
సాక్షి, అమరావతి: అర్హత ఉన్న ఎవరికీ పింఛను తొలగించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంగా తెలియజేశారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో బుధవారం విప్ల సమావేశం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హత ఉన్న ఎవరి పింఛనూ తీసేయదని స్పష్టం చేశారు.
టీడీపీ హయంలో కేవలం 39 లక్షల మందికే పింఛన్లు అందేవన్నారు. అదీ రూ.350 కోట్లు మాత్రమే అందజేసేవారని, ఈ ప్రభుత్వం 61 లక్షల మందికి రూ.1,400 కోట్లు పింఛన్ల రూపంలో అందిస్తోందన్నారు. ఒక వేళ అనర్హత ఉండి తీసేయాలన్నా వారికి నోటీసు ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాతే తీసి వేయాలని సీఎం జగన్ సూచించారన్నారు.