
సభను ఎలాగైనా అడ్డుకోవాలనుకున్న ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నాలకు చెక్ పెట్టేలా..
సాక్షి, అమరావతి: వర్షాకాల సమావేశాలు మొదలైన వెంటనే.. సభను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అచ్చెన్నాయుడికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మీరు ఏం అంశం కావాలన్నా చర్చకు మేం రెడీ. సభలో చర్చకు సహకరిస్తారా? లేదా?. మీరు కోరే ప్రతీ అంశంపైనా చర్చిస్తాం. అవసరమైతే ఈఎస్ఐ స్కాంపైనా చర్చిద్దాం. రాజధానిది కావాలంటే అది కూడా చర్చ పెడదాం. సభ నిర్వహణను మాత్రం అడ్డుకోవద్దని అచ్చెన్నాయుడితో సీఎం జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.
చర్చకు సహకరించకుండా గొడవ చేయడం సమంజసం కాదని టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు బీఏసీలో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీఎంను ఏదైనా అంటే ఊరుకునేది లేదని, చంద్రబాబే రెచ్చగొట్టి ఎమ్మెల్యేలను గొడవకు పంపిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.