Raja Bahadur
-
నేనెరిగిన రాజ్బహదూర్ గౌర్
హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమం నిర్మాత, తొలి తరం కమ్యూనిస్టుల్లో ఒకరు డాక్టర్ రాజ్బహదూర్ గౌర్. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన యోధుడు. 1952లో రాజ్యసభ ఏర్పడినప్పుడు తొలిసభలోనే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలినాళ్ళలో హైదరాబాద్ రాజకీయాలు, ట్రేడ్యూనియన్లతో ఆయన జీవితం పెనవేసుకుంది. అలాంటి రాజ్బహదూర్ గౌర్ గారిని మొదటిసారిగా 1978లో హైదరాబాద్లో కలిశాను. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాకుండా మంచి కవి, రచయిత. ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో పాండిత్యం కలిగిన వ్యక్తి. హైదరాబాద్లోని విద్యావంతుల కుటుం బంలో డాక్టర్ రాజ్బహదూర్ గౌర్ 1918 జూలై 21న జన్మించారు. చిన్నప్పటి నుండి చురుకైన వ్యక్తిగా ఉండేవారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉర్దూలో డాక్టర్ కోర్సు చదివారు. చదుకునే రోజుల్లోనే కామ్రేడ్స్ అసోసియేషన్, కమ్యూనిస్టు పార్టీ రాజకీయాలతో బిజీగా ఉండేవారు. కానీ తన చదువులో 2 లేదా 3 ర్యాంకులోనే ఉండేవారు. రాజ్బహదూర్ తొలితరం పార్లమెంటేరియన్. అంతకుముందు సాయుధ పోరాటంలో అనేకమార్లు అరెస్టయ్యారు. రాచకొండ గుట్టల్లో ఆయుధంతో సహా పట్టుబడటంతో ఆయనను జైళ్ళో వేశారు. ఇంతలోనే సాయుధపోరాట విరమణ జరిగిపోయి, 1952లో ఎన్నికలొచ్చాయి. సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన జైలు నుండి నామినేషన్ వేసినప్పటికీ తిరస్కరణకు గురైంది. అప్పుడు జైలు నుండి విడుదల చేసేందుకు మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జోక్యం చేసుకున్నారు. గౌర్ని విడుదల చేసేందుకు నాటి కేంద్ర మంత్రి గోపాలస్వామి అయ్యంగార్ ససేమిరా అన్నాడు. ఆయన ఆయుధంతో అడవిలో పట్టుబడిన ప్రమాదకర వ్యక్తి అన్నారు. అయితే, సర్వేపల్లి ఆయన సంగతి నీకు తెలియదని చెప్పి విడుదల చేయిం చారు. దీంతో 1952లో రాజ్యసభ ఏర్పడినప్పుడు తొలి సభ్యుల్లో ఒకరిగా హైదరాబాద్ స్టేట్ నుండి ఎన్నికయ్యారు. ఆ తరువాత రెండవసారి కూడా పెద్దల సభకు ఎన్నికయ్యారు. హైదరాబాద్ సంస్థానంలో ట్రేడ్ యూనియన్లలో రాజ్బహదూర్ గౌర్ పేరు మారుమ్రోగేది. నిజాం హయాంలోనే ఆయన అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేశారు. నిజాం రైల్వే, ఆర్టీసీ, సింగరేణి, బ్యాంకింగ్ యూనియన్లలో ఆయన కీలక పాత్ర పోషించారు. మెడికల్ శాఖలో ఆసుపత్రుల్లో పని చేస్తున్న కాంపౌండర్లు, ఏఎన్ఎం, నర్సులు తదితరులకు మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించారు. తెలంగాణలోని ప్రముఖ పరిశ్రమలు, డీబీఆర్, ఆజాం జాహీ మిల్స్ వంటి అనేక చోట్ల సంఘాలు పెట్టించారు. హైదరాబాద్లో ఉంటున్న నిరుపేదలకు నివాస స్థలాల కొరకు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేయించారు. తన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఆయన మాట ల్లోని చమత్కారం. 70 ఏళ్లు పూర్తికాగానే పార్టీ పదవుల నుంచి స్వచ్ఛం దంగా వైదొలగి, శేషజీవితమంతా పార్టీ శ్రేయోభిలాషిగా కొనసాగి, అందరి అభిమానాన్ని, మన్ననలు పొందారు. మరణానంతరం ఆయన కోరిక మేరకు నేత్రాలను, శరీరాన్ని తాను చదువుకున్న ఉస్మానియా మెడికల్ కాలేజీకి అప్పజెప్పటం ఉత్తమ మానవతా వాదానికి నిదర్శనం. అలాంటి వ్యక్తుల ఆదర్శాలను, జీవిత విశేషాలను ఈనాటి తరానికి తెలియజెప్పడానికే డా‘‘ గౌర్ శతజయంతి ఉత్సవాలను సంవత్సరం పొడవునా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర సమితి నిర్ణయించింది. సంవత్సరం పాటు చర్చాగోష్టులు, సెమినార్లు, సభలు సమావేశాలు నిర్వహించడం ద్వారా గౌర్ ఆదర్శాలను ఈనాటి సమాజానికి తెలియపర్చాల్సిన గురుతరమైన నైతిక బాధ్యత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్యూనియన్ నాయకులపై ఉందని భావిస్తున్నాం.(నేడు రాజ్బహదూర్ గౌర్ శత జయంతి) చాడ వెంకటరెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి -
వజ్రోత్సవ వెలుగులు
ఎందరో జీవితాలకు మలుపు అదే రెడ్డి మహిళా కళాశాల ఘనత రాజా బహదూర్ చొరవతో ఏర్పాటు దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిన కాలేజీ లక్షల మందికి విద్యాదానం 60 వసంతాల వేడుకలకు ముస్తాబు రేపు లోగో ఆవిష్కరణ సాక్షి, సిటీబ్యూరో: సరిగ్గా అరవై ఏళ్ల క్రితం.. సామాన్యులకు చదువు అందుబాటులో లేని రోజులవి. అప్పట్లో తెలంగాణ పల్లెలన్నీ విద్యాపరిమళానికి దూరంగా ఉన్నాయి. అలాంటి రోజుల్లో అమ్మాయిల చదువులు ఊహాతీతం. పైగా తెలుగు మాధ్యమంలో ఉన్నత చదువులు అనితరసాధ్యం. అలాం టి చీకటి రోజుల్లో విద్యాజ్యోతిని వెలిగించిన మహా ప్రదాత రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా ఆయన వెలిగించిన ఆ జ్యోతి తెలంగాణ అంతటికీ వెలుగులను విరజిమ్మింది. అరవై ఏళ్లుగా లక్షలాది మంది గ్రామీణ ప్రాంత అమ్మాయిలకు ఉన్నత విద్యను అందజేస్తోంది. ఈ కళాశాలలో చదువుకున్న ఎంతోమంది జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. రెడ్డి విమెన్స్ కాలేజీగా ప్రాచుర్యంలో ఉన్న రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి మహిళా కళాశాల (ఆర్బీవీఆర్ఆర్) అన్ని వర్గాల వారికీ విద్యను అందజేస్తోంది. వజ్రోత్సవ సంబరాలకు సన్నద్ధమైన ఆర్బీవీఆర్ఆర్పై ప్రత్యేక కథ నం. అప్పట్లోనే హైదరాబాద్ మహిళా విద్యా సంఘం... నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వంలో కొత్వాల్గా విధులు నిర్వహించి 1930లోనే పదవీ విరమణ చేసిన రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి ఆ తరువాత తన జీవిత కాలాన్ని విద్య కోసమే కేటాయించారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో ఉన్నత విద్యకు ఆద్యుడిగా నిలిచారు. 1950లో మహిళల కోసం ఏర్పడిన కోఠి విమెన్స్ కాలేజీ తప్ప మరో కళాశాల లేదు. అలాంటి సమయంలో హైదరాబాద్ మహిళా విద్యా సంఘా న్ని ఏర్పాటు చేశారాయన. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు చైర్మన్గా ఈ సంఘం ఆవిర్భవించింది. ఈ సంఘం కృషితోనే 1954లో రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి కళాశాల నారాయణగూడలో ఏర్పడింది. మొదట్లో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులుండేవి. తరువాత కళాశాల సేవలు విస్తరించాయి. గ్రాడ్యుయేషన్ కోర్సులతోపాటు పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులనూ ప్రారంభించారు. అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాల గ్రామీణ ప్రాంతాల అమ్మాయిలకు 60 శాతం సీట్లను, మిగతా 40 శాతం పట్టణ ప్రాంతాల వారికి కేటాయించారు. ఆ తరువాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజర్వేషన్లకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థినులకు అవకాశాలు పెరిగాయి. కాలేజీ విజయవంతంగా నడుస్తున్న రోజుల్లోనే అప్పటి ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి షష్టి పూర్తి సందర్భంగా వచ్చిన లక్ష రూపాయలతో విద్యార్థినులకు ఉచిత వసతి సదుపాయాన్ని ప్రారంభించారు. ఎప్పటికప్పుడు కొత్త కోర్సులతో విద్యార్థినులకు చేరువవుతున్న రెడ్డి విమెన్స్ కాలేజ్ యూజీసీ అనుబంధ నాక్ గుర్తింపును పొందింది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విద్యాసంస్థగా వెలుగొందుతోంది. ప్రస్తుతం రెండు వేల మంది డిగ్రీ కోర్సులు చేస్తుండగా, 500 మందికి పైగా పీజీ కోర్సులో చదువుతున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ వంటి కొత్త కోర్సులను ఈ కళాశాలలో ప్రారంభిస్తూ మహిళలకు ఉద్యోగ, ఉపాధికి భరోసానిస్తోంది ఈ కళాశాల. రేపు డైమండ్ జూబ్లీ లోగో ఆవిష్కరణ 1954లో ప్రారంభమైన కళాశాల 2014తో 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది పొడవునా విద్యారంగానికి సంబంధించిన అనేక అంశాలపై సదస్సులు, వర్క్షాపులు, ఇష్టాగోష్టులు నిర్వహించనున్నట్టు ఆ కళాశాల గౌరవ కార్యదర్శి తిప్పారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహిళా విద్యాసంఘం చైర్మన్, జస్టిస్ సుదర్శన్రె డ్డి ఈ సందర్భంగా వజ్రోత్సవ లోగోను ఆవిష్కరించనున్నారు.