siddaiah dead
-
పెళ్లి రోజే చివరి రోజు అయింది
-
ఎస్ఐ సిద్ధయ్య కన్నుమూత
హైదరాబాద్: విధి నిర్వహణలో ముష్కరులకు ఎదురొడ్డి నిలిచే క్రమంలో తీవ్రంగా గాయపడిన ఓ యువ పోలీసు అధికారి వీరమరణం పొందాడు. ఉగ్రవాదుల తూటాలను ఎదుర్కొని మృత్యువుతో పోరాడుతూ అమరుడయ్యాడు. సిమి ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఎల్బీ నగర్లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నల్లగొండ జిల్లా ఆత్మకూర్ (మం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య (29) మంగళవారం సాయంత్రం కన్నుమూశాడు. ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించడంతో సాయంత్రం 4 గంటల 6 నిముషాలకు మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సిద్ధయ్యకు వైద్యులు మూడు శస్త్ర చికిత్సలు నిర్వహించి రెండు బుల్లెట్లను తొలగించగా మరో రెండు బుల్లెట్లు ఆయన శరీరంలోనే ఉన్నాయి. దీంతో అతను కోలుకున్నాక మరోసారి శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగించాలని వైద్యులు భావించారు. అయితే వైద్యానికి సిద్ధయ్య శరీరం సహకరించకపోవడంతో సోమవారం ఆయన్ను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తూ వచ్చినా ఫలితం లేకపోయింది. సిద్ధయ్య మరణవార్త తెలియగానే ఆయన భార్య ధరణీషాతోపాటు ఇతర కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. సిద్ధయ్య మృతిచెందడానికి అరగంట ముందే వైద్యులు ధరణీషాకు భర్తను చూసే అవకాశం కల్పించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా ఆస్పత్రి ఫోరెన్సిక్ ప్రొఫెసర్ తకియుద్దీన్ పోస్ట్మార్టం నిర్వహించారు. పోస్ట్మార్టం అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పలువురు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధయ్య పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పించారు. పోస్ట్మార్టం అనంతరం ఆయన పార్థివదేహాన్ని మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని చింతచెరువుకు తరలించారు. కలత చెందిన సీఎం కేసీఆర్ సిద్ధయ్య మృతిపట్ల సీఎం కె.చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిద్ధయ్య తుది శ్వాస విడిచారనే సమాచారం తెలియగానే సీఎం కలత చెందారు. సిద్ధయ్యను రక్షించేం దుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం బాధాకరమన్నారు. ముష్కరులను ఎదుర్కొనేందుకు సిద్దయ్య ప్రదర్శించిన ధైర్య సాహసాలు పోలీసులకు, పౌరులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతోపాటు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సిద్ధయ్య అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కాగా, సిద్ధయ్య మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సహా పలువురు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో ఆరోగ్య మంత్రి కె.లక్ష్మారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, రాష్ట్ర డీజీ అనురాగ్ శర్మ ఉన్నారు. కాగా, సిద్దయ్య అంత్యక్రియల్లో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల, డీకే ఆరుణ, శ్రీధర్బాబు, మల్లు రవి పాల్గొననున్నారు. జడ్చర్లలో విషాద ఛాయలు.. జడ్చర్ల/చాగలమర్రి: ఎస్ఐ సిద్ధయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితం కర్నూలు జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చి స్థిరపడింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన సిద్ధయ్య కుటుంబం బాదేపల్లి ప్రభుత్వాస్పత్రి సమీపంలో నివాసముంటోంది. చిన్నతనంలోనే తండ్రి దస్తగీర్ చనిపోవడంతో తల్లి దస్తగీరమ్మ కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. కుటుంబంలో చిన్నవాడైన సిద్ధయ్య విద్యాభ్యాసం జడ్చర్లలో కొనసాగింది. గత ఏడాది జనవరి 14న అనంతపురం జిల్లా పొద్దుటూరుకు చెందిన ధరణీషాతో వివాహమైంది. 2011 బ్యాచ్ ఎస్ఐగా ఎంపికై నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆయన ప్రాణాలొదడంతో జడ్చర్లలో విషాద ఛాయలు అలముకున్నాయి. సిద్ధయ్య బిడ్డకు ఆహారనాళంలో రంధ్రం.. ఎస్ఐ సిద్ధయ్య చికిత్స పొందిన కామినేని ఆస్పత్రిలోనే ఆయన భార్య మగబిడ్డకు జన్మనివ్వగా ప్రస్తుతం ఆ బిడ్డకు ఆహారనాళంలో రంద్రం ఏర్పడటంతో మెరుగైన వైద్యం నిమిత్తం ఆ శివువును మంగళవారం బంజారాహిల్స్లోని రెయిన్బో ఆసుపత్రికి తరలించారు. బిడ్డ అనారోగ్యం గురించి మూడు రోజులుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కామినేని ఆస్పత్రి వర్గాలు నిర్లక్ష్యం వహించాయని బంధువులు ఆరోపిస్తున్నారు. రెయిన్బో ఆసుపత్రి వైద్యులు బిడ్డకు శస్త్ర చికిత్స చేయాలని తెలిపారన్నారు. వైద్యుల వైఫల్యం వల్లే... బంధువుల ఆరోపణ మెరుగైన చికిత్స అందించడంలో కామినేని వైద్యుల వైఫల్యం వల్లే సిద్ధయ్య మృతి చెందాడని పలువురు బంధువులు ఆరోపించారు. స్పెషలిస్టులను పిలిపించి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పిన వైద్యులు ఎవరినీ పిలిపించలేదన్నారు. తాము ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించుకుంటామన్నా ఆసుపత్రి వర్గాలు అంగీకరించలేదన్నారు. ఎలాంటి చికిత్స అందిస్తున్నారో తమకు సమాచారం ఇవ్వకుండా, తమను చూడనివ్వకుండా సిబ్బందితోనే సమాచారం అందజేశారని ఆరోపించారు. సిద్ధయ్యకు మెరుగైన వైద్యం అందిస్తామంటూ హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ఆచరణలో మాత్రం చూపలేదని విమర్శించారు. భార్యకు ప్రసవం కానున్న నేపథ్యంలో సెలవు కావాలని తన అల్లుడు అడిగినా సీఐ బాలగంగిరెడ్డి సెలవు ఇవ్వకుండా డ్యూటీ చేయాలని బలవంతం చేశారని సిద్ధయ్య అత్త హసీనా ఆరోపించారు. -
విషాదంలో జడ్చర్ల
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం విషాదంలో మునిగింది. ఈ నెల 4వ తేదీన నల్లగొండ జిల్లా జానకిపురంలో జరిగిన ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన జడ్చర్లకు చెందిన ఎస్ఐ సిద్ధయ్య మంగళవారం ఆస్పత్రిలో మరణించారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చింతలచెర్వు గ్రామం నుంచి సిద్దయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు వచ్చి స్థిరపడింది. చిన్నతనంలోనే తండ్రి దస్తగీర్ చనిపోవడంతో ఆయన తల్లి దస్తగీరమ్మ కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. పెద్ద కుమారుడు పెద్దమాబాష సొంత ఊరైన చింతలచెరువులో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే ఉంటున్నాడు. రెండో కుమారుడు దస్తగీర్ జడ్చర్లలో వెండి ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. వీరితో పాటు సిద్ధయ్యకి సోదరి ఉన్నారు. కుటుంబంలో చిన్నవాడైన సిద్ధయ్య విద్యాభ్యాసం జడ్చర్లలో కొనసాగింది. 1నుంచి 10వ తరగతి వరకు స్థానిక ఆదర్శ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ విశ్వవికాస్, డిగ్రీ బీఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో చదివినట్లు ఆయన మిత్రులు తెలిపారు. గత ఏడాది కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన ధరణీషతో వివాహమైంది. 2012-13 బ్యాచ్లో గ్రూప్-1 ద్వారా ఎస్ఐగా ఎంపికై నల్లగొండ జిల్లా ఆత్మకూర్(ఎం) ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడిన ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలొదిలారు. ఎస్ఐ సిద్ధయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడవడంతో జడ్చర్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. (జడ్చర్ల) -
మృత్యువుతో పోరాడి ఓడిన ఎస్ఐ సిద్ధయ్య
-
ధైర్యవంతుడైన అధికారిని కోల్పోయాం- వైఎస్ జగన్
హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఒక ధైర్యవంతుడైన పోలీసు అధికారిని కోల్పోయామని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మరణించారు. నాలుగు రోజులుగా ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేసినా ఫలితం లేకపోయింది. -
పెళ్లి రోజే ప్రాణాలు కోల్పోయాడు
హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య మరణం వారి కుటుంబంలో అంతులేని విషాదాన్నినింపింది. నల్గొండ జిల్లా జానకీపురంలో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం తుది శ్వాస విడిచారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు ఆయన పెళ్లి చేసుకున్నారు. శనివారం కాల్పుల్లో గాయపడిన సిద్ధయ్యను ఆస్పత్రికి తరలించాకా.. అదే రోజు రాత్రి ఆయన భార్య ధరణి మగబిడ్డకు జన్మనిచ్చారు. సిద్ధయ్య చికిత్స పొందుతున్న కామినేని ఆస్పత్రిలోనే ఆమె ప్రసవించారు. ఆ సమయంలో సిద్ధయ్య మృత్యువుతో పోరాడుతున్నారు. తాను తండ్రయ్యానన్న విషయం తెలుసుకోకుండానే.. బిడ్డను చూడకుండానే.. పెళ్లయిన ఏడాదికే సిద్ధయ్య మరణించడం.. అందర్నీ కలచివేసింది. -
సిద్ధయ్యది వీరమరణం: కేసీఆర్
హైదరాబాద్: ఎస్ఐ సిద్ధయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్ధయ్య కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. సిద్ధయ్య ప్రాణాలకు తెగించి పోరాడారని, ఆయనది వీరమరణమని కేసీఆర్ నివాళులు అర్పించారు. పోలీసుల అంకితభావానికి సిద్ధయ్య ప్రతీకని కేసీఆర్ పేర్కొన్నారు. నల్గొండ జిల్లా జానకీపురంలో శనివారం ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సిద్ధయ్య మంగళవారం సాయంత్రం మరణించారు. నాలుగు రోజులుగా ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు కృషి చేసినా ఫలితం లేకపోయింది. -
ఓ వైపు జననం.. మరోవైపు మరణం
హైదరాబాద్: కలలు కన్న ఉద్యోగం వచ్చింది. ఎన్నో ఆశలతో ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. పాపం.. ఆయన బతికున్నా తండ్రయ్యానన్ని విషయం తెలుసుకోలేకపోయారు. తన భార్య ప్రసవించిన ఆస్పత్రిలోనే.. అదే సయమంలో మృత్యువుతో పోరాడుతున్నారు. చివరకు తన బిడ్డను చూడకుండానే ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్లిపోయారు. ఉగ్రవాద కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కామనేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించిన ఎస్ఐ సిద్ధయ్య జీవితం ఇలా విషాదాంతమైంది. శనివారం నల్గొండ జిల్లా జానకీపురంలో జరిగిన ఎన్కౌంటర్లో సిద్ధయ్య తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. కామినేని ఆస్పత్రిలో నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ఈ రోజు మరణించారు. సిద్ధయ్య మరణించిన కామినేని ఆస్పత్రిలోనే ఆయన భార్య ధరణి శనివారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భర్త ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా.. ఆమె ప్రసవించింది. వాస్తవానికి ఆమె మరో 10 రోజులకు ప్రసవించాల్సి ఉంది. కానీ భర్త పరిస్థితితో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఉగ్రవాదులు కాల్పుల్లో భర్త తీవ్రంగా గాయపడిన రోజు పురిటినొప్పులు రావడంతో.. సిద్ధయ్య చికిత్స పొందుతున్న ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రిలోనే డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన చెందిన సిద్ధయ్య కుటుంబం 20 ఏళ్ల క్రితమే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో స్థిరపడింది. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన సిద్ధయ్య స్నేహితుల ప్రోత్సాహంతో పోలీసు ఉద్యోగంలో చేరారు. 2011బ్యాచ్కు చెందిన ఆయనకు ఏడాది క్రితమే ధరణితో వివాహమైంది. సిద్దయ్యకు ఇద్దరు అన్నలు ఉన్నారు. -
మృత్యువుతో పోరాడి ఓడిన ఎస్ఐ సిద్ధయ్య
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా జానకిపురంలో ముష్కరులతో పోరాడిన... ఆత్మకూర్(ఎం) ఎస్ఐ జూలూరి సిద్ధయ్య (29) మృత్యువుతో పోరాడి ఓడారు. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ఎల్బీనగర్ లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం మృతి చెందారు. సిద్ధయ్య మృతి చెందినట్లు కామినేని వైద్యులు వెల్లడించారు. దాంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మరోవైపు సిద్ధయ్య మరణవార్త విని నల్లొండ జిల్లా పోలీసులను కూడా కలచివేసింది. కాగా దుండగుల కాల్పుల్లో సిద్ధయ్య శరీరంలో 4 బుల్లెట్లు దూసుకు పోయిన విషయం తెలిసిందే. దాంతో 10 మందితో కూడిన వైద్య బృందం ఇప్పటి వరకు ఆయనకు 3 శస్త్రచికిత్సలు చేసింది. సుమారు 8 గంటల పాటు శ్రమించి ఎడమ చెవి వెనుక భాగం నుంచి మెదడు వరకు దూసుకపోయిన ఒక బుల్లెట్ ను, ఛాతీకి ఎడమవైపు నుంచి భుజం వైపు దూసుకుపోయిన మరో బుల్లెట్ను తొలగించారు. అలాగే, పొత్తి కడుపును పూర్తిగా ఓపెన్ చేసి ఇన్ఫెక్షన్ సోకిన భాగాలను శుభ్రం చేసినా, కడుపులోని బుల్లెట్ వల్ల ప్రా ణానికి ప్రమాదం లేక పోవడంతో దాన్ని అలాగే వదిలేశారు. శరీరం శస్త్రచికిత్సకు సహకరించకపోవడంతో చిన్న మెదడులోకి దూసుకపోయిన మరో బుల్లెట్ను కూడా వదిలేశారు.