Natrol
-
అరబిందో ఫార్మా రికార్డు లాభాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అరబిందో ఫార్మా డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసిక నికర లాభంలో 39 శాతం వృద్ధి నమోదయ్యింది. అంతకుముందు ఏడా ది ఇదే కాలానికి రూ. 384 కోట్లుగా ఉన్న నికర లాభం ఇప్పుడు రూ. 535 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి లాభాలను నమోదు చేయడం ఇదే ప్రథమం. ఇదే సమయంలో అమ్మకాలు 10 శాతం వృద్ధితో రూ. 3,166 కోట్ల నుంచి రూ. 3,455 కోట్లకు పెరిగింది. అమెరికా కంపెనీ నాట్రోల్ని కొనుగోలు చేయడంతో ఈ ఫలితాలను గతేడాదితో పోల్చి చూడలేమని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వాటాదారులకు 70 శాతం మధ్యంతర డివిడెండ్ను బోర్డు ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుకు 70 పైసలు డివిడెండ్గా ఇవ్వాలన్న నిర్ణయానికి వాటాదారుల అనుమతి లభించాల్సి ఉంది. -
అరబిందో చేతికి అమెరికా కంపెనీ
రూ. 810 కోట్లతో నాట్రోల్ కొనుగోలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన పౌష్టికాహార ఉత్పత్తుల తయారీ సంస్థ నాట్రోల్ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. నాట్రోల్కు చెందిన ఆస్తుల స్వాధీన ప్రక్రియ పూర్తయినట్లు అరబిందో ఫార్మా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గత నెలలో నాట్రోల్ అమ్మకానికి జరిగిన బిడ్డింగ్లో రూ. 810 కోట్లు (13.25 బిలియన్ డాలర్లు) కోట్ చేయడం ద్వారా అరబిందో ఫార్మా మొదటి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కొనుగోలు ఒప్పందం ప్రకారం కంపెనీ ఆస్తులు, బ్రాండ్తో పాటు కొన్ని రుణాలు కూడా అరబిందో పరం కానున్నాయి. ఈ కంపెనీని కొనుగోలు చేయడం ద్వారా అమెరికా పౌష్టికాహార మార్కెట్లో వేగంగా విస్తరించే అవకాశం లభిస్తుందని అరబిందో ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ ఎన్.గోవిందరాజన్ తెలిపారు. -
అరబిందో ఫార్మా చేతికి అమెరికా కంపెనీ!
హైదరబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ దిగ్గజం అరబిందో ఫార్మా యూఎస్కు చెందిన పౌష్టికాహార ఉత్పత్తుల తయారీ సంస్థ నాట్రోల్ను సొంతం చేసుకోనుంది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న నాట్రోల్ కొనుగోలుకి 13.25 కోట్ల డాలర్ల(రూ. 810 కోట్లు) ఆఫర్తో గరిష్ట బిడ్డర్గా అరబిందో నిలిచింది. అమెరికాలోని అనుబంధ సంస్థ ద్వారా బిడ్డింగ్ను దాఖలు చేసింది. నాట్రోల్ కంపెనీ విక్రయానికి దివాళా సంబంధిత కేసులు చూసే అమెరికా డెలావేర్ జిల్లా కోర్టు తుది అనుమతిని మంజూరు చేయాల్సి ఉంటుంది. నాట్రోల్ ఆస్తులను సొంతం చేసుకునేందుకు వేలం విధానంలో ఉత్తమ బిడ్డర్గా నిలిచినట్లు అరబిందో ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో నాట్రోల్కు చెందిన కొన్ని రుణాలు సైతం అరబిందోకు సంక్రమించనున్నాయి. సమీకృత ఓటీసీకి చాన్స్ నాట్రోల్ కొనుగోలు ద్వారా అమెరికా తదితర అంతర్జాతీయ మార్కెట్లలో ఓటీసీ విభాగం పూర్తి స్థాయిలో పటిష్టం అవుతుందని అరబిందో పేర్కొంది. నాట్రోల్ అమెరికా, తదితర అంతర్జాతీయ మార్కెట్లకు పౌష్టికాహార ఉత్పత్తులను తయారు చేసి అందిస్తున్నదని తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలు ద్వారా అరబిందో బ్రాండ్కు మంచి గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించింది. కాగా, నాట్రోల్ కొనుగోలు వార్తలతో బీఎస్ఈలో అరబిందో షేరు 3% పుంజుకుని రూ. 1,060 వద్ద ముగిసింది.