ఆదేశాలిచ్చినా కౌంటర్లు వేయరా? | High Court reprimands government officials | Sakshi
Sakshi News home page

ఆదేశాలిచ్చినా కౌంటర్లు వేయరా?

Aug 16 2024 5:32 AM | Updated on Aug 16 2024 5:32 AM

High Court reprimands government officials

ప్రభుత్వ అధికారులపై హైకోర్టు మండిపాటు

సాక్షి, అమరావతి: తగినంత సమయం ఇస్తున్నా, ఆయా కేసుల్లో అధికారులు కౌంటర్లు దాఖలు చేయ­క­పోతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసుల విషయంలో అధికారులు మందకొడిగా ఉన్నారని, ఇలా నిద్రపోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లాలో లైమ్‌ స్టోన్‌ ఖనిజం ఉన్న భూములను అసైన్‌మెంట్‌ కింద భూమి లేని పేద­లకు ఇస్తున్నారని, దీని వెనుక బనగానపల్లి ఎమ్మె­ల్యే కాటసాని రామిరెడ్డి (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) ఉన్నారని, దీనిని అడ్డుకోవాలని కోరు­తూ అప్పటి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి (ప్రస్తు­తం ఎమ్మెల్యే) 2023లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

ఈ వ్యా­జ్యంపై గతంలో విచారణ జరిపిన సీజే ధర్మా­సనం అన్ని వివరాలతో మెరుగైన అఫిడవిట్‌ దాఖలు చేయా­లని కలెక్టర్‌ను ఆదేశించింది. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిని సుమోటోగా ప్రతివాదిగా చేరుస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తాజాగా ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి ప్రధా­న న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. గతంలో ఆదేశాల మేరకు కౌంటర్లు దాఖలు కాలేదని తెలుసుకున్న ధర్మాసనం ‘అసలు మీరు (అధికా­రులు) కోర్టును సీరియస్‌గా తీసుకుంటున్నారా.. లేదా?’ అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. 

కౌంటర్‌ దాఖలు చేసేందుకు మరో అవకాశం ఇస్తున్నామని, అయితే అసాధారణ జాప్యానికి గాను కేంద్ర కార్యదర్శికి రూ.20 వేలు, కలెక్టర్‌కు సైతం రూ.10 వేలు ఖర్చు­లు విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మొత్తాన్ని అడ్వొకేట్స్‌ క్లర్కుల సంక్షేమ నిధిలో జమ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఇలా జాప్యం చేసే ప్రతి కేసులోనూ జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ నాటికి మెరుగైన అఫిడవిట్‌ను దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ విచారణను సెప్టెంబర్‌ 11వ తేదీకి వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement