
సాక్షి, అమరావతి: మంగళగిరి మునిసిపాలిటీ, తాడేపల్లి మునిసిపాలిటీలను విలీనం చేసి మంగళగిరి, తాడేపల్లి మునిసిపాలిటీగా ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 19 అమలును నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 19పై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లకు నోటీసులిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
గ్రామాల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్ను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని ధర్మాసనం తెలిపింది. జీవో 19ని సవాలు చేస్తూ తాడేపల్లి మండలం, చిర్రావూరుకు చెందిన సీర్ల లాల్చంద్, మరో ముగ్గురు ఈ ఏడాది మార్చిలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి, పిటిషనర్ల తరఫున న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment