమ ఆస్తుల సమాచారాన్ని ఇతరులు చూడకుండా.. గోప్యంగా ఉంచుకోవాలని భావిస్తే.. దానికి అనుగుణం గా ధరణి సాఫ్ట్వేర్లో ప్రత్యేక ఆప్షన్ ఇస్తున్న ట్లు ఆయన చెప్పారు. ధరణి సర్వర్లను దేశం లో వేర్వేరు చోట్ల భద్రపరిచామని, సమాచా రం భద్రంగా ఉంచడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రిజిస్ట్రేష న్ చార్జీల్లో ఎలాంటి మార్పుల్లేవని, ప్రస్తుతం ఉన్నవాటినే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కాగా, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు తేలిన తర్వాతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. -
ఏడు రోజుల్లోనే కొత్త పాస్ పుస్తకం : కేసీఆర్
సాక్షి, మేడ్చల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ధరణి’పోర్టల్ రైతు ముంగిట్లోకి వచ్చింది. సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 (హైదరాబాద్ జిల్లా మినహా) మండలాల్లో ఈ సేవలు నేటి నుంచి రైతులకు అందనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు... 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. పెండింగ్లో ఉన్న పార్ట్ బీ కేటగిరీ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. నవంబర్ 2 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ విధానంలో ఒకేసారి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగనున్నాయి. దేశానికి మార్గదర్శకం : సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ ప్రారంచిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ దేశానికే మార్గదర్శకం అన్నారు. ఇది పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు. ఏ దేశంలో ఉన్నా మీ భూమి వివరాలను ధరణి పోర్టల్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా భూములు గోల్మాల్ అయ్యే అవకాశమే లేదన్నారు. గతంలో ఢిల్లీ సెంట్రల్ రైల్వేస్టేషన్ భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకునేవారని, ధరణి పోర్టల్ ద్వారా అలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్టు వేశామన్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదన్నారు. ఎమ్మార్వో కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. డాక్యుమెంట్ రైటర్లను కూడా రాబోయే పది రోజుల్లో నియమిస్తామని హామీ ఇచ్చారు. ఎంత ఫీజు వసూలు చేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుందన్నారు. కొత్త పాస్ పుస్తకం ఏడు రోజుల్లోనే ఇంటికి వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. -
రెవెన్యూలో నవశకం
భూ పరిపాలనలో కీలక మార్పులకు ధరణి వేదిక కానుంది. భూ రికార్డుల నిర్వహణ, ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్), రిజిస్ట్రేషన్ వ్యవహారాలు... భూ పరిపాలనలో ఈ మూడు ప్రధానం. ఇకపై వీటన్నింటికీ ఒకే ఒక సమాధానం ధరణి. ఈ పోర్టల్నే భూ హక్కుల రికార్డుగా పరిగణిస్తూ కొత్త చట్టంలో పేర్కొన్నందున ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ రికార్డులు అప్రాధాన్యం కానున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ధరణి’పోర్టల్ను గురువారం రైతు ముంగిట్లోకి తెస్తోంది. అధికార అంచెల్లో... అధికారాల్లోనూ కోత విధిస్తూ రూపొందించిన భూ హక్కులు, పాస్ పుస్తకాల చట్టం–2020 (ఆర్వోఆర్) నేటి నుంచి మనుగడలోకి రానుంది. ఇన్నాళ్లు కొనసాగిన మాన్యువల్ రికార్డులకు ముగింపు పలుకుతూ, డిజిటల్ ఆధారిత భూ రికార్డుల నిర్వహణకు నడుం బిగించింది. అవినీతి వేళ్లూనుకున్న రెవెన్యూ శాఖను సమూలంగా సంస్కరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆర్వోఆర్ 1971 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా రెవెన్యూలో ప్రజలకు సులభతర సేవలందించే దిశగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. పహాణీ, సేత్వార్ల నకలు కావాలన్నా.. పైసలిస్తే కానీ పని కాదనే ఆరోపణలకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఇక రికార్డులను ఎవరైనా, ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో తెలుసుకునేలా ధరణిని అందుబాటులోకి తెచ్చారు. గ్రామస్థాయిలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన సర్కారు.. అప్పీలేట్ ఆథారిటీని ఎత్తివేసి ఆర్డీవోలను నామ్కే వాస్తే గా మార్చింది. దీంతో రెవెన్యూలో ఇకపై మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలోని విభాగాలే క్రియాశీలకంగా వ్యవహరించనున్నాయి. భూ రికార్డుల నిర్వహణ కేవలం కంప్యూటర్ ఆధారిత భూ రికార్డులను మాత్రమే నిర్వహించే రెవెన్యూశాఖ... మ్యాన్యువల్ రికార్డుల నిర్వహణ నుంచి తప్పుకోనుంది. పహానీ నకలును పొందేందుకు రైతులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. సిబ్బంది చేతులు తడిపితే కానీ రికార్డు చేతికందేది కాదు. ఈ పరిస్థితి నుంచి రైతులకు ఊరట కలుగనుంది. ఆన్లైన్లోనే భూ రికార్డులను ఎప్పుడైనా చూసి తెలుసుకునే వీలు కలుగనుంది. ఒకే భూమికి వేర్వేరు రికార్డులు చూపుతున్న తరుణంలో ధరణితో ఈ సమస్యకు ఫుల్స్టాప్ పడనుంది. ఇకపై అది ప్రైవేటా, ప్రభుత్వ భూమా అనేది ఇట్టే తెలిసిపోనుంది. తద్వారా భూ హక్కులపై సందిగ్థతకు తెరపడనుంది. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ప్రస్తుతం భూ హక్కులు పొందినా... రికార్డులకెక్కడానికి 2 నుంచి 6 నెలల సమయం పడుతోంది. మ్యుటేషన్, పాస్ పుస్తకాల జారీలో జరిగే జాప్యానికి ‘ధరణి’తో ముగింపు పడనుంది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీల్దార్లే నిర్వహిస్తుండడం.. అక్కడికక్కడే రికార్డుల అప్డేషన్, పీపీబీ జారీ, మ్యుటేషన్ ప్రక్రియ కూడా అర గంటలొనే పూర్తి కానుంది. ధరణి దేశానికే దిక్సూచిలా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్ల నిర్వహణను ప్రభుత్వం సులభతరం చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయడం.. రెవెన్యూ కార్యాలయాలకు డేటా అనుసంధానించకపోవడం, రికార్డుల బదలాయింపులో తీవ్ర జాప్యం జరగడం, భూ హక్కుల పరిశీలనాధికారం ఎస్ఆర్వోలకు లేకపోవడం, డబుల్ రిజిస్ట్రేషన్లు జరగడంతో భూ వివాదాలకు ఆజ్యం పోసింది. వీటిన్నింటికి మంగళం పాడేలా.. సాగు భూముల రిజిస్ట్రేషన్ల అధికారం తహసీల్దార్లకే కట్టబెట్టారు. దీంతో కేవలం డీడ్లే గాకుండా.. హక్కులపై కూడా వారికి సంపూర్ణమైన అవగాహన కలుగనుంది. ధరణిలో ఉన్న రికార్డుల మేరకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నందున తగాదాలకు చోటుండదు. అధికారులకు పవర్కట్ రెవెన్యూ వ్యవహారాల్లో అధికారులకు ఎలాంటి అధికారులుండవు. తహసీల్దార్లు రిజిస్ట్రేషన్ సేవలు, నాలా అధికారాలకే పరిమితం కానుండగా.. ఆర్డీవోల పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. రెవెన్యూ కోర్టుల రద్దుతో తహసీల్దార్లు, ఆర్డీవో, అదనపు కలెక్టర్ల నుంచి రెవెన్యూ అధికారాలను పూర్తిగా తొలగించిన ప్రభుత్వం... కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్లకు కాస్తో కూస్తో అధికారాలు, బాధ్యతలు అప్పగించినా, ఆర్డీవో విధులను నిర్వచించలేదు. దీంతో ఆర్డీవోలు ఇకపై భూ సేకరణ, కలెక్టర్ సూచనల మేరకు అదనపు సేవలు అందించాల్సిందే. మరోవైపు క్షేత్రస్థాయిలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) వ్యవస్థ రద్దు చేసినందున వీరి సేవలను ఎక్కడ వినియోగించుకుంటారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. మూడుచింతలపల్లిలో ప్రారంభం సాగు భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ధరణి పోర్టల్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 570 (హైదరాబాద్ జిల్లా మినహా) మండలాల్లో ఈ సేవలు నేటి నుంచి రైతులకు అందనున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసిన 59.46 లక్షల ఖాతాలు... 1.48 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. పెండింగ్లో ఉన్న పార్ట్ బీ కేటగిరీ భూముల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
మూడుచింతలపల్లికి సీఎం కేసీఆర్ వరాలు
మేడ్చల్: వచ్చే ఏడాది జూన్ నాటికి మేడ్చల్ జిల్లాకు గోదావరి జలాలను తరలిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లిలో ఏర్పాటుచేసిన గ్రామసభలో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని 374 చెరువులను గోదావరి జలాలతో నింపుతామని రైతులకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మూడుచింతలకు పలు వరాలు ప్రకటించారు. ప్రత్యేకరాష్ట్రం కోసం అమరుడైన వీరారెడ్డి పేరుతో గ్రామంలో ప్రాథమిక వైద్యశాల నిర్మిస్తామని చెప్పారు. రూ.75 లక్షల వ్యయంతో విలేజ్ కమ్యూనిటీ హాల్, రూ.30 లక్షలతో మహిళా సంఘాల కోసం భవనం నిర్మిస్తామని ప్రకటించారు. మూడుచింతలపల్లి సహా కేశవరం, లక్ష్మాపూర్, మరో మూడు గ్రామాలకు రూ.5 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. లింగాపూర్ తండాను త్వరలోనే పంచాయితీగా మారుస్తామని హామీ ఇచ్చారు. -
మూడుచింతలపల్లికి సీఎం కేసీఆర్ వరాలు