
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా సబ్కలెక్టర్ కేతన్ గార్గ్ను ఈసీ నియమించింది. నోటిఫికేషన్ విడుదల కావడంతో జిల్లా వాప్యంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అక్టోబర్ నెల 8 తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు. 11న నామినేషన్ల పరిశీలన ఉండగా 13న ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కోవిడ్ నిబంధనల అమలు నేపథ్యంలో బహిరంగ సభకు 1,000 మందికి మించి అనుమతించబోమని ఎన్నికల అధికారులు తెలిపారు.
బద్వేలు పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు... 2,12,739 మంది ఓటర్లు
బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో జనవరి, 2011వ తేదీ నాటికి 2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,06,650 మందికాగా 1,06,069 మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు. తాజాగా కొత్త ఓటర్ల జాబితా వెలువడనుంది. ఆమేరకు ఉప ఎన్నిక జరగనుంది.