
విలేకరులతో మాట్లాడుతున్న అక్బర్బాషా, కుటుంబ సభ్యులు
కడప రూరల్: పదేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న మా భూమిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 48 గంటల్లో ఇప్పించారని, ఆయన తమ కుటుంబానికి దేవుడి కంటే ఎక్కువ అని వైఎస్సార్ జిల్లా దవ్వూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన అక్బర్బాషా, ఇతని భార్య అఫ్సానా, సోదరుడు ఎంఏ అజీబ్లు అన్నారు. ఆదివారం సాయంత్రం వారు కడపలోని వైఎస్సార్ స్మారక ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం రాత్రి తాను ఫేస్బుక్లో పెట్టిన వీడియోకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎంఓ కార్యాలయం స్పందించిన తీరు అద్భుతమని అక్బర్ బాషా పేర్కొన్నారు. జిల్లా అధికారులు.. పార్టీ నేతలతో మాట్లాడి న్యాయం చేశారన్నారు.
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్రెడ్డి, కడప నగర మేయర్ సురేష్బాబు, వరికూటి ఓబుల్రెడ్డి అందరినీ సమన్వయం చేసి ఎలాంటి షరతులు లేకుండా తమ భూమి తమకు వచ్చేలా చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీల నాయకులు, మత పెద్దలు, మీడియాకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోణంలో చూసి దీన్ని రాద్ధాంతం చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. తాను తిరుపాల్రెడ్డిపై ఆరోపణలు చేసినప్పటికీ, ఆయన పెద్ద మనసుతో స్పందించి తనకు న్యాయం చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment