
సాక్షి, అమరావతి: బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ అధ్యక్షతన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో బీసీలు గర్వంగా తలెత్తుకొని తిరిగేలా వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. బీసీలు కుల వృత్తులకే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రభుత్వం తగిన సహకారమందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని అర్థం చేసుకుని.. క్షేత్రస్థాయిలో చైతన్యం కల్పించాలని సూచించారు. సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.