
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. పండుగ తరువాత డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. విశాఖ ఎయిర్పోర్టులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగాల భర్తీ, విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామన్నారు.
సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఏ హామీలిచ్చారో వాటన్నింటినీ తూచా తప్పకుండా అమలుచేశారని ఆయన గుర్తుచేశారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజల సమస్యలను అతి దగ్గరగా చూసి వాటిని వంద శాతం అమలుచేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు సృష్టించారన్నారు. మహానేత వైఎస్సార్ హయాంలో ఏపీ అభివృద్ధి బాటపడితే.. ఇప్పుడాయన తనయుడు జగన్ హయాంలో అంతకు రెట్టింపు అభివృద్ధి, సంక్షేమం ఏపీలో జరిగిందన్నారు.
మూడు నెలల క్రితమే వివరాల సేకరణ
మరోవైపు.. అన్ని జిల్లాల్లోను వివిధ మేనేజ్మెంట్లలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను అందించాలని మూడునెలల క్రితమే డీఈఓలు, ఆర్జేడీలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేసి, వివరాలు సేకరించింది. డైరెక్ట్ నియామకాలకు అనుగుణంగా పోస్టుల రోస్టర్ రిజిస్టర్లతో సహా సమగ్ర సమాచారాన్ని డీఎస్సీ నోటిఫికేషన్ సూచించిన ప్రొఫార్మాలో తీసుకున్నారు. అన్ని అంశాలను క్రోడీకరించి, ఖాళీల ఆధారంగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది.
డీఎస్సీ ప్రకటన హర్షణీయం..
ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుండటంపై ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్కుమార్ శనివారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. నిరుద్యోగుల ఎదురుచూపులకు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన ఎంతో ఊరటనిచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment