
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు తూర్పు మధ్య బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ. నుంచి 5.8 కి.మీ. ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఆ తరువాత 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారనుందని పేర్కొంది. దీని ప్రభావంతో రెండు రోజులపాటు (సోమ, మంగళవారాల్లో) కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా ఈ నెల 20న కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ, వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు 19 నుంచి 22 వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. గడచిన 24 గంటల్లో కారంచేడు, చీమకుర్తిలో 4 సెం.మీ., శ్రీశైలం, భీమడోలు, నర్సాపురం, యానాంలో 3, అమలాపురం, చింతలపూడి, వింజమూరు, తణుకులో 2 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment