
మంగళవారం నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించేలా ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణలోని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, మన రాష్ట్రంలోని విద్యాసంస్థలను ఈ నెల 15 నుంచి ఒంటిపూట నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో ఆరేళ్లలోపు చిన్నారులు ఉండే అంగన్వాడీ కేంద్రాలను రెండు పూటలా నిర్వహిస్తుండటంతో పిల్లల ఇబ్బందులపై ‘అంగన్వేడీ’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది.
మొదట ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం... ‘సాక్షి’ కథనంతో స్పందించి మంగళవారం నుంచే అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అంగన్వాడీ కేంద్రాలను మంగళవారం నుంచి మే 31వ తేదీ వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించేలా అన్ని జిల్లాల అధికారులు, అంగన్వాడీ టీచర్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపించారు.
అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు మే 1 నుంచి 15 వరకు, ఆయాలకు మే 16 నుంచి 31వ తేదీ వరకు 15 రోజులు చొప్పున సెలవులు ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment