
విజయనగరం టౌన్: ప్రముఖ సాహితీవేత్త, నటుడు, దర్శకుడు, 28 నంది బహుమతులు అందుకున్న డాక్టర్ మీగడ రామలింగస్వావిుకి మహాకవి గురజాడ విశిష్ట పురస్కారాన్ని విజయనగరం ఆనందగజపతి కళాక్షేత్రంలో శనివారం ప్రదానం చేశారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ ఈ పురస్కారాన్ని అందించారు. పురస్కార గ్రహీత మీగడ మాట్లాడుతూ దేశ, విదేశాల్లో ఎన్నో అవార్డులు పొందినప్పటికీ గురజాడ విశిష్ట పురస్కారం ఎప్పుడు వరిస్తుందా? అని ఎదురుచూశానన్నారు.
మహాకవిని స్మరిస్తూ ఆయన రచనలను వర్ణించారు. ఎన్.వి.రమణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు జరగలేదని, అమరావతిలో తెలుగు భాషా సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కోరారు. మీగడ రామలింగస్వామిని ఘనంగా సత్కరించి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం, సాయి ఫౌండేషన్ తరఫున డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి రూ.30వేల బహుమతి అందజేశారు. సమాఖ్య ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, డాక్టర్ ఎ.గోపాలరావు, తదితరులు ముఖ్యఅతిథి జస్టిస్ ఎన్.వి.రమణ దంపతులను సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment