Sukhdev Thapar
-
భగత్సింగ్ బాంబులు చేసిన గది ఎక్కడుంది?
-
భగత్సింగ్ బాంబులు చేసిన గది ఎక్కడుంది?
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో.. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా 1928లో శాంతియుతంగా ఉద్యమిస్తున్న లాలా లజపతి రాయ్.. బ్రిటిష్ పోలీసుల దాడిలో మరణించారు. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ) అనే విప్లవ సంస్థ నాయకుడు. విప్లవ కార్యకలాపాలకు అవసరమైన బాంబులు, ఆయుధాలు తయారు చేయడానికి లాహోర్లో, సహరాన్పూర్లో రెండు బాంబు తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. లాహోర్లోని ఆ స్థావరం 69వ నంబర్ గది. దానిని యువ విప్లవకారులు సురక్షితమైన రహస్య స్థావరంగా ఉపయోగించుకునేవారు. లాలా మృతికి కారణమైన జేమ్స్ స్కాట్ను హతమార్చాలని ప్రణాళిక పన్నిన ఆ విప్లవకారుడు 1928 డిసెంబర్లో లాహోర్ పోలీస్ సూపరింటెండెంట్ జాన్ సాండర్స్ ను కాల్చడంతో అతడు చనిపోయాడు. అనంతరం ఆ విప్లవకారుడు అతడి సహచరులు లాహోర్లోని 69వ నంబర్ గదిలో కలుసుకుని లాహోర్ నుంచి తప్పించుకుని కలకత్తా వెళ్లిపోయారు. భగత్సింగ్ను, ఆయన సహచరులను పట్టుకోవడానికి బ్రిటిష్ పాలకులు ఎంతగా ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. ఢిల్లీ అసెంబ్లీలో బాంబు పేల్చి స్వయంగా పోలీసులకు అరెస్టయితే కానీ వారి ఆచూకీని కనిపెట్టలేకపోయారు. ఆ యువకుడు భగత్సింగ్. అనంతరం జరిగిన కథ అందరికీ తెలిసిందే. కానీ.. లాహోర్లో భగత్సింగ్ ఉపయోగించిన 69వ నంబర్ గది ఇప్పుడు ఎక్కడ ఉంది? భగత్సింగ్ పట్టుబడ్డ తర్వాత ఏమైంది? ఆ గదిని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ క్రియాశీల కార్యకర్త దుర్గాదేవి పేరు మీద అద్దెకు తీసుకున్నారు. ఆమె తన భర్త భగవతి చరణ్ వోహ్రా, కుమారుడు సచీంద్ర వోహ్రాతో కలిసి అక్కడ నివసించేవారు. భగవతి చరణ్ వోహ్రా కూడా విప్లవ సంస్థ నాయకుడే. భగత్సింగ్తో కలిసి వారిద్దరూ కూడా కలకత్తా వచ్చారు. కొంత కాలం తర్వాత దుర్గాదేవి లాహోర్లోని 69వ నంబర్ గదికి తిరిగివెళ్లారు. ఆమె భర్త వోహ్రా కూడా కలకత్తాలో ఉన్నపుడు బాంబు తయారు చేసే మెళకువలు నేర్చుకుని వచ్చారు. ఆ గదిలో యువ విప్లవకారుల విప్లవ కార్యక్రమాలు కొనసాగాయి. బాంబుల తయారీ కొనసాగింది. ప్రఖ్యాత సంగీతకారుడు ఖ్వాజా ఖుర్షీద్ అన్వర్ కూడా ఈ బృందంలో సభ్యుడు. ఆయన తన కాలేజీ లాబొరేటరీ నుంచి రసాయనాలు తస్కరించి తెస్తే.. వాటిని బాంబుల తయారీకి ఉపయోగించేవారు. కానీ కొంత కాలానికి లాహోర్లోని బాంబు తయారీ కేంద్రాన్ని కూడా బ్రిటిష్ పాలకులు కనుగొన్నారు. సుఖ్దేవ్ సహా అతడి అనుచరులు చాలా మందిని అరెస్ట్ చేశారు. అయితే.. భగవతి చరణ్ వోహ్రా బాంబులు తయారు చేయడం కొనసాగించాడు. 1929 డిసెంబర్ 23న ఢిల్లీ – ఆగ్రా రైల్వే లైన్లో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలు లక్ష్యంగా బాంబు పేల్చాడు. అయితే లార్డ్ ఇర్విన్తో పాటు అదే రైలులో ప్రయాణిస్తున్న మహాత్మా గాంధీ కూడా ఆ పేలుడు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం 1930 మే 28వ తేదీన రావీ నది ఒడ్డున అటవీ ప్రాంతంలో భగత్సింగ్ ఆయన సహచరులను పోలీసుల చెర నుంచి తప్పించేందుకు బాంబు దాడి చేయాలని వోహ్రా ప్రణాళిక రచించారు. కానీ ఆ క్రమంలో బాంబు ప్రమాదవశాత్తూ ముందే పేలడంతో ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఇక ఆ 69వ నంబర్ గది! అది లాహోర్ లోని మెక్లియాడ్ రోడ్లో గల కశ్మీర్ బిల్డింగ్ ఆవరణలో ఉండేది. దేశ విభజన అనంతరం లాహోర్ సహా పాకిస్తాన్ వేరే దేశమైంది. కశ్మీర్ బిల్డింగ్ని 1952లో ఒక హోటల్గా మార్చారు. 1988లో ఆ బిల్డింగ్ని కూల్చేసి ఆ ప్రదేశంలో షాపింగ్ ప్లాజా, హోటల్ కట్టారు. ఇది ప్రముఖ లక్ష్మీ చౌక్ సమీపంలో ఉంది. ఈ హోటల్ పేరు ఇప్పుడు చాలా ప్రఖ్యాతి గాంచింది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
భగత్సింగ్ అమరత్వానికి అపచారం!
న్యూఢిల్లీ: దేశమాత దాస్యశృంఖలాలను బద్ధలు కొట్టడానికి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి, చిరునవ్వుతో ఉరికొయ్యకు వేలాడిన స్వాతంత్య్ర యువకిశోరం భగత్సింగ్ బలిదానానికి ఘోర అపచారం! ఆ ధీరుడి అమరత్వానికి చరిత్రపుటల్లో శాశ్వత స్థానం దక్కినా అధికార పత్రాల్లో మాత్రం చోటు దక్కలేదు..! ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఆ అపురూపమైన ఆత్మత్యాగం ప్రభుత్వ రికార్డుల్లో కాసింత చోటుకు నోచుకోలేదు. భగత్సింగ్ను అమరవీరుడిగా ప్రకటించారో లేదో చెప్పే రికార్డులేవీ తమ వద్ద లేవని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేతులెత్తేసింది. భగత్ను, ఆయన సహచరులైన రాజ్గురు, సుఖ్దేవ్లను ఎప్పుడు అమరులుగా ప్రకటించారో వెల్లడించాలని భగత్ సమీప బంధువు యాదవేంద్ర సింగ్ ఏప్రిల్లో హోం శాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులో కోరారు. ఆ ముగ్గురిని అమరులుగా ప్రకటించకపోయినట్లయితే, ఎందుకు ప్రకటించలేదో బయటపెట్టాలని, ఆ గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని అడిగారు. దీనికి హోం శాఖ ప్రజా సంబంధాల అధికారి శ్యామలాల్ మోహన్ మే నెలలో దిగ్భ్రాంతికరమైన సమాధానమిచ్చారు . ‘భగత్, రాజ్గురు, సుఖ్దేవ్లను అమరవీరులుగా ప్రకటించినట్లు చెప్పే రికార్డులేవీ మా శాఖ వద్ద లేవు. వారికి ఆ గౌరవం కల్పించే విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో కూడా తెలియదు’ అని సెలవిచ్చారు. దీంతో యాదవేంద్ర తదుపరి కార్యాచరణ కోసం హోం శాఖ కార్యదర్శిని సంప్రదించేందుకు అపాయింట్మెంట్ కోరారు. అధికారులు సానుకూలంగా స్పందించకపోవడంతో ఆయన రాష్ట్రపతిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘భగత్కు అమరుడి గౌరవం కల్పించే విషయంలో రాష్ట్రపతి కూడా సానుకూలంగా స్పందించకపోతే దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభిస్తా’ అని యాదవేంద్ర చెప్పారు. స్వాతంత్రోద్యమంలో అసువులు బాసిన వారిని అమరులుగా ప్రకటించే విధానమేదీ లేదని హోం శాఖ వర్గాలు చెప్పాయి. రక్షణ శాఖ సైనికులకు మాత్రమే ఆ హోదా ఇస్తుందన్నాయి. వివాదం వద్దు... ప్రధాని: భగత్ అమరత్వానికి రికార్డులు ఆధారం కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఈ అంశంపై వివాదాన్ని రేపకూడదని కోరారు. ‘భగత్ స్వాతంత్య్రమనే మహత్తర లక్ష్యం కోసం అమరుడయ్యారు. ఆయన అమరత్వానికి అధికార రికార్డులు ఆధారం కాదు. భగత్ జాతికి గర్వకారణం. ఆయనకు దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది.’ అని ఓ ప్రకటనలో తెలిపారు.