
సాక్షి, న్యూఢిల్లీ : రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టుగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్ర ఓడరేవులు, పోర్టులశాఖ సహాయ మంత్రి మనసుఖ్ మాండవీయను మంత్రి గౌతమ్ రెడ్డి గురువారం కలిశారు. ఆయన వెంట రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా కూడా ఉన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి ఇచ్చిన హామీలను మంత్రి మేకపాటి వివరించారు. నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి 50 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అదే విధంగా సాగరమాల కింద ఆగిపోయిన ప్రాజెక్టులకు వెంటనే నిధులు ఇస్తామన్నట్లు తెలిపారు.
భీమిలి, కాకినాడలో ప్యాసింజర్ జెట్టీలకు ప్రారంభం చేస్తామన్నారని, మేడ్టెక్ జోన్ల ఎమ్ఆర్ఏ సెంటర్ ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పినట్లు తెలిపారు. మేజర్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అంచనా వ్యయంలో 50 శాతం రామాయపట్నం మేజర్ పోర్ట్గా తీసుకోవాలని కోరారని, దానికి పారిశ్రామిక భూమి కూడా ఉన్నట్లు తెలిపారు. పోర్టు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఉండాలని ప్రధాని సైతం అన్నట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దాన్ని ఎస్ఈజెడ్గా మారుస్తారన్నారు. ఫిసిబిలిటి స్టడీ ఆధారంగా భావనపాడు, రామాయపట్నంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పినట్లు తెలిపారు. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దీనికి వంద శాతం నిధులు సమకూరుస్తుందని భరోసా ఇచ్చారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment