
సాక్షి, అమరావతి: జిల్లాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాలను జిల్లాల కలెక్టర్లు సోమవారం ప్రకటించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదు ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారిని ఓటర్గా నమోదు చేసేందుకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ల జాబితాలో పేరులేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. డిసెంబర్ 15 వరకు ఓటర్గా నమోదుకు లేదా అభ్యంతరాలకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఈ నెల 28, 29 తేదీల్లో, డిసెంబర్ 12, 13 తేదీల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. ఓటర్లుగా చేరేందుకు, ఏదైనా మార్పులు, చేర్పులున్నా బూత్ స్థాయి ఆఫీసర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను, అభ్యంతరాలను వచ్చే ఏడాది జనవరి 5 నాటికి పరిష్కరిస్తారు. జనవరి 14న తుది ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయో, లేదో సరిచూసుకుని జనవరి 15న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు.
ప్రస్తుత ముసాయిదా జాబితాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఓటర్లు
ఖాళీలను భర్తీ చేయండి
ఖాళీగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, వీఆర్వో, వీఆర్ఏ, పంచాయతీ కార్యదర్శులు, బూత్ స్థాయి ఆఫీసర్ల పోస్టులను తక్షణం భర్తీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకుని.. ఇంకా ఖాళీలుంటే ఆ వివరాలతో నివేదిక పంపించాలని కోరారు.
రాష్ట్రంలో తాజా ఓటర్ల సంఖ్య ఇలా