
నెల్లూరు (సెంట్రల్): రాష్ట్ర గవర్నర్ కలుగచేసుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ను తక్షణమే ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని శాసనసభ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్దన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ.. పంచాయతీరాజ్శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచాలంటూ నిమ్మగడ్డ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేయడం చెంపపెట్టు వంటిదన్నారు.
ఎన్నికల కమిషనర్ హోదాలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వర్తించాల్సిన కమిషనర్ ఏకపక్షంగా టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, హైకోర్టు కూడా తప్పు పట్టిన నేపథ్యంలో ఒక్క నిమిషం కూడా ఆయన ఆ పదవిలో ఉండటానికి అనర్హుడన్నారు. తక్షణం పదవి నుంచి వైదొలగి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి సహకరించాలన్నారు. ఇటీవల ఇద్దరు మంత్రులు ఇచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీ విచారణ చేస్తుందని, కమిటీ తీసుకునే నిర్ణయాన్ని నిమ్మగడ్డ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉండదన్నారు. నిమ్మగడ్డ చర్యల వల్ల ఏపీలో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతోందని, చేసిన తప్పులకు భారీమూల్యం చెల్లించుకోవడానికి నిమ్మగడ్డ సిద్ధంగా ఉండాలని కాకాణి అన్నారు.