
మంగళగిరి: సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించాలని.. అప్పుడే నిజాలు బయటకు వస్తాయని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత తెలిపారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో తీవ్రత ఉంది కాబట్టే ఆయనకు బెయిల్ రావడం లేదని స్పష్టంచేశారు. మంగళగిరిలోని ఆరో ఏపీ ఎస్పీ బెటాలియన్లో మంగళవారం జరిగిన జాగిలాల ప్రదర్శనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంమంత్రి మాట్లాడుతూ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెబుతున్న ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు.. బాబు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారని గుర్తు చేశారు.
చంద్రబాబును మోయడం తప్ప పవన్ కళ్యాణ్కు మరే ఎజెండా లేదన్నారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, ఏపీఎస్పీ బెటాలియన్ ఆవరణలో 21వ జాగిలాల ప్రదర్శనలు నిర్వహించారు. అధికారుల శిక్షణలో ప్రతిభ కనబరిచిన పలు జాగిలాలు, వాటి శిక్షకులకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలను అందజేశారు.