nandigama hospital
-
నందిగామ ఆస్పత్రిలో ఏం జరిగింది?
ప్రతిపక్షనేత చేసిన నేరమేమిటి? సాక్షి, అమరావతి బ్యూరో: వైఎస్ జగన్ ఏదో చేశారంటూ గగ్గోలు పెడుతున్న టీడీపీ నాయకులు చెబుతున్న దాంట్లో వాస్తవమెంత? ప్రాణాలు పోగోట్టుకున్న వారిని పరామర్శించాల్సింది పోయి ఘటనా స్థలికి వెళ్లిన ప్రతిపక్షనేతను ఎందుకు తప్పుబడుతున్నారు? వాస్తవాలేంటీ? వక్రీకరణలేంటీ? ఓ పెద్ద ప్రమాదం జరిగినపుడు బాధ్యతగలిగిన ప్రతిపక్షనేతగా హుటాహుటిన అక్కడకు వెళ్లడం, బాధితులను ఓదార్చడంతోపాటు వారికి న్యాయం జరిగేందుకు ప్రయత్నించడమే ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేసిన నేరం! జగన్ అక్కడకు వెళ్లకపోయి ఉంటే అసలు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేవారా? పోస్టుమార్టం నిర్వహించకుండానే మృతదేహాలను తరలించేసేందుకు అధికారయంత్రాంగం, డాక్టర్లు ప్రయత్నించడం నిజం కాదా? కృష్ణాజిల్లాలోనే ఉన్న ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడు నందిగామ ఎందుకు వెళ్లలేకపోయారు? పైగా అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్షనేతపై కేసులు నమోదు చేయడం చూస్తేనే ఈ ప్రభుత్వం ఎవరి పక్షాన ఉన్నదో, ఎవరి మేలు కోసం పనిచేస్తున్నదో అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు. (చదవండి: విషాద వాటికలో దోషుల సేవ) ప్రతిపక్షనేతగా కేబినెట్ మంత్రి హోదా ఉన్న జగన్మోహన్రెడ్డి ఆస్పత్రిలో ఉన్న అధికారుల విధులకు ఆటంకం కలిగించడమేమిటి? ప్రొటోకాల్ ప్రకారం కలెక్టర్ కన్నా ప్రతిపక్షనేతది పెద్ద హోదాయే కదా? పైగా జగన్ వస్తున్నాడంటూ అధికారులే హడావిడి చేశారని, ఆగమేఘాలపై అన్ని కార్యక్రమాలూ పూర్తిచేసి శవాలను తీసుకెళ్లాల్సిందిగా తమను వత్తిడి చేశారని మృతుల బంధువులు చెబుతున్నారు. జగన్ ఎవరినీ బెదిరించలేదని, దూషించలేదని, ఎవరి విధులకూ ఆటంకం కలిగించలేదని వారు వివరించారు. మొదట నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు జగన్ వస్తున్నారని తెలుసుకునే ఆగమేఘాలమీద స్పందించారని వారు తెలిపారు. వాస్తవాలనెందుకు మరుగుపరుస్తున్నారు? నిజానికి హాస్పటల్కు వెళ్లడానికి ముందే జగన్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. డివైడర్ను ఢీకొన్న బస్సు గాలిలో 100 అడుగులు ప్రయాణించి కల్వర్టులో పడిపోయింది. దానికి కారణం మితిమీరిన వేగం లేదా డ్రైవర్ తాగి ఉండాలని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత ఆయన హాస్పటల్కు వెళ్లారు. అక్కడ ఒక పెద్ద హాలులో కొన్ని మృతదేహాలను కట్టకట్టి ఉంచారు. ఒకటి రెండు మృతదేహాలను సుమోలలో ఎక్కిస్తున్నారు. బాధితుల బంధువులతో జగన్ మాట్లాడారు. తరలించడానికి సిద్ధంగా ఉన్న మృతదేహాలలో డ్రైవర్ మృతదేహం కూడా ఉందని డాక్టర్లు చెప్పారు. ‘పోస్టుమార్టం అయిపోయిందంటున్నారు.. డ్రైవర్ తాగి ఉన్నాడా’ అని డాక్టర్ను జగన్ అడిగారు. జవాబిచ్చేందుకు డాక్టర్ తడబడ్డారు. పోస్టుమార్టం చేయలేదు అని చెప్పారు. పోస్టుమార్టం చేయాల్సిందిగా అభ్యర్థించే పత్రాల నకళ్లలో ఒకదానిని జగన్కు డాక్టర్ అందించారు. అదే సమయంలో జగన్ వెనక ఉన్న కలెక్టర్.. చెప్పవద్దు అంటూ డాక్టర్కు సైగలు చేయడం కనిపించింది. దాంతో అక్కడే ఉన్న మీడియాతో జగన్ మాట్లాడుతూ ‘ఇదీ పరిస్థితి. డాక్టర్ పోస్టుమార్టం చేయలేదు అని చెబుతున్నారు. మరోవైపు డ్రైవర్ మృతదేహాన్ని పంపించివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు. ఆ సందర్భంలోనే జగన్ కలెక్టర్తో మాట్లాడుతూ ‘మీరు తప్పు చేస్తున్నారు.. ఇంత పెద్ద సంఘటన జరిగినపుడు విచారణతో సహా అన్నీ పద్ధతి ప్రకారం జరిగేలా చూడాల్సిన మీరు నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మీకే నష్టం. బాధితుల పక్షాన నిలబడకపోతే అందరూ జైలుకు పోవలసి వస్తుంది.’ అని అన్నారు. కేసు విచారణకు సంబంధించిన కీలకమైన అంశాన్ని జగన్ లేవనెత్తడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఆయన ప్రశ్నించిన తరువాత వెంటనే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. విజయవాడకు చెందిన ప్రభుత్వ ఫోరెన్సిక్ వైద్యుడు శ్రీనివాస్ నాయక్ పోస్టుమార్టం చేశారు. కొన్ని శరీర భాగాలను పరీక్షల కోసం రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ముండ్లపాడు బస్సు ప్రమాద ఘటనలో వాస్తవాలివీ.. మరి వీటిని ఎందుకు మరుగునపరుస్తున్నారు.. ప్రశ్నించిన ప్రతిపక్షనేతపై కేసులు పెట్టడమేమిటని ప్రజలంతా విస్తుపోతున్నారు. -
విషాద వాటికలో దోషుల సేవ
- బస్సు ప్రమాదం ఘటనలో ప్రభుత్వ బాధ్యతను మరచిన అధికారులు - ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై కేసులతో ఎదురుదాడి - దివాకర్ ట్రావెల్స్ని కాపాడేందుకు ఆపసోపాలు - కలెక్టర్ నుంచి రవాణా, పోలీసులు, వైద్యుల వరకూ ఇదే తీరు - ప్రాథమిక అంశాలను గాలికొదిలి తూతూమంత్రంగా విచారణ సాక్షి, అమరావతి బ్యూరో: ఓ పెద్ద విషాదం.. ఘోర రోడ్డు ప్రమాదం.. పది కుటుంబాలలో అంతులేని వ్యథను మిగిల్చింది.. ఆ కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ఆ ఘటనకు కారణమేమిటో కనుక్కోవద్దా..? బాధ్యతెవరిదో తేల్చవద్దా..? బాధ్యులెవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకుంటే కదా అలాంటి మరో ముప్పు నుంచి మనమందరం తప్పించుకోగలుగుతాం..! అది ప్రభుత్వ కనీస బాధ్యత. అది అధికారయంత్రాంగం కనీస విద్యుక్తధర్మం. కానీ అందరూ కలసికట్టుగా దానిని అటకెక్కించారు. కూడబలుక్కుని దోషులను రక్షించేందుకు కంకణం కట్టుకున్నారు. సాక్ష్యాలు పట్టించుకోరు.. మృతదేహాలకు పోస్టుమార్టం చేయించరు. రెండో డ్రైవర్ లేకపోయినా ఉన్నట్లు కనికట్టు చేస్తారు. అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీకి చెందిన ట్రావెల్స్ ఇబ్బందుల్లో పడిపోతుందని ఇంతమంది ఇన్ని రకాలుగా రక్షించే ప్రయత్నించడం బహుశా ఇంకెక్కడా మనం చూసి ఉండం. డాక్టర్లు, పోలీసులు, రవాణాశాఖ అధికారులు.. చివరకు జిల్లా కలెక్టర్ ఇలా అందరూ ఒక్కతాటిపై ఒక్కమాటపై నిలబడి దోషుల సేవలో తరించడం చూసి జనం నివ్వెరపోతున్నారు.. ‘‘ఇదేం న్యాయం? బాధితులకు ఇంత అన్యాయం చేస్తారా? ఇది మీకు తగదు’’ అని అన్న పాపానికి ప్రతిపక్షనేతపై కేసులు మోపే స్థాయికి ఈ ప్రభుత్వం దిగజారడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్రంలో అరాచకపాలన ఏ స్థాయికి చేరుకుందో తెలుసుకునేందుకు కృష్ణాజిల్లా ముండ్లపాడు వద్ద జరిగిన బస్సుప్రమాదం తాజా ఉదాహరణ.. వైద్యులకిది తగునా...:? మెడికో లీగల్ కేసుల్లో పోస్టుమార్టం అన్నది అత్యంత కీలకమైన అంశమని వైద్యులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నందిగామ ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు ఆ అంశానికి ప్రాధాన్యమివ్వకపోవడం విస్మయపరుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగినపుడు డ్రైవర్ తాగి ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవడం అతి ముఖ్యమైన అంశం. డ్రైవర్ బతికి ఉంటే బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలి. డ్రైవర్ మృతిచెందితే ఆయన శరీరభాగాలను పరిశీలించాలి. పోస్టుమార్టం చేయాలి. తుది నివేదిక కోసం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాలి. కానీ దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం కేసులో వైద్యులు ఈ ప్రాథమిక అంశాలన్నీ విస్మరించారు. (చదవండి: డెత్ ట్రావెల్స్!) పోలీసుల తీరూ అంతే... సంచలనం సృష్టించిన ఇలాంటి కేసుల విచారణ సందర్భంలో పోలీసులు ఎంతో జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. రెండో డ్రైవర్ ఉన్నాడా? ఉంటే ఎవరు? అన్న విషయాన్ని పోలీసులు నిర్ధారించాలి. కానీ మంగళవారం మధ్యాహ్నం తరువాత తానే రెండో డ్రైవర్ని అంటూ ఒకరు వస్తే ఎలాంటి ఆధారాలూ సరిపోల్చుకోకుండా పోలీసులు సరేనన్నారు. కానీ ఆయన నిజంగా రెండో డ్రైవరా కాదా అనేది నిగ్గుతేల్చాలని భావించనే లేదు. అంతవరకు కనిపించని ఆ డ్రైవర్ హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చాడనే దిశగా విచారించనే లేదు. ప్రమాదం సంభవించి 24గంటల తరువాత కూడా రెండో డ్రైవర్ ఎవరన్నది పోలీసులు వెల్లడించలేదు. ‘ట్రావెల్స్’ని కాపాడేందుకు రవాణా శాఖ తాపత్రయం బస్సు ప్రమాదం కేసులో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాపాడేందుకు రవాణా శాఖ అధికారులు శతవిధాలుగా ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది. డ్రైవర్ తాగి బస్సు నడపడం వల్ల ప్రాణనష్టం సంభవిస్తే ట్రావెల్స్ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి. డ్రైవర్ తాగి బస్సు నడిపాడా? లేక మరో కారణం వల్ల ప్రమాదం జరిగిందా అనేది పోస్టుమార్టం సవ్యంగా జరిగితే తేలే అవకాశం ఉండేది. మంగళవారం మధ్యాహ్నం 3గంటలవరకు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోయినా అధికారులు పట్టించుకోనే లేదు. పైగా ఫోరెన్సిక్ నివేదిక వచ్చే వరకూ కూడా ఆగకుండానే బుధవారం నాడు హడావిడిగా ఓ ప్రకటన విడుదల చేసేశారు. డ్రైవర్ తాగి లేడని వారంతట వారు తేల్చేశారు. ప్రమాదానికి ముందు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్నది? మరో కీలకమైన అంశం. బీపీ, గుండెపోటు, కంటిచూపు ఇతరత్రా సమస్యలు లేకుండా పూర్తి ఆరోగ్యంతో ఉన్నవారికే విధులు అప్పగించాలి. అందుకోసం ట్రావెల్స్ యాజమాన్యం తమ డ్రైవర్లకు క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. మరి దివాకర్ ట్రావెల్స్ ఆ నిబంధనలను పాటిస్తోందా లేదా అన్నది రవాణా శాఖ అధికారులు పట్టించుకోనే లేదు. ప్రమాదానికి గురైన బస్సుకు రెండో డ్రైవర్ ఉన్నారా?.. ఉంటే ఎవరు? కీలకమైన ఈ అంశాన్ని రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడమే లేదు. ప్రమాదం సంభవించిన చాలాసేపటి వరకు రెండో డ్రైవర్ ఎవరన్నది ఎవరూ చెప్ప లేదు. మంగళవారం మధ్యాహ్నం 3గంటల తరువాత ఒకర్ని తీసుకువచ్చి ఆయనే రెండో డ్రైవర్ అని చూపించారు. ప్రమాదం సంభవించినప్పుడు రెండో డ్రైవర్ బస్సు కింది భాగంలో ఉన్న డిక్కీలో నిద్రపోతున్నారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బస్సు రన్నింగ్లో ఉన్నప్పుడు డిక్కీలో రెండో డ్రైవర్ నిద్రపోవడం అసాధ్యమని సీనియర్ ఆర్టీవో ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. తన 15ఏళ్ల అనుభవంలో ఇలాంటి విషయాన్ని చూడలేదని ఆయన చెప్పారు. గమ్యస్థానంలో బస్సును నిలిపి ఉన్నప్పుడు డీక్కీ తెరచి అందులో నిద్రించవచ్చన్నారు. అంతేగానీ బస్సు ప్రయాణిస్తున్నప్పుడు డిక్కీలో నిద్రపోవడం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఏమాత్రం గాలి కూడా అందని డిక్కీలో ఉండలేరన్నారు. డ్రైవర్ సీటు వెనుకభాగంలోనే రెండో డ్రైవర్ విశ్రాంతి తీసుకునేందుకు బెర్త్ ఉంటుందన్నారు. దీంతో ప్రమాదానికి గురైన దివాకర్ ట్రావెల్స్ బస్సుకు రెండో డ్రైవర్ ఉన్నారా అన్నది సందేహాస్పదంగా మారింది. రెండో డ్రైవర్ లేరన్న విషయాన్ని నిర్ధారిస్తే ట్రావెల్స్ యాజమాన్యం ప్రమాదానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం రెండో డ్రైవర్ అంశాన్ని ప్రధానంగా లేవనెత్తడంతో అధికారులు గతుక్కుమన్నారు. రెండో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నారని బుధవారం ఉదయం ప్రకటించారు. కలెక్టర్ అలా ఎందుకు వ్యవహరించారు? ఏదైనా ప్రమాదంగానీ విపత్తుగానీ సంభవిస్తే సంబంధిత అన్ని విభాగాలను సమన్వయపరుస్తూ తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్దే. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు శాస్త్రీయంగా చర్యలు చేపట్టారా లేదా అన్నది కలెక్టర్ పరిశీలించాలి. ప్రమాద కారణాలను తెలుసుకోవడానికి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించాల్సిన బాధ్యత పోలీసు అధికారులది. పోస్టుమార్టం చేయాల్సింది వైద్యులు. పోలీసులు, వైద్యులు ఆ విధంగా వ్యవహరించకపోతే కలెక్టర్ స్పందించాలి. పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశించాలి. జిల్లా మేజిస్ట్రేట్గా ఆయనకు విచక్షణాధికారాలు ఉన్నాయి. కానీ దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద అనంతరం కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబు. ఆ అంశానికే ప్రాధాన్యమివ్వలేదు. ఉదయం 5.45గంటలకు ప్రమాదం సంభవించింది. దాదాపు 10గంటల సమయంలో డ్రైవర్ మృతదేహం నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. కలెక్టర్ బాబు దాదాపు మధ్యాహ్నం 1గంట సమయంలో ఆసుపత్రికి చేరుకున్నారు. కానీ సాయంత్రం 3 గంటలకు ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వచ్చేవరకు కూడా డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయనే లేదు. జగన్మోహన్రెడ్డి అడిగినపుడు ఆ విషయాన్ని వైద్యులే చెప్పారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని కలెక్టర్ ఆదేశించకపోవడం, పైగా జగన్ అడిగితే అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని చెప్పడం ప్రశ్నార్థకంగా మారాయి. పోస్టుమార్టం చేయకుండానే డ్రైవర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి తరలించేందుకు అధికారులు ఎందుకు ఏర్పాట్లు చేసినట్లు? -
వైఎస్ జగన్పై కేసు నమోదు
విజయవాడ : ప్రతిపక్ష పార్టీపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఎదురుదాడికి దిగింది. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. వైఎస్ జగన్ సహా పార్టీ నేతలు పార్థసారధి, ఉదయభాను, జోగి రమేష్, అరుణ్ కుమార్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆస్పత్రి సిబ్బంది విధులుకు ఆటంకం కలిగించారంటూ వైఎస్ జగన్ సహా పార్టీ నేతలపై సెక్షన్ 353, 503,34 కింద కేసులు నమోదు అయ్యాయి. నందిగామ ప్రభుత్వాస్పత్రిలో కలెక్టర్పై దురుసుగా ప్రవర్తించారని టీడీపీ నేత వాసిరెడ్డి సత్యనారాయణ ప్రసాద్ బుధవారం నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హుటాహుటీన కేసు నమోదు చేయడం గమనార్హం. కాగా రాజకీయ కక్షతోనే టీడీపీ నేతలతో ఫిర్యాదు చేయించి ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు. కాగా కృష్ణాజిల్లా నందిగామ మండలం ముండ్లపాడు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో వైఎస్ జగన్ హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సంబంధిత వార్తలు.... ఇలాగైతే జైలుకెళ్తారు -
వైఎస్ జగన్పై కేసు నమోదు
-
ఇలాగైతే జైలుకెళ్తారు
⇒ డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోయినా చేసినట్లు కలెక్టర్ చెప్పడంపై జగన్మోహన్రెడ్డి ఆగ్రహం ⇒ డ్రైవర్ తాగి ఉన్నాడో లేదో తెలిసేదెలా? ⇒ టీడీపీ ఎంపీ ట్రావెల్స్ కాబట్టి కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ⇒ రిపోర్ట్ కాపీ ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి? సాక్షి, అమరావతిబ్యూరో: రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండానే మూటకట్టేయడం , రహస్యంగా తరలించే ప్రయత్నం చేయడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం సంఘటనా స్థలానికి చేరుకున్న జగన్మోహన్రెడ్డి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను వాకబు చేశారు. అనంతరం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రమాద కారణాలను గుర్తించడానికి తీసుకున్న చర్యలపై అధికారులు సూటిగా సమాధానం చెప్పలేదు. అక్కడే మూటగట్టి ఉన్న డ్రైవర్ ఆదినారాయణ మృతదేహాన్ని చూస్తూ వైద్యులను జగన్ ప్రశ్నించారు. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారా?’’ అని అడగ్గా డాక్టర్ స్పందిస్తూ... ‘‘ఆ!... ఇంకా చేయలేదు. చేస్తాం’’ అంటూ ముక్తసరిగా సమాధానం చెబుతూ కొన్ని నివేదికల ప్రతులు చూపించారు. ఆ నివేదికలను చూసి వైఎస్ జగన్ స్పందిస్తూ.. ‘‘డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోతే ప్రమాదానికి గల కారణాలు ఎలా తెలుస్తాయి? తాగి ఉన్నారో లేదో తెలుసుకోవద్దా? పోస్టుమార్టం చేయకుండానే మృతదేహాన్ని ఎందుకు మూటగట్టేశారు? గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని నిలదీశారు. అదే విషయాన్ని అక్కడే ఉన్న కలెక్టర్ బాబు.ఎను కూడా అడిగారు. పోస్టుమార్టం చేయలేదని డాక్టర్ ఓ వైపు చెబుతుండగా కలెక్టర్ మాత్రం మాట దాటవేసేందుకు యత్నించడం గమనార్హం. ‘‘బాధ్యతాయుత ప్రతిపక్ష నేతగా అడుగుతుంటే సరైన సమాచారం ఇవ్వరా? ట్రావెల్స్ యాజమాన్యం టీడీపీ ఎంపీకి చెందినది కాబట్టి తప్పును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. వైద్యులు రూపొందించిన రిపోర్టు కాపీలను తాను తీసుకుంటానని చెప్పారు. అప్పటికే కలెక్టర్ ఆగ్రహంతో చూస్తుండటంతో ఆ డాక్టర్ తడబడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతి నుంచి పత్రాలను తీసుకునేందుకు యత్నించారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. ‘‘ఆ పత్రాలు నేను ఉంచుకుంటాను. మూడు కాపీలు తయారు చేస్తారు కదా? మిగిలిన కాపీలు మీ వద్ద ఉంటాయి కదా’’ అని అన్నారు. తన వద్ద ఇక కాపీలు లేవని చెబుతూ డాక్టర్ వాటిని తీసుకునేందుకు మరోసారి యత్నించారు. దాంతో వైఎస్ జగన్ స్పందిస్తూ... ‘‘మీరు జిరాక్స్లు తీసుకోండి. నా వద్ద ఈ కాపీలు ఉండనివ్వండి’’ అని చెప్పారు. కానీ, కలెక్టర్ మాత్రం ఆ పత్రాలు ఇచ్చేయాలని జగన్తో చెప్పడం గమనార్హం. దీనిపై జగన్ తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతకు సమాచారం ఇవ్వరా? పత్రాలు ఇవ్వరా? నాకు అధికారులు అంటే పూర్తి గౌరవం ఉంది. పోస్టుమార్టం జరగకపోయినా జరిగినట్లు చెప్పడం, ఇలా ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం సరికాదు. బాధితులకు న్యాయం జరిగేలా వ్యవహరించకపోతే అందరూ జైలుకు వెళ్లాల్సి వస్తుంది’’ అని స్పష్టం చేశారు. నిబంధనలకు నీళ్లొదిలేశారు బస్సు ప్రమాదానికి గల కారణాలను విచారించాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ ఆదినారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. నిబంధనల ప్రకారం... ఆ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేశాడా లేదా అన్నది నిర్ధారించాలి. అందుకు మృతదేహానికి పోస్టుమార్టం చేయడం ఒక్కటే మార్గం. ఆ విషయాన్ని అధికారులు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. డ్రైవర్ మృతదేహాన్ని ప్యాక్ చేసి, ఆయన స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక బస్సులో ఉండాల్సిన రెండో డ్రైవర్ ఏమయ్యాడో పోలీసులు, అధికారులు పట్టించుకోలేదు. రెండో డ్రైవర్కు లైసెన్స్ ఉందా? అతడు కూడా తాగి ఉన్నాడా? అనే విషయాలను తెలుసునేందుకు అధికారులు ప్రయత్నించిన పాపానపోలేదు. మధ్యాహ్నం 1.45 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ కూడా అలాగే వ్యవహరించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నారా లేదా అన్నది పరిశీలించలేదు. పోస్టుమార్టం తప్పనిసరి స్పష్టం చేస్తున్న న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్, మరికొందరు మృతుల దేహాలకు పోస్టుమార్టం చేయకుండానే వారి దేహాలను తరలించే ప్రయత్నం జరిగింది. అసలు ఈ విధంగా పోస్టుమార్టం చేయకుం డా మృతదేహాలను తరలించవచ్చా అంటే అలా కుదరదని, అది చట్ట రీత్యా నేరమని న్యాయ, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రమాదాల్లో మృతుల దేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం మన దేశంలోనే కాదు.. అనేక దేశాల్లో చట్ట ప్రకారం తప్పనిసరి అని వారు చెబుతున్నారు. ముఖ్యంగా మంగళవారం జరిగిన ప్రమాదం వంటి ఘటనల్లో పోస్టుమార్టం నివేదిక అత్యంత కీలక సాక్ష్యమని, ఇది లేకుండా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు, ఇతర ప్రయోజనాలు కోరడం సాధ్య పడదని వారు చెబుతున్నారు. అందువల్ల పోస్టుమార్టం చేయకపోవడం మృతుల కుటుంబాలకు అన్యాయం చేయడమేనని తెలిపారు. ప్రమాదానికి గురైన వాహన డ్రైవర్ చనిపోతే అతని మృతదేహానికి తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలని స్పష్టంగా చెప్పారు. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో అతని పోస్టుమార్టం నివేదిక ద్వారా ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పోస్టుమార్టం బాధ్యతల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని, ఈ నివేదికలు లేకుండా చట్ట ప్రకారం ముందుకెళ్లడం సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. -
పోస్టుమార్టం చేయకుండా ప్యాకింగా..?