‘హలో.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించండి’ | - | Sakshi
Sakshi News home page

‘హలో.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించండి’

Published Fri, Mar 14 2025 2:02 AM | Last Updated on Fri, Mar 14 2025 1:57 AM

‘హలో.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించండి’

‘హలో.. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించండి’

కై లాస్‌నగర్‌: లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియను ఈ నెల 31లోపు పూర్తి చేయాలనే ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు. గడువులోపు చెల్లిస్తే ఫీజులో 25శాతం రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దరఖాస్తుదారులకు అవగాహన కల్పిస్తున్నారు. స్వయంగా వారికి ఫోన్‌ చేసి ఫీజు చెల్లించాలని కోరుతున్నారు. బల్దియా వార్డు ఆఫీసర్లకు ఈ బాధ్యతలు అప్పగించగా, వారు రెండు రోజులుగా అదే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దరఖాస్తుదారులకు ఫోన్‌ చేసి ప్లాట్లు రెగ్యులరైజ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలని చైతన్యపరుస్తున్నారు.

వార్డు ఆఫీసర్లకు బాధ్యతలు

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నాలు గేళ్లుగా పెండింగ్‌లో ఉంది. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసేదిశగా చర్యలు చేపట్టింది. అక్రమ లేఅవుట్లలోని పది శాతం ప్లాట్లను అమ్ముకుని, అమ్ముడుపోకుండా మిగిలినవాటన్నింటికి ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. గతంలో దరఖాస్తు చేసుకోనివారికి కూడా అ వకాశం కల్పించింది. 25శాతం రిబేట్‌ కూడా ప్రకటించడంతో అధికారులు రెగ్యులర్‌గా ఎల్‌ఆర్‌ఎస్‌పై సమీక్షిస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు బల్దియా, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి 14,580 దరఖాస్తులను ఆమోదించారు. వారంతా ఫీజు చెల్లించేలా చూడాలని 30 మంది బల్దియా వార్డు ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగించారు. ఒక్కొక్కరికి 500 దరఖాస్తులు ఇచ్చి వాటి యజమానులు ఫీజు చెల్లించేలా చూడాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన వార్డు ఆఫీసర్లు రెండు రోజులుగా కౌన్సిల్‌ సమావేశ మందిరం నుంచి దరఖాస్తుదారులకు ఫోన్లు చేస్తున్నారు. కాగా, వందకు పైగా దరఖాస్తులు ఎల్‌టీపీలు, మీ సేవ కేంద్రాల నిర్వాహకుల పేరిట ఉన్నట్లు తెలిసింది. దీంతో చేసినవారికే పదేపదే ఫోన్లు చేయాల్సి వస్తోందని, ఇప్పటికే కొందరు ప్లాట్లు అమ్ముకున్నట్లు సమాధానామిస్తున్నారని, మరికొందరికి ఫోన్లు కలవడంలేదని వార్డు ఆఫీసర్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు 370 మందే..

బల్దియా అధికారుల ఫోన్లకు దరఖాస్తుదారులు స్పందిస్తున్నారు. తమ ప్లాట్లను రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. బల్దియా కార్యాలయానికి వచ్చి సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. దీంతో పట్టణ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం సందడిగా మారుతోంది. ఇప్పటివరకు 370 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించారు. ఈ లెక్కన బల్దియాకు రూ.కోటి వరకు ఆదా యం సమకూరినట్లు సమాచారం. చెల్లింపు గడువు ఇంకా 16 రోజులు ఉండగా మిగతా 14 వేల దరఖాస్తుదారుల్లో ఎంతమంది ఫీజు చెల్లిస్తారోననే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దిగువ, మధ్యతరగతి వారితో పాటు కూలీ పనులు చేసుకునేవారూ తక్కువ ధరలో చిన్నపాటి ప్లాట్లు కొన్నవారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారు చేతిలో డబ్బుల్లేక ఆవేదనకు గురవుతున్నారు.

31లోపు చెల్లించి రాయితీ పొందండి

దరఖాస్తుదారులకు అధికారుల ఫోన్లు

ఫీజు వసూళ్లలో వార్డు ఆఫీసర్లు బిజీ

సందడి సందడిగా మున్సిపల్‌ ఆఫీస్‌

గడువులోపు ప్రక్రియ పూర్తయ్యేనా..?

ముందుకు వస్తున్నారు

అక్రమ లేఅవుట్లలోని ప్లాట్లను ఈ నెల 31లోపు ఫీజు చెల్లించి రెగ్యులరైజ్‌ చేసుకునేవారికి ప్రభుత్వం 25శాతం రాయితీ ఇస్తోంది. దీనిని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించేందుకు ముందుకువస్తున్నారు.

– నవీన్‌కుమార్‌,

బల్దియా టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement